ETV Bharat / state

అట్టహాసంగా విశాఖ 'గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు'.. తొలిరోజు ఎన్ని కోట్ల ఒప్పందాలు జరిగాయంటే..?

author img

By

Published : Mar 3, 2023, 10:46 PM IST

Updated : Mar 4, 2023, 9:14 AM IST

Global Investors Summit
Global Investors Summit

Global Investors Summit-2023 today total updates: విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈరోజు ఉదయం 10 గంటలకు 'ఎడ్వాంటేజ్ ఏపీ' నినాదంతో.. 'గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు' ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఒక్క రోజులో రూ.13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని.. ఈ ఒప్పందాల వల్ల 60 వేల ఉద్యోగాలు వస్తాయని ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్‌ మొదటి రోజు సదస్సు వివరాలను వెల్లడించారు.

ముగిసిన తొలిరోజు విశాఖ 'గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు'..

Global Investors Summit-2023 today total updates: విశాఖపట్నం వేదికగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత మొదటిసారిగా ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌)ను 'ఎడ్వాంటేజ్‌ ఏపీ' నినాదంతో ఈరోజు ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సదస్సును.. ముఖ్యమంత్రి జగన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరగనున్న సదస్సుకు మొదటి రోజు పలువురు కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు హాజరై, ఒప్పందాలు చేసుకున్నారు.

తొలిరోజు సదస్సుకు హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు: అందులో ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజాలు అయిన.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, జీఎంఆర్‌ గ్రూపు అధినేత జి. మల్లికార్జున రావు, సయంట్‌ అధినేత మోహన్‌రెడ్డి, అదానీ పోర్ట్స్‌ సీఈవో కరణ్‌ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా, టాటా కంపెనీ ఛైర్మన్‌ నటరాజన్‌, హైదరాబాద్‌లో ఉన్న భారత్ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల పాల్గొన్నారు.

తొలిరోజు రూ.13 లక్షల కోట్ల ఒప్పందాలు: సదస్సులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు చర్చాగోష్ఠులు జరిగాయి. వివిధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై మంత్రులతో, పారిశ్రామికవేత్తలు చర్చించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తలపెట్టిన.. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో తొలి రోజు దాదాపు రూ.13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో పారిశ్రామికవేత్తలు వేదికపైనే ఒప్పందాల పత్రాలను మార్చుకున్నారు.

ఏపీలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరిస్తూనే పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. దేశంలో రెండెంకెల వృద్ధి రేటు సాధిస్తున్న రాష్ట్రంగా, సహజ వనరులు అపార అవకాశాలు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని తెలియజేశారు. దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎంతో కీలకంగా మారిందని.. రాష్ట్రంలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం: అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ హయాంలో రహదారుల అభివృద్ధి వేగం పుంజుకుందని.. సరకు రవాణా ఖర్చును తగ్గించాలని చూస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే.. తిరుపతి జిల్లాలో ఇంట్రా మోడల్‌ బస్‌ పోర్ట్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌కి నేరుగా 55 కిలోమీటర్ల మేర రహదారి ఏర్పాటుకు ఆరువేల కోట్ల రూపాయల ప్రాజెక్టును మంజూరు చేస్తున్నామని నితిన్ గడ్కరీ ప్రకటించారు.

