ETV Bharat / state

వైఎస్​ వివేకా హత్య కేసు వారి పనే.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్‌

author img

By

Published : Feb 23, 2023, 7:11 AM IST

CBI ON VIVEKA MURDER CASE
CBI ON VIVEKA MURDER CASE

YS VIVEKA MURDER CASE UPDATES: వైఎస్​ వివేకా హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో నిందితుడుగా ఉన్న సునీల్‌ యాదవ్‌.. వివేకా హత్యకు కొన్నిగంటల ముందు.. YS అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడని CBI తెలిపింది. సునీల్‌ యాదవ్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని.. తెలంగాణ హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

CBI ON VIVEKA MURDER CASE : మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన.. సునీల్‌ యాదవ్‌ బెయిలు పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో కౌంటరు దాఖలు చేసిన సీబీఐ.. హత్య కుట్ర గురించి కొత్త విషయాలు వెల్లడించింది. వివేకా హత్యకు కొన్ని గంటల ముందు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంట్లో.. సునీల్‌ యాదవ్‌ ఉన్నట్లు వెల్లడించింది. వివేకా హత్య కోసం కదిరి నుంచి గొడ్డలి తెచ్చేందుకు వెళ్లిన.. డ్రైావర్​ దస్తగిరి రాక కోసమే సునీల్‌ యాదవ్‌.. అవినాష్‌ ఇంట్లో ఎదురుచూస్తున్నట్లు దర్యాప్తులో..తేలిందని తెలిపింది.

శివశంకర్​రెడ్డి అరెస్టు సమయంలో ఎంపీ అవినాష్​ హల్​చల్​: 2019 మార్చి 14న వివేకాతోపాటు ఉన్న ఎర్రగంగిరెడ్డి సాయంత్రం 6.14 నుంచి 6.33 గంటల మధ్య సునీల్‌కు.. రెండుసార్లు ఫోన్‌ చేసినట్లు పేర్కొంది. వివేకా హత్య వెలుగులోకి రావడానికి కొంత సమయం ముందు.. నిందితులు శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి కూడా అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారని వివరించింది. శివశంకర్‌రెడ్డిని.. అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినప్పుడు అవినాష్‌రెడ్డి తన అనుచరులతో కోర్టుకొచ్చి హల్‌చల్‌ చేసినట్లు.. కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. అవినాష్‌రెడ్డి.. శివశంకర్‌రెడ్డికి మద్దతుగా నిలిచారని, ఆయన అనుచరులు సీబీఐకి అడ్డంకులు సృష్టించారని.. వెల్లడించింది. శివశంకర్‌రెడ్డి కుమారుడి ఆసుపత్రి ప్రారంభోత్సవ ఫ్లెక్సీల్లో అవినాష్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి ఫొటోలు వేసి.. తన వెనకున్న రాజకీయ పలుకుబడిని ప్రజలకు చెప్పాలని ప్రయత్నించారని పేర్కొంది. కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సహా మరికొందరి.. వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తులో పలు అంశాలు వెల్లడయ్యాయని సీబీఐ వివరించింది.

పథకం ప్రకారమే వివేకా హత్య: 2019 మార్చి 14న అవినాష్‌రెడ్డి ఇంట్లో సునీల్‌ యాదవ్‌ ఎదురుచూస్తుండగా.. రాత్రి ఎనిమిదిన్నరకు దస్తగిరి వచ్చాడని, ఆ తర్వాత పథకం ప్రకారం భాస్కర్‌రెడ్డి రెండు ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసినట్లు సీబీఐ తెలిపింది. రాత్రి 9 నుంచి 9.30 గంటల మధ్య మద్యం తాగేందుకు వివేకా ఇంటి సమీపంలోకి రావాలంటూ.. దస్తగిరిని సునీల్‌యాదవ్‌ పిలిచాడని పేర్కొంది. 11 గంటల 45 నిమిషాల వరకూ మద్యం తాగుతూ ఉండగా.. వివేకా కారు ఆయన ఇంట్లోకి వెళ్లినట్లు గుర్తించారు. ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి అర్ధరాత్రి ఒకటిన్నర వరకూ.. మద్యం తాగుతున్న ప్రాంతంలోనే ఉన్నట్లు ఆధారాలు లభించాయని.. వివరించింది. 14వ తేదీ అర్ధరాత్రి ఒకటిన‌్నర గంటల ప్రాంతంలో సునీల్‌ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి వెనుకవైపు కాంపౌండ్‌ దాటి.. వివేకా ఇంట్లోకి ప్రవేశించారని, దీనికి గంగిరెడ్డి సహకరించాడని తెలింపింది.

