ETV Bharat / state

Vizag Steel: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు

author img

By

Published : May 3, 2023, 4:52 PM IST

Agitation : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ...ఉక్కు కార్మికులు రాస్తారోకో చేపట్టారు. ఉక్కు ఉద్యమ కార్యాచరణ సమితి పిలుపు మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘాలు, వామపక్షాలు నేతలు రాస్తారోకో చేపట్టారు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు బలవంతపు అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు.

STEEL
STEEL

విశాఖ కోసం ఉక్కు పోరాటం

Agitation for Visakha Steel: ఉక్కు ఉద్యమ కార్యాచరణ సమితి పిలుపు మేరకు.. విశాఖ కూర్మన్నపాలెం, అగనంపూడి ప్రధాన రహదారులు, మండల కేంద్రాల్లో కార్మికులు, ఐఎన్​టీయూసీ వామపక్షాలు రాస్తారోకో నిర్వహిస్తున్నాయి. ప్రధాని మోడీ.. అదానీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి . అలాగే ప్రాణత్యాగాలతో సాధించి, నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్​ను అమ్మాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. కూర్మన్నపాలెం జాతీయ రహదారిని ఉక్కుపోరాట కమిటి దిగ్బంధించటంతో.. పోలీసులు పోరాట కమిటీ నాయకులు రామచంద్రరావు, ఆదినారాయణ, అయోధ్యరామ్​లను అరెస్టు చేశారు.

గాజువాకలో నిరసన: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. గాజువాకలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రాస్తారోకోకు టీడీపీ, వైసీపీ, వామపక్ష నాయకులు మద్దతు తెలిపారు. ప్రాణత్యాగాలతో సాధించి నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్​ను అమ్మాలని చూస్తే ఊరుకోమని వామపక్ష నాయకులు హెచ్చరించారు. నిరసన తెలుపుతున్న పల్లా శ్రీనివాసరావు, సీపీఎం నాయకులు నర్సింగరావు తదితర నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

విజయవాడలో ఆందోళన: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విజయవాడలోనూ ఆందోళనలు కొనసాగాయి. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంజీ రోడ్డు నుంచి వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం వద్ద వామపక్ష, కార్మిక, రైతు సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు.. ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

గుంటూరులో రాస్తారోకో : ఉక్కు పరిరక్షణ వేదిక పిలుపులో మేరకు గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ వద్ద వామపక్ష పార్టీ నేతలు, కార్మిక సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఆందోళన చేస్తున్న వామపక్ష నాయకులను ఆరండల్ పేట పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.

కడపలో ధర్నా: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ కడపలోని బిఎస్ఎన్​ఎల్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ... సీఐటీయు నాయకులు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉక్కు ప్రైవేటీకరణపై నోరు మెదపకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రైవేటీకరణను నిలిపవేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఎన్టీఆర్ జిల్లాలోనూ నిరసన: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో.. ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడిలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గొల్లపూడిలో పోలీసులు గృహనిర్భందం చేశారు. రాస్తారోకోలకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

కృష్ణా జిల్లా గన్నవరం, శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, అనకాపల్లిలో వామపక్షనేతల రాస్తారోకో: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ...కృష్ణా జిల్లా గన్నవరం, శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, అనకాపల్లిలో వామపక్షనేతలు రాస్తారోకో నిర్వహించారు. వామపక్షనాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.