సదస్సులో గందరగోళం: మరోవైపు పెట్టుబడిదారుల సదస్సులో సమన్వయ లోపం గందరగోళానికి దారి తీసింది. పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు.. రిజిస్ట్రేషన్ ఏరియాలోకి వచ్చి కిట్ల కోసం చాలా సమయం వేచి చూశారు. కొందరికి కిట్లు లభించడం వల్ల మిగిలినవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గందరగోళంలో కిట్లను పంపిణీ చేసే ప్రదేశంలో ఉన్న ఫర్నిచర్ టెంట్‌ను పీకి పారేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారందరినీ బయటికి పంపించేశారు. ముఖ్యమంత్రి కేంద్రమంత్రి ప్రధాన హాల్లో ఉన్న సమయంలోనే పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా ప్రాంగణంలోకి వచ్చేందుకు బార్లు తీరారు. వారిని ప్రాంగణంలోకి పంపించేందుకు కూడా పోలీసులు నిరాకరించడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంగణంలోకి వచ్చి కిట్లు తీసుకుందాం అనుకునే వారికి అవి అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్వాహకుల సమన్వయ లోపం- వందల పాసులు జారీ: రెండు రోజులపాటు జరగనున్న ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 డెలిగేట్ ఏంట్రీ పాసుల విషయంలో పోలీసులు, జిల్లా అధికారులు, ఈవెంట్ నిర్వాహకుల సమన్వయ లోపం కారణంగా వందల మందికి పాసులను జారీ చేశారు. ఆన్‌లైన్‌లో కేవలం ప్రాథమిక సమాచారంతో వివరాలను పొందుపరిచిన ప్రతి ఒక్కరికి ఈవెంట్ నిర్వాహకులు పాసులు జారీ చేయడంతో.. పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద విద్యార్థులు, నగరవాసులు, సోషల్ మీడియా నిర్వాహకులు డెలిగేట్ పాసుల కోసం క్యూలైన్లలో నిల్చోని పాస్‌లు తీసుకున్నారు. సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, బడా పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులు హాజరుకానుండడంతో నిఘా వర్గాల సూచనల మేరకు గురువారం అర్ధరాత్రి అధికారులు సమావేశమై దిద్దుబాటు చర్యలను చేపట్టారు.

డెలిగేట్ పాసు విషయంలో పోలీసులు సందిగ్ధం: సదస్సులో పాల్గొనే ప్రైవేట్ ఆర్గనైజేషన్ డెలిగేట్స్‌కు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి సదస్సు ప్రవేశానికి అనుమతిస్తామని, స్టూడెంట్ డెలిగేట్స్‌కు 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి సదస్సుకు ప్రవేశానికి అనుమతిస్తామని గురువారం అర్ధరాత్రి పోలీసులు ప్రకటన విడుదల చేశారు. దీంతో వారి సూచించిన సమయాల్లో సదస్సులో ఎటువంటి కార్యక్రమాలు లేకపోవడం గమనార్హం. ఎవరు బయటి వారో?, ఎవరు పెట్టుబడిదారులో? అర్ధంకాక గేటు బయట డెలిగేట్ పాసు ఉన్నవారిని అడ్డుకుంటే ఏం జరుగుతుందోనని పోలీసులు సందిగ్ధంలో ఉన్నారు.

యువతకు 60 వేల ఉద్యోగాలు వస్తాయి: మొదటి రోజు సదస్సులో రూ.13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. ఇవాళ్టి ఒప్పందాల వల్ల 60 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. 20 రంగాల్లో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి రాష్ట్రంలోని సహజ వనరులు దోహదం చేస్తాయన్నారు. రేపు ఉదయం 10 నుంచి 11.30 మధ్య మరో 240 ఒప్పందాలు జరగనున్నాయని ఆయన పేర్కొన్నారు. తొలిరోజు జరిగిన ఒప్పందాల్లో ఎనభై శాతం ఖచ్చితంగా కార్యరూపం దాల్చుతాయని అమర్‌నాథ్‌ ఒప్పందాల వివరాలను వెల్లడించారు.

‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023’ తొలిరోజు ఒప్పందాలు ఇవే..

