ETV Bharat / state

అర్హత నిరూపించుకోకుంటే పింఛను శాశ్వతంగా రద్దు.. రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరిక

author img

By

Published : Dec 26, 2022, 7:27 AM IST

Pensions: అనర్హత పేరిట పింఛనుదార్లపై రాష్ట్ర ప్రభుత్వం పిడుగులు వేస్తోంది. పొంతన లేని కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షా 60 వేల మందికి తాఖీదులు ఇచ్చింది. 15 రోజుల్లో అర్హత నిరూపించుకోకుంటే.. శాశ్వతంగా పింఛన్లు రద్దు చేస్తామని హెచ్చరించింది.

Pensions
పింఛన్లు

Pensions: వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ఇతర పింఛనుదారుల్లో ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. అలాంటి వారికి సామాజిక భద్రత పింఛన్లే పెద్ద భరోసా. ఇలాంటి పేదలపై వైసీపీ ప్రభుత్వ చర్యలు పిడుగుల్లా పడుతున్నాయి. తప్పుడు తడకల సర్వేను ప్రాతిపదికగా తీసుకుని.. అర్హులను కూడా అనర్హుల జాబితాలోకి చేర్చేస్తుండటంతో లబ్ధిదారులు భోరుమంటున్నారు. తాజాగా లక్షా 60 వేల మంది పింఛనుదారులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కారు, పొలం లేకున్నా ఉన్నట్లు, 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగించకున్నా వాడినట్లు.. పొంతన లేని కారణాలతో నోటీసులు జారీ చేసినవే భారీగా ఉన్నాయి. తాత్కాలికంగా పింఛను నిలిపేశామని, నోటీసు అందుకున్న 15 రోజుల్లో అర్హతను నిరూపించుకోకపోతే శాశ్వతంగా రద్దు చేస్తామని స్పష్టంగా చెప్పేసింది.

పింఛనుదార్లకు అనర్హత తాఖీదులు

గతంలో చేసిన పల్స్‌ సర్వేతోపాటు వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేసిన నవశకం సర్వేలోనూ చాలా వరకు తప్పులు నమోదయ్యాయి. వాలంటీర్ల ద్వారా చేయిస్తున్న హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ సైతం తప్పుల తడకే. చాలా ప్రాంతాల్లో ఆధార్‌ సంఖ్యలను తప్పుగా నమోదు చేశారు. ఈ సర్వేల ప్రాతిపదికగానే ప్రభుత్వం పింఛన్లను తనిఖీ చేయిస్తోంది. దీనివల్ల అర్హులు కూడా అనర్హుల జాబితాలో చేరుతున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా నోటీసులిస్తూ పింఛనుదార్లను ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. లేని కారణాన్ని ఉన్నట్లు చూపిస్తూ, అర్హత నిరూపించుకోవాలని చెబుతుండటంతో.. లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు.

మొత్తం ఆరు దశల తనిఖీలో అనర్హులుగా గుర్తించిన వారి పింఛను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది. ఆ నోటీసులను లబ్ధిదారుకు లేదా వారి కుటుంబసభ్యులకు అందించి ధ్రువీకరణ తీసుకోవాలని.. సచివాలయాల సంక్షేమ కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. ఒక్కో సచివాలయంలో కనీసం 5 నుంచి 40 మంది పింఛనుదారులకు నోటీసులు వచ్చాయి. వీరిలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు ఎక్కువ మంది ఉన్నారు. నోటీసులు వచ్చిన 15 రోజుల్లో వివరణను రాతపూర్వకంగా తెలియజేయాలని, అర్హత ఉంటే ధ్రువపతాన్ని సమర్పించాలని తెలిపారు. లేకుంటే శాశ్వతంగా పింఛను నిలిపేస్తామని స్పష్టం చేశారు. దీనిపై సెర్ప్‌ అధికారులను వివరణ కోరగా.. నోటీసులు అందిన వారికి కూడా జనవరి 1న పింఛను ఇస్తామన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పింఛను నిలిపేయబోమని చెప్పారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.