ETV Bharat / state

అల్లుడి చేతిలో అత్త హతం.. ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

author img

By

Published : Jun 25, 2023, 8:16 AM IST

Son in law kill aunty in vijayawada
విజయవాడలో అల్లుడి చేతిలో అత్త హతం

AP Crime News: నడిరోడ్డుపై అత్తను దారుణంగా నరికి చంపి అల్లుడు పరారయ్యాడు. ఈ ఘటన విజయవాడలో కలకలం సృష్టించింది. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వైపు ఓ వ్యక్తి మద్యం మత్తులో దంపతులపై దాడి చేసిన ఘటన రాజాంలో చోటు చేసుకుంది.

AP Crime News : విజయవాడ శివారు చనుమోలు వెంకట్రావు పైవంతెనపై అల్లుడి చేతిలో అత్త హతమైన ఘటన కలకలం సృష్టించింది. జక్కంపూడి జెఎన్ఎన్​యూఆర్ఎం కాలనీకి చెందిన గొగుల నాగమణికి తన రెండో అల్లుడితో విభేదాలున్నాయి. వీటిపై కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో అత్తమామలపై కక్ష పెంచుకున్న అల్లుడు రాజేష్.. వారిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. గురుస్వామి, నాగమణిలు సాయిరాం థియేటర్‌ వద్ద ఉన్న తన పెద్ద కుమార్తె ఝూన్సీ వద్దకు వెళ్లేందుకు శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై కాలనీ నుంచి బయలు దేరారు.

అప్పటికే రెక్కీ నిర్వహించిన అల్లుడు రాజేష్‌.. అత్తమామలు వెళ్లడాన్ని గమనించి వెంబడించాడు. వారు చనుమోలు వెంకట్రావు వంతెనపై నుంచి వస్తుండగా సరిగ్గా వంతెన పైభాగంలో పాలఫ్యాక్టరీ మలుపు తిరిగే వద్ద నిదానంగా వెళ్లడాన్ని పరిశీలించాడు. ఇదే అదనుగా భావించి తనతో తెచ్చుకున్న కొబ్బరిబొండాల కత్తితో.. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున అత్త నాగమణి చేతిపై నరికాడు. దీంతో ఒక్కసారిగా అరుస్తూ ఆమె వాహనంపై నుంచి కింద పడింది. వెంటనే మెడపై కర్కశంగా నరకడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది.ద్విచక్రవాహనంపై ఉన్న మామపై దాడికి యత్నించగా ఆయన పరారయ్యారు.

వైఎస్‌ఆర్‌ కాలనీ బ్లాక్‌ నంబరు 68లో గోగుల గురుస్వామి, నాగమణి(50) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఝూన్సీ, లలిత, మణి ముగ్గురు సంతానం. రెండో కుమార్తె లలితకు, ఏకలవ్యనగర్‌కు చెందిన కుంభా రాజేష్‌తో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. ప్రస్తుతం అతడు ఫుడ్‌ కోర్టులోని బిర్యానీ పాయింట్‌లో పని చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నడిచాయి. ఏడాది కిందట విడాకులు కావాలని లలిత కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. 15 రోజుల కిందట వాయిదాకు వెళ్లారు. మళ్లీ వచ్చే వాయిదాకి విడాకులు ఇచ్చే అవకాశం ఉండటంతో అత్త, మామ కాపురానికి పంపకుండా తన భార్యను సమర్థిస్తున్నారనే అక్కసుతో అల్లుడు రాజేష్‌ వారిపై కక్ష పెంచుకున్నాడు. తన కాపురానికి అత్త అడ్డుపడుతోందని భావించి ఈ హత్యకు పథక రచన చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్నిపోస్టుమార్టమ్‌ నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AP Crime News: మరదలిపై హత్యాయత్నం.. గిరిజన మహిళపై అత్యాచారం

కోడుమూరులో ఘోర రోడ్డు ప్రమాదం .. ఇద్దరు మృతి : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే కోడుమూరు పట్టణం పెట్రోల్ బంక్ సమీపంలో ఐచర్ వాహనం, టాటా యుటిలిటీ వాహనము ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచరాం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కర్నూలులోని ఆసుపత్రికి, మరి కొంత మందిని కోడుమూరులోని హాస్పిటల్​కి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణం అయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రాజాంలో భార్య భర్తలపై బీరు బాటిల్​తో వ్యక్తి దాడి : రాష్ట్రంలో మద్యం తాగి రోడ్లపై వీరంగాలు చేస్తున్న సంఘటనలో కోకోలలు. ఇలాంటి సంఘటనే విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సంతకటి మండలం తాలాడ గ్రామానికి చెందిన చందర్రావు భార్య శైలజతో కలిసి ద్విచక్ర వాహనంపై రాజాం పట్టణం షాపింగ్ కోసం వెళ్లారు. రాజాం ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ వద్ద రోడ్డుపై బైక్​పై వెళ్తున్న భార్యాభర్తలపై బలిజీపేట మండలంకు తుమరాడ గ్రామానికి చెందిన దేవరాజ్ అనే వ్యక్తి రోడ్డుపై మద్యం తాగి వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం దంపతులపై బీరు బాటిల్​తో దాడి చేశాడు. ఈ దాడిలో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. అడ్డుకునే ప్రయత్నంలో ఆమె భర్త చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మద్యం మత్తులో తాగి ఉన్న దేవరాజును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.