ETV Bharat / state

"తహసీల్దార్ ఆఫీసులో లంచాలకు ప్రత్యేక కౌంటర్.. పుచ్చుకునేది ఆమె భర్తే..!"

author img

By

Published : May 21, 2022, 8:06 AM IST

Chapadu MRO husband
తహసీల్దార్​ భర్త లంచాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు

Bribe: "భూముల వివరాలు సవరించాలా..? పట్టా పుస్తకాలు కావాలా..? ఇలా రెవెన్యూ కార్యాలయానికి సంబంధించి ఏ పని కావాలన్నా.. తహసీల్దార్​ భర్తకు ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. ఆయన చేసేది ఉపాధ్యాయ వృత్తైనా.. ఉండేది మాత్రం రెవెన్యూ ఆఫీస్​లోనే. ప్రజలకు ఏ పని చేసి పెట్టాలన్నా ఆయన చేతిలో లంచాలు పెడితేనే.. ఆయన భార్య అయిన తాహసీల్దార్​ సంతకాలు చేస్తారు!" ఇదీ.. వైఎస్​ఆర్​ జిల్లా చాపాడు మండల తహసీల్దార్​పై..​ ఓ బాధితుడి ఫిర్యాదు!!

Bribe: ప్రజలకు సంబంధించిన ఏ పనులు కావాలన్నా.. వైఎస్‌ఆర్‌ జిల్లా చాపాడు మండల తహసీల్దార్ తన భర్తతో కలసి వసూళ్లకు పాల్పడుతున్నారని మైదుకూరుకు చెందిన చొక్కం ఆంజనేయులు అనే వ్యక్తి శుక్రవారం ఆర్డీవో వెంకటరమణకు ఫిర్యాదుచేశారు. తహసీల్దార్ భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ.. తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటరు గదిలో కూర్చుని రికార్డులు పరిశీలిస్తున్న చిత్రాలను వినతిపత్రానికి జోడించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

ప్రైవేటు కంప్యూటర్‌ ఆపరేటరును మధ్యవర్తిగా ఉంచుకుని పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని బాధితుడు ఆంజనేయులు పేర్కొన్నారు. చాపాడు మండలంలో అత్యధికంగా చుక్కల భూములున్నాయని, వాటిని ఆన్‌లైన్‌లో సవరించేందుకు రూ.లక్షల్లో వసూలు చేశారని ఆరోపించారు. మ్యుటేషన్‌కు రైతుల నుంచి రూ.5-10 వేలు, ఇంటి పట్టా అనుబంధ పత్రం కోసం రూ.2-5 వేలు తీసుకుంటున్నారని, పల్లవోలు రెవెన్యూలో ల్యాండ్‌ కన్వర్షన్‌, లేఅవుట్ల కోసం కాల్వలు, చుక్కల భూమి అనుమతి మంజూరుకు రూ.లక్షల్లో అవినీతికి పాల్పడినట్లు చెప్పారు. తహసీల్దారు జ్యోతి రత్నకుమారి మాట్లాడుతూ.. తనపై చేసినవి నిరాధార ఆరోపణలన్నారు. తన భర్త ఎప్పుడో ఒకసారి కార్యాలయానికి వస్తారని, కంప్యూటరు గదిలో కూర్చుని ఉంటే ఉండొచ్చని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.