ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి - లేకపోతే వచ్చే నెలలో కార్యాచరణ ప్రకటిస్తాం: బండి శ్రీనివాసరావు
APNGO President Comments on Employee Dues: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని, లేనిపక్షంలో వచ్చే నెలలో (డిసెంబర్) సమావేశమై, కార్యచరణ ప్రకటిస్తామని.. ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హెచ్చరించారు. విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్ (G.P.F.) ఇతర నిధులు ఇంతవరకు రాలేదని వివరించారు. తెలంగాణలో ఉద్యోగులకు ఐఆర్(I.R.) పెంచిన నేపథ్యంలో ఇక్కడా కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐఆర్ పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Bandi Srinivasa Rao Comments: గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు 12 నుంచి 16 శాతం ఇంటి అద్దె భత్యం పెంచిన సందర్భంగా శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ..''ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. లేకపోతే వచ్చే నెలలో సమావేశమై కార్యచరణ ప్రకటిస్తాం. విశ్రాంత ఉద్యోగులకు జీపీఎఫ్, ఇతర నిధులు రాలేదు. ఐఆర్ పెంపుపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాలి. ఇంతవరకూ సరెండర్ లీవ్స్ డబ్బులు కూడా రాలేదు. త్వరలోనే ఆరోగ్య సేవలన్నీ సకాలంలో జరిగేలా చర్యలు తీసుకుంటాం'' అని ఆయన అన్నారు.