ETV Bharat / state

దుర్గ గుడి పాలకమండలి సమావేశం.. 18 అంశాలపై చర్చ

author img

By

Published : Feb 27, 2023, 9:08 PM IST

Durgamalleswara Swamy Devasthanam : ఇంద్రకీలాద్రికి వచ్చే సామాన్య భక్తులకు ప్రసాదంగా కుంకుమ ఇవ్వాలని నూతన పాలకమండలి తీర్మానించింది. విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్ధం దుర్గాఘాట్‌ నుంచి కొండపైకి రెండు ఉచిత బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. సుమారు 18 అజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు.

Durgamalleswara Swamy Devasthanam
Durgamalleswara Swamy Devasthanam

Durgamalleswara Swamy Devasthanam : విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే సామాన్య భక్తులకు సైతం ఉచితం ప్రసాదంగా కుంకుమ ఇవ్వాలని నూతన పాలకమండలి తీర్మానించింది. పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు అధ్యక్షతన, అధికారులతో బోర్డు సభ్యులు తొలి సమావేశం నిర్వహించారు. సుమారు 18 అంశాలపై వారు చర్చించారు. వాటికి అనుబంధంగా మరికొన్ని విషయాలపైనా అధికారులను సభ్యులు ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఈవో భ్రమరాంబ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్​ కోటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు. దేవస్థానానికి వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా అమ్మవారి అశీస్సులు అందరికీ ఉండాలని.. దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ప్రతీ సామాన్య భక్తులకు సటారీ ఇవ్వడంలో రద్దీగా లేని ప్రదేశాలు చూసి వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లకు ఆమోదం తెలిపారు.

అంతరాలయం, ఉపాలయాల్లోనే కాకుండా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు సటారీ ఇచ్చేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తూ పాలకమండలి తీర్మానించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కింద నుంచి పైకి వెళ్లడానికి.. పైనుంచి కిందకు రావడానికి వారి సౌకర్యార్ధం దుర్గాఘాట్‌ నుంచి కొండపైకి రెండు ఉచిత బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. భక్తులకు ఉచితంగా కొండకు ఎగువన కానీ.. దిగువన కానీ చెప్పులు భద్రపరచుకునే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని ఆమోదించారు. పంచహారతుల టిక్కెట్టు కొనుగోలు భక్తులకు అంతరాలయ దర్శనం లేదా లడ్డూ ప్రసాదం ఉచితంగా ఇవ్వాలని సూచించింది. లక్ష రూపాయలు, ఆపైన అమ్మవారికి కానుకగా ఇచ్చే భక్తులకు నెలకి ఒకసారి ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించాలని పాలక మండలి నిర్ణయించింది.

రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకునే ముందుగానే ఇంద్రకీలాద్రి కొండపైన, కొండ దిగువన శివాలయం మెట్లు, కనకరదుర్గా నగర్‌లోనూ వెదురుతో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తీర్మానిస్తూ.. అందుకు సంబంధించిన నిధుల ఖర్చుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. 30 కోట్ల రూపాయలతో అన్నదాన భవనం నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు పాలక మండలి ఆమోదించింది. దీంతో పాటుగా 2023-24 ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌, ఆదాయ వ్యయ ప్రతిపాదనలను పచ్చజెండా ఊపింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా దుర్గాఘాట్‌ వద్ద కృష్ణా నదిలో స్నానం చేసేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడంపై వస్తోన్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని.. ఆధునికీకరణ పనులు, సౌకర్యాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించినట్లు పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.