ETV Bharat / state

విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌లో 'ఏపీ పెవిలియన్'లో స్టాళ్లను ఏర్పాటు

author img

By

Published : Mar 4, 2023, 10:34 AM IST

Updated : Mar 4, 2023, 1:00 PM IST

Global Investors Summit Stalls : పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించేలా గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌లో 'ఏపీ పెవిలియన్'లో స్టాళ్లను ఏర్పాటు చేశారు. శ్రీ సిటీలో తయారయ్యే ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. కేంద్ర మంత్రి గడ్కరీ వివిధ స్టాల్స్‌ను సందర్శించి, వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.

Etv Bharat
Etv Bharat

Global Investors Summit Stalls : విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్- 2023 కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 150 కి పైగా స్టాళ్లను ప్రదర్శనకు ఉంచారు. ఏపీకి చెందిన 30 స్టాళ్లతో పాటు ప్రభుత్వం గుర్తించిన 13 కీలక రంగాలకు చెందిన స్టాళ్లను తీర్చిదిద్దారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించేలా గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌లో 'ఏపీ పెవిలియన్'లో స్టాళ్లను ఏర్పాటు చేశారు. శ్రీ సిటీలో తయారయ్యే ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ తొలి రోజు ఏపీ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ఆకట్టుకుంది. పారిశ్రామిక, ప్రభుత్వ వాణిజ్య సంస్థలు ఏపీ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్‌, కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభించారు. వివిధ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, మహిళా సంఘాలు, హస్త కళాకారులు ఉత్పత్తులను ఈ స్టాల్స్‌లో ప్రదర్శించారు. కేంద్ర మంత్రి గడ్కరీ వివిధ స్టాల్స్‌ను సందర్శించి, వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.

శ్రీ సిటీలో తయారు చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, ఇతర ఉత్పత్తులను ఆ స్టాల్ లో ప్రదర్శించారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్లో హస్త కళలు, పర్యాటక ప్రదేశాల విశేషాలను తెలియ జేసేలా నమూనాలు ఉంచారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ వంటి సంస్థలూ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సెంచూరియన్ వర్సిటీ విద్యా సంస్థలు, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన సైనిక హెలికాప్టర్లు, తేజస్ యుద్ధ విమానం నమూనాలు, ఇతర సైనిక ఉత్పత్తులను ప్రదర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీరును ప్రదర్శనలో ఉంచారు. నైపుణ్యాభివృద్ధి, ప్రకృతి వ్యవసాయం, మహిళా స్వయం శక్తి సంఘాలు, ఆప్కో, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, పునరుత్పాదక ఇంధన వనరులు లాంటి ప్రభుత్వ శాఖల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఐటీసీ ఉత్పత్తులు, కియా విద్యుత్ కార్ల ప్రదర్శన, సౌరవిద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వం తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో తొలి రోజు దాదాపు పదకొండున్నర లక్షల రూపాయిల ఒప్పందాలు జరిగాయి. ఈ రోజు మరో లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరగనున్నాయి. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. పరిశ్రమల స్థాపనకు వచ్చేవారికి ఏ అవసరమొచ్చినా ఒక్క ఫోన్‌కాల్‌ దూరంలో ఉంటానని చెప్పారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్​ది ముఖ్య పాత్ర అని వివరించారు. ఇవాళ్టితో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ముగియనుంది.

ఇవీ చదవండి

Last Updated :Mar 4, 2023, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.