ETV Bharat / state

ఉద్యోగుల ఉద్యమం ఉధృతం.. కలెక్టరేట్ల ఎదుట ఏపీ అమరావతి జేఏసీ ధర్నా

author img

By

Published : Apr 12, 2023, 5:42 PM IST

pensioners Protest: రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఏపీ అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘం ధర్నా చేపట్టింది. విజయనగరం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆర్థిక సమస్యలను కూడా పట్టించుకోక పోగా... కనీసం ఉద్యోగులు, పెన్షర్లకు సంబంధించిన లెక్కలూ ప్రభుత్వం వెల్లడించలేదని ఆరోపించారు.

Govt Employees Protest
ఏపీ అమరావతి ఐకాస

Govt Employees Protest: రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఏపీ అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘం ధర్నా చేపట్టింది. ధర్నా కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఏపీ అమరావతి ఐకాస ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా

విజయనగరం జిల్లా: ఇందులో భాగంగా విజయనగరం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత నెల 9నుంచి ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం చేపట్టిన తొలి దశ ఉద్యమం పూర్తయిందన్నారు. ఆర్థిక, ఆర్థికేతర అంశాలకు సంబంధించి., ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందనే సానుకూల దృక్పథంతో చిన్నచిన్న నిరసన కార్యక్రమాలు చేపట్టాం. సమస్యలు పరిష్కారం కోసం ఇన్నిరోజులు వేచి చూసినా, ప్రభుత్వం స్పందించలేదని వాపోయారు. ఆర్థిక సమస్యలను కూడా పట్టించుకోక పోగా., కనీసం ఉద్యోగులు, పెన్షర్లకు సంబంధించిన లెక్కలూ ప్రభుత్వం వెల్లడించలేదన్నారు. డబ్బులు వాయిదాల పద్దతిల్లో చెల్లించినా పర్వాలేదు., వాటికి సంబంధించిన లెక్కలు చెప్పకపోతే మా పరిస్థితి ఏంటని బొప్పరాజు ప్రశ్నించారు. పీఆర్సీ విషయంలో కమిషన్ చెప్పిన పే స్కేల్ నేటికీ ఇవ్వలేదన్నారు.

పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వటంతో పాటు., డీఏ బకాయిలను సైతం ఉద్యోగులకు చెల్లించిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఏపీలో మాత్రం నెలవారి జీతాలు కూడా ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయంలో ఉన్నట్లు తెలిపారు. కేంద్ర నిధులతో ముడిపడిన విద్య, వైద్య శాఖల ఉద్యోగుల పరిస్థితి రాష్ట్రంలో మరింత దారుణంగా ఉందన్నారు. అంతేకాదు., రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సీఎఫ్ఎంఎస్ విధానం., ట్రెజరీ వ్యవస్థను నిర్వీర్యం చేయటమే కాకుండా., ప్రభుత్వ ఉద్యోగులకు ఉరితాడులా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం రెండో విడత ఉద్యమాన్ని నేటి నుంచి ప్రారంభించిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించే వరకు గాంధేయ వాదంలో ఏపీ జేఏసీ ఆందోళన కొనసాగిస్తుందని బొప్పరాజు తెలియచేశారు. ఇందులో భాగంగా ఈ నెల 18న ఉపాధ్యాయులు, సీపీఎస్ ఉద్యమం, 25న ఒప్పంద, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా, 29న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసన చేపడతామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

విజయవాడ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఈశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధన కోసం రెండో విడత ఉద్యమం చేపట్టామన్నారు. శాంతియుతంగా చేసిన పోరాటంతో ప్రభుత్వం దిగి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 52 పేజీల డిమాండ్లతో సీఎస్ కు లేఖ ఇచ్చామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగులకు వేలకోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వడం లేదన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పోరాటం కొనసాగిస్తున్నామని... ఉద్యోగులను అవహేళనగా మాట్లాడడం మానుకోవాలన్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్ వద్ద ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. సీపీఎస్ రద్దు కరువు భత్యం చెల్లింపు విషయంలో శాంతియుత పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని నాయకుడు శ్రీరామ్ మూర్తి ఆరోపించారు. కనీసం చర్చలకు కూడా పిలవడం లేదని నేటికి 35 రోజులుగా నిరసనలు తెలుపుతున్న ప్రభుత్వం స్పందించలేదని అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.