ETV Bharat / state

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభం

author img

By

Published : May 31, 2022, 3:20 PM IST

Updated : May 31, 2022, 7:03 PM IST

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభం
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభం

Viveka case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభమైంది. పులివెందుల ఆర్​అండ్​బీ అతిథి గృహంలో వివేకా ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లాను అధికారులు విచారిస్తున్నారు.

Viveka murder case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభమైంది. పులివెందుల ఆర్​అండ్​బీ అతిథి గృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లాను అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఇనయతుల్లాను అధికారులు విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు ఆయన బెడ్ రూమ్​తో పాటు, బాత్ రూమ్​లో పడి ఉన్న మృతదేహాన్ని ఇనయతుల్లానే ఫొటోలు, వీడియోలు తీశారు. అతని వద్ద నుంచి కీలక సమాచారాన్ని తీసుకోవడానికి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా.. వివేకా హత్య కేసులో అల్లుడు రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్​రెడ్డితో పాటు మరికొందరిని విచారించాలని శివశంకర్ రెడ్డి భార్య దాఖలు చేసిన పిటిషన్​పై పులివెందుల న్యాయస్థానం విచారించింది. పిటిషనర్ తులశమ్మ పేర్కొన్న విధంగా రాజశేఖర్ రెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డి, బీటెక్ రవి, కొమ్మా పరమేశ్వర్​, రాజేశ్వర్ రెడ్డి, నీరుగట్టు ప్రసాద్​లపై సీబీఐ విచారణ జరిపే విధంగా ఆదేశాలివ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న న్యాయస్థానం..పూర్తి వివరాలతో తులశమ్మ వాంగ్మూలం నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను ఆగస్టు 30కి వాయిదా వేసింది.

నన్ను హత్య చేసేందుకు చూస్తున్నారు : వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన తనను అంతం చేయడానికి పులివెందులకు చెందిన వైకాపా నాయకులు కుట్ర పన్నుతున్నారని డ్రైవర్ దస్తగిరి ఆరోపించారు. గత కొద్ది రోజుల నుంచి తొండూరు మండలానికి చెందిన పెద్ద గోపాల్ అనే వ్యక్తి తరచూ తనతో.. తన కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు. తన సోదరుడు మస్తాన్​తో గొడవపడి తనను ఇష్టానుసారంగా బూతులు తిట్టడంతో పోలీస్ స్టేషన్​కు వెళ్లానని.. పోలీసులు ఎదురుగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో అతనిపై తాను చేయి చేసుకున్నానని దస్తగిరి తెలిపారు. దాన్ని కారణంగా చూపి.. పోలీసులు తనపై కేసు నమోదు చేశారని దస్తగిరి వాపోయారు. గత కొద్ది కాలంగా తనపై జరుగుతున్న కుట్ర విషయాలను సీబీఐ అధికారి రాంసింగ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు దస్తగిరి పేర్కొన్నారు. తన ప్రాణాలకు ఏం జరిగినా వైకాపా నాయకులదే బాధ్యత అన్నారు.

ఇవీ చూడండి

Last Updated :May 31, 2022, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.