  • ఎన్టీపీసి ఎంవోయూ (రూ.2.35 లక్షల కోట్లు)
  • ఏబీసీ లిమిటెట్‌ ఎంవోయూ (రూ.1.20 లక్షల కోట్లు)
  • రెన్యూ పవర్‌ ఎంవోయూ (రూ.97, 550 కోట్లు)
  • ఇండోసాల్‌ ఎంవోయూ (రూ.76, 033 కోట్లు)
  • ఏసీఎమ్‌ఈ ఎంవోయూ (రూ.68,976 కోట్లు)
  • టీఈపీఎస్‌ఓఎల్‌ ఎంవోయూ (రూ.65,000 కోట్లు)
  • జేఎస్‌డబ్యూ గ్రూప్‌ (రూ.50, 632 కోట్లు)
  • హంచ్‌ వెంచర్స్‌ (రూ.50 వేల కోట్లు)
  • అవాదా గ్రూప్‌ (రూ. 50 వేల కోట్లు)
  • గ్రీన్‌ కో ఎంవోయూ (47, 600 కోట్లు)
  • ఓసీఐఓఆర్‌ ఎంవోయూ (రూ.40 వేల కోట్లు)
  • హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ (రూ.30వేల కోట్లు)
  • వైజాగ్‌ టెక్‌ పార్క్‌ (రూ.21,844 కోట్లు)
  • అదానీ ఎనర్జీ గ్రూప్‌ (రూ.21, 820 కోట్లు)
  • ఎకోరెన్‌ ఎనర్జీ (రూ.15,500 కోట్లు)
  • సెరంటికా ఎంవోయూ (రూ.12,500 కోట్లు)
  • ఎన్‌హెచ్‌పీసీ ఎంవోయూ (రూ.12 వేల కోట్లు)
  • అరబిందో గ్రూప్‌ (రూ.10, 365 కోట్లు)
  • ఓ2 పవర్‌ ఎంవోయూ (రూ.10 వేల కోట్లు)
  • ఏజీపీ సిటీ గ్యాస్‌ (రూ.10 వేల కోట్లు)
  • జేసన్ ఇన్‌ఫ్రా ఎంవోయూ (రూ. 10వేల కోట్లు)
  • ఆదిత్య బిర్లా గ్రూప్‌ (రూ.9,300 కోట్లు)
  • జిందాల్‌ స్టీల్‌ (రూ.7500 కోట్లు)
  • టీసీఎల్‌ ఎంవోయూ(రూ. 5,500 కోట్లు)
  • ఏఎం గ్రీన్‌ ఎనర్జీ (రూ. 5,000 కోట్లు)
  • ఉత్కర్ష అల్యూమినియం (రూ. 4,500 కోట్లు)
  • ఐపోసీఎల్‌ ఎంవోయూ (రూ. 4,300 కోట్లు)
  • వర్షిణి పవర్‌ ఎంవోయూ (రూ, 4,200 ‍కోట్లు)
  • ఆశ్రయం ఇన్‌ఫ్రా (రూ.3,500 కోట్లు)
  • మైహోమ్‌ ఎంవోయూ (3,100 కోట్లు)
  • వెనికా జల విద్యుత్‌ ఎంవోయూ (రూ. 3000 కోట్లు)
  • డైకిన్‌ ఎంవోయూ (రూ. 2,600 కోట్లు)
  • సన్నీ ఒపోటెక్‌ ఎంవోయూ (రూ.2,500 కోట్లు)
  • భూమి వరల్డ్‌ ఎంవోయూ (రూ. 2,500 కోట్లు)
  • అల్ట్రాటెక్‌ ఎంవోయూ (రూ. 2,500 కోట్లు)
  • ఆంధ్రా పేపర్‌ ఎంవోయూ (రూ. 2 వేల కోట్లు)
  • మోండాలెజ్‌ ఎంవోయూ (రూ.1,600 కోట్లు)
  • అంప్లస్‌ ఎనర్జీ (రూ.1,500 కోట్లు)
  • గ్రిడ్‌ ఎడ్జ్‌ వర్క్స్‌ ఎంవోయూ (రూ. 1,500 కోట్లు)
  • టీవీఎస్‌ ఎంవోయూ (రూ. 1,500 కోట్లు)
  • హైజెన్‌కో ఎంవోయూ (రూ. 1,500 కోట్లు)
  • వెల్స్‌పన్‌ ఎంవోయూ (రూ. 1,500 కోట్లు)
  • ఒబెరాయ్‌ గ్రూప్‌ (రూ. 1,350 కోట్లు)
  • దేవభూమి రోప్‌వేస్‌ (రూ 1,250 కోట్లు)
  • సాగర్‌ పవర్‌ ఎంవోయూ (రూ.1,250 కోట్లు)
  • లారస్‌ గ్రూప్‌ (రూ. 1,210 కోట్లు)
  • ఎలక్ట్రో స్టీల్‌ క్యాస్టింగ్స్‌ (రూ. 1,113 కోట్లు)
  • డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ (రూ. 1,110 ‍కోట్లు)

ఇవీ చదవండి

Last Updated :Mar 4, 2023, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.