అనువుగాని సమయంలో.. వారు ఎందుకొచ్చారంటూ వివేకా ప్రశ్నించగా.. డబ్బు లావాదేవీలు మాట్లాడటానికి వచ్చారని గంగిరెడ్డి ఆయనకు సర్దిచెప్పినట్లు తెలిపింది. కాసేపటికే సునీల్‌ యాదవ్‌.. దుర్భాషలాడుతూ వివేకా ఛాతిపై కొట్టడం ప్రారంభించగా.. దస్తగిరి నుంచి ఉమాశంకర్‌రెడ్డి గొడ్డలి తీసుకుని నుదుటిపై దాడి చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత డ్రైవర్‌ ప్రసాద్‌.. తనను కొట్టినట్లు వివేకాతో బలవంతంగా లేఖ రాయించి.. బాత్‌రూంలోకి తీసుకెళ్లి వివేకా తలవెనుక ఏడెనిమిదిసార్లు ఉమాశంకర్‌రెడ్డి గొడ్డలితో దాడి చేసినట్లు.. వివరించింది. సునీల్‌ యాదవ్‌ వివేకా మర్మాంగాలపై తన్నాడని, ఆ తర్వాత వారు అక్కడ నుంచి వెళ్లిపోయారని.. సీబీఐ పేర్కొంది. వివేకా ఇంటి వాచ్‌మన్‌ రంగన్న..నిందితులను గుర్తించారని,.. సాక్ష్యాల ధ్వంసంలోనూ శివశంకర్‌రెడ్డి పాత్ర ఉందని స్పష్టం చేసింది.

హత్యలో సునీల్​ యాదవ్​ కీలక పాత్ర: వివేకా హత్య కుట్ర అమల్లో.. సునీల్‌యాదవ్‌ కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ తెలిపింది. హత్యకు ముందు ఏడాదిన్నర నుంచి సన్నిహితంగా మెలిగిన సునీల్‌ను.. ఆ తర్వాత వివేకా దూరం పెట్టడంతో కక్ష పెంచుకున్నట్లు వెల్లడించింది. ఈ సమయంలోనే హత్య కుట్ర డీల్‌ విలువైన 40 కోట్లలో రూ.5 కోట్లు వాటా ఇస్తామని గంగిరెడ్డి ఆఫర్‌ చేసినట్లు పేర్కొంది. వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డిల తరఫున గంగిరెడ్డి డబ్బు తీసుకున్నాడని తెలిపింది. దస్తగిరికి సునీల్‌ యాదవ్‌.. కోటి ఇవ్వగా.. ఆ డబ్బుతో దస్తగిరి ఇల్లు కొనడానికి చేసిన ప్రయత్నాలు.. ఫలించలేదని వివరించింది. ఫలితంగా దస్తగిరి తన మిత్రుడు సయ్యద్‌ మున్నా వద్ద.. రూ.46 లక్షలు దాచినట్లు వివరించింది. 2019 మార్చి 12న వివేకా భార్య సౌభాగ్యమ్మ ఓ కార్యక్రమం కోసం హైదరాబాద్‌ వెళ్లడంతో.. అదే అదనుగా వారు పథకాన్ని అమలు చేసినట్లు వెల్లడించింది.

సెటిల్​మెంట్​లో వాటా ఇవ్వలేదనే గంగిరెడ్డి కక్ష: బెంగళూరులో జరిగిన సెటిల్‌మెంట్‌లో వాటా ఇవ్వలేదనే వివేకాపై గంగిరెడ్డి కక్ష పెంచుకున్నాడని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్లు సీబీఐ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వివేకాను చంపాలని.. దీని వెనుక పలుకుబడి ఉన్న వ్యక్తులు మద్దతిస్తారంటూ శివశంకర్‌రెడ్డి దస్తగిరితో చెప్పారని.. ఆ పెద్దలు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డేనని.. దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్లు వివరించింది. డ్రైవర్‌గా ఉండి ఏం సంపాదించావ్‌.. ఈ హత్య ఒక్కటీ చేస్తే 5 కోట్లు ఇస్తామంటూ శివశంకర్‌రెడ్డి ఎరవేసినట్లు దస్తగిరి చెప్పాడని సీబీఐ తెలిపింది. వెనుక పెద్దవాళ్లుండగా.. భయం ఎందుకంటూ సునీల్‌యాదవ్‌ కూడా.. ధైర్యం చెప్పాడని దస్తగిరి వాంగ్మూలంలో వివరించాడు.

