ETV Bharat / state

వైఎస్సార్ జిల్లాలో యథేచ్ఛగా అక్రమ డీజల్ దందా.. సీఐ, ఏఎస్సై బదిలీ

author img

By

Published : Mar 25, 2023, 10:01 PM IST

Etv Bharat
Etv Bharat

Illegal diesel danda in YSR district: వైఎస్సార్ జిల్లా రోజురోజుకు అక్రమ వ్యాపారాలకు అడ్డగా మారుతోంది. సులువుగా డబ్బును సంపాదించడమే ధ్యేయంగా..కొంతమంది అక్రమ దందాలకు తెరలేపారు. జిల్లావ్యాప్తంగా యథేచ్ఛగా తమ దందాను కొనసాగిస్తూ.. లక్షల రూపాయలను అర్జిస్తున్నారు. తాజాగా పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా డీజల్‌ను దిగుమతి చేసుకుంటూ.. దందాను సాగించటం మొదలెట్టారు. ఈ విషయం స్థానిక అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై స్థానికులు, వ్యాపారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Illegal diesel danda in YSR district: వైఎస్సార్ జిల్లా అంటే బంగారం, వస్త్ర వ్యాపారాలకు పెట్టింది పేరు. అలాంటి ప్రాంతంలో గతకొన్ని నెలలుగా అక్రమ వ్యాపారాలు విపరీతంగా విస్తరిస్తున్నాయి. సులువుగా డబ్బును సంపాదించాలన్న లక్ష్యంతో అనేక మంది అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎంచుకున్న దందాను యథేచ్ఛగా సాగిస్తూ.. లక్షల రూపాయలను అర్జిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్, మాట్కా, జూదం, అక్రమ చౌక బియ్యం, అక్రమ బంగారం, పొరుగు రాష్ట్రాల మద్యం దిగుమతి వంటి అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. తాజాగా అక్రమ డీజల్ దందాకు తెరలేపడం సంచలనంగా మారింది. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా డీజల్‌ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, ఈ విషయం అధికారులు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై ప్రజలు, వ్యాపారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమంగా కర్ణాటక డీజిల్ దిగుమతి: పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన పట్టణం కావడంతో అక్రమ దందాలు పెరిగిపోతున్నాయి. అక్రమార్కులు తమ వ్యాపారాల్లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. పరిస్థితికి అనుగుణంగా అక్రమ వ్యాపారాలను మార్చుకుంటున్నారు. అందులో భాగంగానే కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమ మార్గంలో పెద్ద ఎత్తున డీజల్‌ను దిగుమతి చేస్తున్నారు. ఏపీతో పోలిస్తే.. కర్ణాటకలో లీటరుపై సుమారు రూ. 10 వరకూ తక్కువ ఉండటంతో అక్కడి నుంచి డీజల్ తెప్పిస్తున్నారు. ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా ప్రతి నెలా లక్షల లీటర్ల ఇంధనం అక్రమ పద్దతిలో దిగుమతి అవుతోంది.

ఒక్కో ట్యాంకర్ డీజల్‌పై రూ.2 నుంచి 3 లక్షల ఆదాయం: ఈ క్రమంలో ప్రొద్దుటూరు నుంచి హైదరాబాదుకు, బెంగుళురుకు, చెన్నైకి, విజయవాడ వంటి ప్రధాన నగరాలకు బస్సులు వెళ్తుంటాయి. దీంతో పాటు జిల్లాలో ఉన్న సిమెంటు, తదితర చిన్న పరిశ్రమలకు సంబంధించిన లారీలు కూడా అధికంగా రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఆ వాహనాలకు డీజిల్ ఎక్కువ ఖర్చు అవుతుండడంతో..కర్ణాటక డీజల్‌ను ఉపయోగిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ డీజల్‌పై రూ.2 నుంచి 3 లక్షల వరకూ ఆదాయం వస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజూ ఒక ట్యాంకర్ చొప్పున నెలకు పదుల సంఖ్యలో ట్యాకర్ల ద్వారా కర్ణాటక డీజల్ దిగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రొద్దుటూరులోనే అధికంగా డీజల్ దందా: అక్రమ డీజల్ నిర్వాహకులు పెట్రోల్ బంకు తరహాలో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. మోటర్లతో పాటు పైపులు ఏర్పాటు చేసుకున్నారు. కర్ణాటక నుంచి ట్యాంకర్లలో వచ్చిన డీజల్‌ను అక్కడ నింపి అవసరమైనప్పుడు బస్సులు, ఇతర వాహనాలకు వాడుతున్నారు. ప్రొద్దుటూరుతో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోనూ కర్ణాటక డీజల్ దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై వైఎస్సార్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహిస్తే.. మరిన్ని ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అక్రమ డీజల్ దిగుమతి వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని జిల్లాలోని పెట్రోల్ బంకు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సీఐ, ఏఎస్సైలపై జిల్లా ఎస్పీ వేటు: ప్రొద్దుటూరులో బయో డీజల్, కర్ణాటక డీజల్ అక్రమంగా నిల్వ ఉంచుతున్నా.. స్థానిక పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నేరుగా ఉన్నతాధికారులే దృష్టి సారించారు. కడప ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలతో స్పెషల్ పార్టీ ఇతర శాఖల అధికారులతో కలిసి ఇటీవల ప్రొద్దుటూరులో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలు చోట్ల కర్ణాటక డీజల్ అక్ర నిల్వలను గుర్తించి సీజ్ చేయడంతోపాటు అక్రమార్కులపై కేసులు సైతం నమోదు చేశారు. అక్రమ కర్ణాటక డీజల్ వ్యవహారంపై చర్యలు తీసుకోలేదన్న కారణంతో ప్రొద్దుటూరు గ్రామీణ సీఐ మధుసూదన్ గౌడ్, ఏఎస్సై అహ్మద్ బాషాలను వీఆర్​కు బదిలీ చేస్తూ.. జిల్లా ఎస్పీ అన్బురాజన్ చర్యలు తీసుకున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.