ETV Bharat / state

Visakha Steel Plant Privatization: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఆందోళన.. నిర్వాసితుల గోడు పట్టదా సీఎం సారూ..!

author img

By

Published : Aug 16, 2023, 11:26 AM IST

Visakha Steel Plant Privatization: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. అంటూ ముక్తకంఠంతో నినదించి సాధించుకున్న ప్రతిష్ఠాత్మక కర్మాగారం అది. ఎన్నో త్యాగాలు.. ఆందోళనలు.. బలిదానాల అనంతరం అవతరించిన ఆధునిక దేవాలయం విశాఖ ఉక్కు కర్మాగారం. అడిగిందే తడవుగా 64 గ్రామాల ప్రజలు తాము నమ్ముకున్న భూమిని అప్పగించారు. తమ భూముల్లో ఏర్పాటయ్యే ఫ్యాక్టరీ వల్ల ఎందరికో ఉపాధి లభిస్తుందనీ.. తమకూ ప్రయోజనం చేకూరుతుందని నమ్మారు. దశాబ్దాలుగా నిర్వాసితులుగా మిగిలి పోయినా.. ఇచ్చిన హామీలు నెరవేరకపోతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం చేస్తారనే సమాచారంతో.. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటా అని నిర్వాసితులు ఆందోళనకు గురవుతున్నారు.

Visakha_Steel_Plant_Privatization
Visakha_Steel_Plant_Privatization

Visakha Steel Plant Privatization: రాష్ట్రానికే తలమానికమైన విశాఖ ఉక్కును అన్యాక్రాంతం చేస్తామని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొడుతున్నా జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం చేతలుడిగి చూస్తోంది. కనీసం కర్మాగారం కోసం నిర్వాసితులుగా మారిన వారికి న్యాయం చేసే విషయంలోనూ శ్రద్ధ చూపడం లేదు.. ఆస్తులు అమ్ముతున్నా.. బాధితుల పక్షాన మాట్లాడకుండా కళ్లూ చెవులూ మూసుకుంది.

Vizag Steel: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు

ప్రైవేటీకరణ విషయంలో మరో ఆలోచనే లేదని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా విశాఖలోని ప్లాంటు ఆస్తుల అమ్మకానికి పచ్చజెండా ఊపింది. నగరం నడిబొడ్డున ఉన్న కోట్ల రూపాయల విలువైన భూములు అమ్మగా వచ్చే సొమ్ముతో నిర్వాసితుల సమస్యలు తీర్చాలన్న డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది. ప్లాంటులో మిగులు భూములను సైతం నిర్వాసితులకు కేటాయించాలని కోరుతున్నారు. ప్రభుత్వం గోడు ఆలకించకపోతే ఆందోళన ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Vizag Steel Plant జగనన్న.. విశాఖ ఉక్కుకోసం ఓ బటన్ నొక్కండి! కార్మిక సంఘాల వేడుకోలు..!

ఉక్కు కర్మాగారానికి భూములు త్యాగం చేసిన నిర్వాసితుల కుటుంబాల్లో.. మూడో తరం వచ్చినా నేటికి పరిహారం చేతికందలేదు. ప్లాంటు కోసం నెల్లిముక్కు, సిద్ధేశ్వరం, నడుపూరు, గంగవరం, దిబ్బపాలెం, కణితి, అప్పికొండ, వడ్లపూడి, కొండయ్యవలస పంచాయతీల పరిధిలోని 64 గ్రామాల్లో 22 వేల ఎకరాల భూమి సేకరించారు. నిర్వాసితుల ఆందోళనలతో మెరకకు 17 వేలు, వరి పొలాలకు 20వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఈ పరిహారాన్నిలోక్అదాలత్ సమక్షంలో అందజేయగా.. కొందరు రైతులు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇలా 12వేల 680 ఎకరాలకు సంబంధించిన 17.08 కోట్లు రాష్ట్రపతి పేరుతో లోక్అదాలత్​లో అలాగే ఉండిపోయింది. గ్రామ సభలు పెట్టి రైతుల వారసులు, యాజమాన్య హక్కు ఉన్న వారికి పరిహారం ఇవ్వాలని 2021 మార్చి 20న న్యాయస్థానం ఆదేశించినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.