రాజకీయ విబేధాలతేనేే కుట్రకు తెర: 2013 నుంచి తలెత్తిన రాజకీయ విభేదాలతో కుట్రకు తెర లేచిందని సీబీఐ........ అఫిడవిట్‌లో పేర్కొంది. 2013లో కాంగ్రెస్‌ను వదిలి వైసీపీలో చేరిన వివేకా.. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినట్లు గుర్తు చేసింది. ఐతే.. ఎమ్మెల్సీగా పోటీ చేయాలని ఆశించిన శివశంకర్‌రెడ్డికి టికెట్‌ ఇప్పించేందుకు భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. ముగ్గురూ వివేకాపై కక్ష పెంచుకున్నారని స్పష్టం చేసింది. వీరికి గంగిరెడ్డి సహకారం అందించాడని, 2019 నాటికి వైసీపీలో వివేకా చురుగ్గా ఉండటంతో రాజకీయ శత్రుత్వం పెరిగిందని వివరించింది.

షర్మిలను.. కడప ఎంపీ బరిలో నిలపడానికి ఒప్పించిన వివేకా.. అవినాష్‌రెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇప్పించాలని ప్రయత్నించారని.. ఈ విషయం ప్రజల్లోకి రావడంతో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి కుట్ర పన్నారని సీబీఐ తెలిపింది. సర్పంచ్​ ఎన్నికల్లో శివశంకర్‌రెడ్డి కుటుంబానికి వివేకా మద్దతు పలకకపోవడమూ కక్ష పెంచుకోవడానికి మరో కారణమని వివరించింది..

అవినాష్​కు ముందుగానే కుట్ర విషయం తెలుసు: హత్య కుట్ర గురించి అవినాష్‌రెడ్డికి ముందే తెలుసని.. సీబీఐ స్పష్టం చేసింది. హత్య తర్వాత సాక్ష్యాలు ధ్వంసం చేయడానికి.. శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి సహా మరికొందరు భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల ఇంట్లో ఉన్నారని..తెలిపింది. వేకువజామున 5 గంటల 20 నిమిషాలకు వెళ్లి సాక్ష్యాలు ధ్వంసం చేసినట్లు స్పష్టం చేసింది. వివేకా హత్య జరిగిన రోజు ఉదయం స్థానిక నేత శశికళ రాగా వివేకాకు గుండెపోటు వచ్చిందని అవినాష్‌రెడ్డి ఆమెకు చెప్పినట్లు సీబీఐ తెలిపింది. అవినాష్‌రెడ్డి తన ఫోన్‌ నుంచి.. 90002 66234 నంబర్‌కు కాల్‌ చేశాడని, తర్వాత మరో రెండు కాల్స్‌ చేశాడని వెల్లడించింది.

అనంతరం.. పీఏ రాఘవరెడ్డి ఫోన్‌తో అప్పటి పులివెందుల సీఐ శంకరయ్యకు కాల్‌ చేసి.. వివేకా గుండెపోటుతో రక్తవాంతులు చేసుకుని చనిపోయారని, భద్రత కోసం పోలీసులను పంపాలని కోరారు. పోలీసులను పంపిన సీఐ సంఘటనా స్థలానికి వెళ్లలేదని, హత్య విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచి, సహజమరణంగా కట్టు కథ అల్లారని స్పష్టం చేసింది. నిందితులు హత్యాస్థలిని శుభ్రం చేసి, వివేకా గాయాలకు కట్టుకట్టి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపింది.

హత్యకేసులో సాక్షుల ప్రభావితం: శివశంకర్‌రెడ్డికి సన్నిహితుడైన ఎస్‌.గంగాధర్‌రెడ్డి, సీఐ శంకరయ్య, ఎంవీ కృష్ణారెడ్డిలను.. కుట్రదారులు ప్రభావితం చేసినట్లు సీబీఐ తెలిపింది. హత్యా నేరాన్ని భరిస్తే అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తారని శివశంకర్‌రెడ్డి చెప్పినట్లు గంగాధర్‌రెడ్డి తమతో చెప్పాడని వివరించింది. ఐతే మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చేసరికి..సీబీఐ బెదిరిస్తోందంటూ మీడియాకు ఎక్కిన గంగాధర్‌రెడ్డి.. గతేడాది జూన్‌లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు సీబీఐ తెలిపంది. సీఐ శంకరయ్య కూడా.. తమకు చెప్పిన విషయాలు మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి.. నిరాకరించినట్లు వివరించింది. అప్పట్లో విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేయగా విధుల్లో చేరాడని, ఉదయ్‌రెడ్డి కూడా దర్యాప్తు సంస్థపైనే ఫిర్యాదు చేశాడని.. సీబీఐ తెలిపింది.

ఈ దశలో సునీల్​కు బెయిల్​ ఇవ్వడం సరికాదు: వివేకా హత్య కేసులో సునీల్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషించారని.. ఈ దశలో బెయిలు ఇవ్వడం సరికాదంది. హత్య తర్వాత సునీల్‌ గోవా పారిపోయాడని.. ఇప్పుడు బెయిలిస్తే మళ్లీ పారిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. అందువల్ల బెయిలు పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది.

వైఎస్​ వివేకా హత్య కేసు వారి పనే

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.