Buska Smuggling: కలిసొచ్చిన సీఎం టూర్.. వైసీపీ నేతలకు కాసులే కాసులు
Buska Smuggling: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన.. వైసీపీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 22న బందర్లో సీఎం పర్యటన ఉండటంతో అధికారులు బుసక తవ్వకాలపై దృష్టి సారించటం లేదని చెబుతున్నారు. దీంతో పోతేపల్లి రైలు గేటు వద్ద మెట్ట భూముల్లో అధికార పార్టీ నేతలు 4 రోజులుగా బుసకను తవ్వి బయట అమ్ముకుంటున్నారని వారంటున్నారు. 20 టిప్పర్లు 2 ప్రొక్లెయినర్లతో రోజుకు సుమారు 600 ట్రిప్పుల బుసకను తరలిస్తున్నారని చెబుతున్నారు. ఈ అనధికార బుసక తవ్వకాలపై రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చినా.. స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. దీంతో వైసీపీ నేతలకు ముఖ్యమంత్రి బందరు పర్యటన బాగా కలిసి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి సుమారు కోటిన్నర రూపాయల విలువ చేసే బుసకను వైసీపీ నేతలు అమ్ముకున్నారని అంటున్నారు. టిప్పర్ను ఆపేదెవరులే అనే ధైర్యంతో వైసీపీ నేతలు తమకు నచ్చినట్లుగా అనధికారంగా బుసక తవ్వకాలు జరిపిస్తున్నాని ఆరోపిస్తున్నారు.