ETV Bharat / state

'మాన్సాస్ ట్రస్టులో తప్పులు జరిగితే అప్పుడెందుకు విచారణ చేయలేదు'

author img

By

Published : Jun 19, 2021, 4:35 PM IST

విజయనగరంలో తెదేపా సమావేశం
విజయనగరంలో తెదేపా సమావేశం

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్​పై ప్రభుత్వం జారీ చేసిన జీవోలు తప్పుడు ఆలోచనలతో ఇచ్చినట్లు రుజువైందని తెదేపా మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ అన్నారు. వాస్తవాలు పక్కనపెట్టి మంత్రి వెల్లంపల్లి, ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పదవిపై హైకోర్టు తీర్పు, వైకాపా నేతల వ్యాఖ్యలపై విజయనగరం జిల్లా తెదేపా నేతలు స్పందించారు. తెదేపా మాజీ ఎమ్మెల్సీ ద్వారాపురెడ్డి జగదీష్, అరకు తెదేపా పార్లమెంట్ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి విజయనగరంలోని అశోక్ బంగ్లాలో సమావేశం నిర్వహించారు. తొలుత ద్వారాపురెడ్డి జగదీష్ మాట్లాడుతూ... మాన్సాస్ ట్రస్టు చైర్మన్​పై ప్రభుత్వం జారీ చేసిన 71, 72, 73, 74 జీవోలు తప్పుడు ఆలోచనతో ఇచ్చిందని రుజువైందన్నారు.

వాస్తవాలు పక్కనపెట్టి మంత్రి వెల్లంపల్లి, ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మాన్సాస్ ట్రస్టుల్లో తప్పులు జరిగితే సంచైత ఛైర్మన్​గా 14 నెలలు ట్రస్ట్ వారి అధీనంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ చేయలేదని ఆయన ప్రశ్నించారు. తూర్పు గోదావరిజిల్లాలోని ట్రస్టు భూముల్లో ఇసుక తవ్వకాలకు సంచైత సంతకం పెట్టారని గుర్తు చేసిన ఆయన... ఆమెను అరెస్ట్ చేయగలరా..? అని ఆయన ధ్వజమెత్తారు.

అరకు తెదేపా పార్లమెంట్ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ.. కోర్టు తీర్పును కూడా వక్రీకరించి మాట్లాడటం వారి మానసిక స్థితిని తెలియజేస్తోందన్నారు. వేల ఎకరాల ఆస్తులను దానం ఇచ్చిన కుటుంబం పూసపాటి వంశం వారిదని.. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అశోకగజపతి రాజు అక్రమాలకు పాల్పడ్డారంటే ప్రజలు నమ్ముతారా..? అని అన్నారు. విజయసాయిరెడ్డి జైలుకి వెళ్లి రావడం వల్ల పదేపదే అందరిని జైలుకి పంపుతాం అంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:

EAMCET: ఎంసెట్‌కు బదులుగా.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.