Rudraraju Met Rahul Gandhi: 'విశాఖ ఉక్కు, ఇతర సమస్యలపై రాహుల్‌ గాంధీకి వినతిపత్రం ఇచ్చాం'

ఉద్యోగ నియామకాల్లో నిర్వాసితులకు 50 శాతం కోటా ఇవ్వాలన్న కేంద్రం ఉత్తర్వుల అమలు స్టీల్ ప్లాంటులో మొక్కుబడిగా జరుగుతోంది. నిర్వాసితులకు 'ఆర్-కార్డు మంజూరు చేసి.. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీ అమలు కావడం లేదు. స్టీలు ప్లాంటు సబ్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజిలో 15వేల 475 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 8,009 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు.

మరో 7,466 మంది ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. వీరిలో చాలా మంది వయసు పైబడటంతో ఆర్-కార్డులను వారసులు పేరున మార్చినా ఉద్యోగాలు అందలేదు. ఉద్యోగం రాక, కోల్పోయిన సంపాదనను నష్ట పరిహారంగా అందించాలని, ఉద్యోగం రాని ఆర్-కార్డు దారులందరికీ 'ఉక్కు' మిగులు భూముల్లో స్థలాలు కేటాయించాలని ఉక్కు నిర్వాసితుల సంఘం నాయకులు గొందేసి సత్యారావు డిమాండ్ చేశారు.

Vishaka Steel Plant : విశాఖ ఉక్కును మూడు నెలల్లో లాభాల్లోకి తెస్తాం! ప్రతిజ్ఞ చేసిన సీఎండీ,డైరక్టర్లు ..

విశాఖలోని ఉక్కు ఆస్తుల విక్రయంపై రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తాజాగా ప్రకటనలు జారీ చేసింది. విశాఖ హెచ్బీ కాలనీలో 22.90 ఎకరాల్లో ఉన్న 588 క్వార్టర్లను అమ్మేందుకు నిర్ణయించారు. ఇక్కడ భూమి విలువ బహిరంగ మార్కెట్లో 1,380 కోట్ల వరకు ఉంటుంది. అలాగే ఆటోగనర్​లోని 2 ఎకరాల పరిధిలో ఉన్న 76 ఇళ్లను, పెదగంట్యాడలోని 434.75 చదరపు గజాల్లో ఉన్న స్థలాన్ని అమ్మకానికి పెట్టారు.

వీటి విలువ దాదాపు 120 కోట్ల వరకు ఉంటుంది. ఈ మూడు ఆస్తులూ అమ్మగా వచ్చే డబ్బును ఉద్యోగాలు కల్పించని వారికి జీవన భృతి కింద ఇవ్వాలని, అలాగే నిర్వాసితులకు సంబంధించి ఖజానాలో ఉన్న 17.08 కోట్ల పరిహారానికి అదనంగా కలిపి చెల్లించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్లాంటులో వినియోగంలోలేని 9 వేల ఎకరాల పైచిలుకు భూమిని ఆర్-కార్డు కలిగిన 7,466 మందికి కేటాయించాలని కోరుతున్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారానికి భూములిచ్చిన చాలా మందికి పరిహారం అందలేదు. వృద్ధాప్యం వచ్చినా ఉద్యోగం రాకపోవడంతో.. ఆర్‌-కార్డులను పిల్లల పేరుపై మార్చినా ఇదే దుస్థితి నెలకొందని వాపోతున్నారు. ఉన్న పింఛన్‌ సైతం కొంతమందికి ప్రభుత్వం తొలగించడంతో జీవనోపాధి ఎలా అని వారంతా ఆవేదన చెందుతున్నారు.

Steel Plant: విశాఖ ఉక్కు కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.