ETV Bharat / state

వలంటీర్​ ఇంట అక్రమ మద్యం... పశువుల మేతలో కర్ణాటక సరకు!

author img

By

Published : Jan 13, 2021, 12:52 PM IST

wine caught
అక్రమ మద్యం స్వాధీనం

అక్రమ మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా... అక్రమార్కుల్లో మార్పు రావటం లేదు. ఓ చోట వలంటీర్​గా విధులు నిర్వర్తిస్తన్న వ్యక్తి ఇంట్లో అక్రమ మద్యం దొరకకగా.. మరో చోట పశువుల మేత మాటున అక్రమంగా మద్యాన్ని తరలించేందుకు ప్రయత్నించారు.

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం నారాయణరాజుపేటలో వలంటీర్​గా విధులు నిర్వర్తిస్తున్న కాద అప్పలరాజు ఇంట్లో... 270 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో.. వలంటీర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 270 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొన్నారు. అప్పలరాజు ఇచ్చిన సమాచారంతో పద్మనాభ మండలం రెడ్డిపల్లి ఆకిరి శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించగా.. 2640 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని, అప్పలరాజు, శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో మెుత్తం 2910 మద్యం సీసాలను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీటి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

కర్నూలులో పశువుల మేత మాటున కర్ణాటక మద్యం:

ట్రక్కులో పశువులకు మేత తరలిస్తున్నామని చెప్పిన కొందరు వ్యక్తుల మాటలు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేసిన పోలీసులు విస్తుపోయారు. లోపల చూస్తే మొత్తం మద్యం పెట్టెలే దర్శనమిచ్చాయి. మంత్రాలయం మండలం మాధవరం సరిహద్దు కేంద్రం వద్ద ఈ సంఘటన జరిగింది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఆదోని డీఎస్పీ వినోద్‌ కుమార్‌ విషయాలను వెల్లడించారు. మాధవరం ఎస్సై టి.బాబు, సెబ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఖాజామొహిద్దీన్, సిబ్బంది కలిసి కర్ణాటక సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇదే.. సమయంలో కర్ణాటక నుంచి బొలెరోలో వరి గడ్డి నింపుకున్న వస్తున్న వాహనం కనిపించింది. సిబ్బంది నిలిపి వివరాలను ఆరా తీశారు. అందులో ఉన్న వ్యక్తులు పొంతన లేని వివరాలు చెప్పడంపై అనుమానంతో... సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐ వేణుగోపాలరాజు తనిఖీలు చేశారు. గడ్డి తొలగించి చూస్తే 60 పెట్టెల మద్యం గుర్తించారు. ఒక్కో పెట్టెలో 96 ప్యాకెట్లు ఉన్నాయి. వీటి విలువ రూ.6 లక్షల ఉంటుందని పోలీసులు తెలిపారు. రాయచూరు జిల్లా లింగన్‌కాన్‌ చెందిన ఈడిగ భీమేష్, దేవునపల్లికి చెందిన అంజినయ్య, బజారప్పలను అరెస్టు చేశారు.

చిత్తూరు జిల్లా: ప్రభుత్వ వాహనం బోర్డు... కర్ణాటక మద్యం తరలింపు

చిత్తూరు జిల్లా సరిహద్దులో కర్ణాటక నుంచి ఇన్నోవా వాహనంలో మద్యం తరలిస్తూ ఐదుగురు నిందితులు పట్టుబడ్డారు. తిరుపతికి చెందిన సత్యనారాయణ నలుగురు యువకులతో కలిసి కర్ణాటక నుంచి మద్యాన్ని అక్రమంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు వేసుకున్నాడు. ఇందుకోసం ఇన్నోవాకు ప్రభుత్వ వాహనం అనే బోర్డును ఏర్పాటు చేసి... 55 వేల విలువైన 240 కర్ణాటక మద్యం బాటిళ్లు తరలించేందుకు ప్రయత్నించారు. సరిహద్దు వద్ద పోలీసుల తనిఖీల్లో మద్యం సీసాలు బయటపడటంతో.. నిందితులపై కేసు నమోదు చేసి, అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు యువకులు డిగ్రీ చదువుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

గుట్కా స్వాధీనం

కృష్ణా జిల్లా నందిగామలో ఎస్‌ఈబీ పోలీసులు గుట్కా స్థావరాలపై దాడులు నిర్వహించారు. నందిగామ మయూరి టాకీస్ సమీపంలో నాగుల్ మీరా అనే గుట్కా వ్యాపారి వద్ద లక్ష రూపాయలు విలువచేసే గుట్కా స్వాధీనం చేసుకున్నారు. నాగుల్‌ మీరాను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

సంక్రాంతి రుచులపై ధరాభారం.. 50% పైగా పెరిగిన సరకుల ఖర్చు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.