ETV Bharat / state

మద్య నిషేదం, నిషేదం అంటూనే.. 3 పెగ్గులు, 6 గ్లాసులుగా బెల్టు షాపులు

author img

By

Published : Nov 27, 2022, 1:13 PM IST

Belt Shops in AP రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందని అని చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే వీధి చివర, ఇంటి పక్కన.. ఇలా ఎక్కడ చూసినా మద్యం బెల్టు షాపులే. ఫోన్‌ కొడితే ఇంటికే మద్యం డెలివరీ అవుతోంది. బైక్‌లు, ఆటోల్లో సంచార దుకాణాల్లోనూ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి, అధికారులు చెప్పే మాటలన్నీ నీటిమూటలేనని.. వాస్తవం వేరని చెప్పడానికి రాష్ట్రంలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్న బెల్టుషాపులే సాక్ష్యాలు. స్థానిక వైకాపా నాయకులు, కీలక కార్యకర్తల అండదండలతో 3 పెగ్గులు, 6 గ్లాసులుగా ఈ వ్యాపారం వర్థిల్లుతోంది. ఊళ్లని మత్తులో ముంచేస్తున్న బెల్టుషాపుల దుకాణాలపై కథనం .

Belt Shops
బెల్టు షాపులు

సంపూర్ణ మద్యం నిషేదం అంటూ.. ఊళ్లలో ఏరులై పారుతున్న మద్యం

Government On Belt Shops: "ఏదైనా గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంటు ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ బెల్టు షాపులు లేని గ్రామం లేదు. ఫోన్‌ కొడితే మినరల్‌ వాటర్‌ వస్తుందో లేదో తెలియదు కానీ, మద్యం సీసాలను నేరుగా ఇంటికే వస్తోంది. మద్యపాన నిషేదం గురించి చెప్తున్నాను వెయ్యి మంది నివసిస్తున్నా గ్రామంలో పది మంది మహిళ పోలీసులను నియామించి.. గ్రామాలలో బెల్టు షాపులు లేకుండా చేస్తాం. మందు కావాలి అంటే నియేజకవర్గ హెడ్​ క్వార్టర్స్​లో మాత్రమే లభిస్తుంది. అది కూడా మద్యం తాగే వారు నిరుత్సహపడే ధరకు మాత్రమే" ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు బెల్టుషాపులపై జగన్‌ అన్న మాటలివి.

అలాగే రాష్ట్రంలో ఒక్క బెల్టు దుకాణం కూడా లేకుండా చేశామని.. 2019 డిసెంబర్‌ 16న అసెంబ్లీలో సీఎం హోదాలో జగన్‌ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 43 వేల దుకాణాలను నడిపారని.. ప్రతి మనిషినీ ఎలా తాగుబోతును చేయాలా అనే ఆలోచనతోనే గత ప్రభుత్వం మద్యం దుకాణాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్క బెల్టు దుకాణం లేకుండా చేశామని.. అసెంబ్లీ వేదికగా గర్వంగా చెబుతున్నానని ప్రకటించుకున్నారు.

2020 మే 6న నిర్వహించిన సమీక్షలోనూ సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపితే బెల్టు షాపులుండవని మాట మార్చేశారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మద్యం దుకాణాలు ఉంటే వారి లాభాపేక్ష కోసం, విక్రయాలను పెంచుకోవడానికి బెల్టు షాపులు పుట్టుకొస్తాయని చెప్పుకొచ్చారు. 43 వేల బెల్టు దుకాణాలను తొలగించామని పునరుద్ఘాటించారు..

రాష్ట్రంలో ఎక్కడా బెల్టుషాపు అన్నదే లేకుండా తొలగించేశామన్న ముఖ్యమంత్రి జగన్‌ మాటలకు.. ఇప్పుడున్న క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏ మాత్రం పొంతన లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఏ జిల్లాలో చూసినా బెల్టుషాపులే. చిల్లర దుకాణాలు, కిళ్లీ కొట్లు, ఫాస్ట్‌పుడ్‌ సెంటర్లు, దాబాలు, కిరాణా కొట్లు, కూల్‌డ్రింక్‌ షాపులు ఎక్కడ చూసినా మద్యం అమ్మకాలే. మరికొందరైతే ఇళ్లనే బెల్టుషాపులుగా మార్చేసి నడిపిస్తున్నారు. ప్రభుత్వ దుకాణాల నుంచే వీటికి మద్యం సరఫరా అవుతోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో జిల్లాకు ఒక గ్రామం చొప్పున ‘ఈటీవీ-ఈనాడు ప్రతినిధులు పరిశీలించారు. 26 జిల్లాలోని 26 గ్రామాల్లో మొత్తం 154 బెల్టుషాపులు లెక్క తేలాయి. తక్కువలో తక్కువ ఊరికి రెండు, మూడు నడుస్తున్నాయి. ఈ దుకాణాల నిర్వహణలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతిపరులదే ప్రధాన పాత్ర.

రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతోంది. సరఫరా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేయాలంటే అధికార పార్టీ పెద్దలకు భారీ మొత్తంలో కమీషన్‌ ఇవ్వాలని, అలా ఇచ్చిన కంపెనీల బ్రాండ్లు మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో విక్రయిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బెల్టుషాపుల ద్వారా ప్రజల్ని దోచుకుంటున్నారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా గతంలో ఉన్న పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశామని సీఎం జగన్‌ వివిధ సందర్భాల్లో ప్రకటించారు. ఇప్పుడు ఏ బెల్టుషాపు వద్ద చూసినా సరే ‘పర్మిట్‌’ లేని రూమ్‌లే కనిపిస్తున్నాయి. వాటిలో అడ్డగోలు అమ్మకాలే దర్శనమిస్తున్నాయి.

బెల్టు షాపులకు ప్రభుత్వ దుకాణాల నుంచే మద్యం సరఫరా అవుతోంది. అక్కడ పనిచేసే సిబ్బంది.. బెల్టు షాపుల నిర్వాహకులతో చేతులు కలిపి వారికి సహకరిస్తున్నారు. ఒక్కో సీసాపై అదనంగా 10 నుంచి 15 రూపాయల చొప్పున తీసుకుని కావాల్సినవన్నీ అందిస్తున్నారు. బెల్టు షాపులవారు వాటిని గ్రామాలకు తీసుకెళ్లి.. ఆ రేటుపై అదనంగా మరో 30 నుంచి 40 రూపాయలు వసూలు చేసి మందుబాబులకు అమ్ముతున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో 130 రూపాయలు ఉండే క్వార్టర్‌ సీసా.. బెల్టు షాపుల్లో 180 రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఈ రేటు ఇంకా పెరుగుతుంది. కొన్ని చోట్ల ప్రభుత్వ దుకాణాల్లో పనిచేసే సిబ్బందే నేరుగా.. బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు.

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం కొత్తవీరాపురంలో ఏడాదిపాటు 4 బెల్టు షాపుల నిర్వహణ కోసం ఈ మే నెలలో స్థానిక వైసీపీ నాయకులు వేలం పాట నిర్వహించగా.. కొందరు 70 వేల రూపాయలకు దక్కించుకున్నారు. గ్రామంలో బెల్టు షాపుల ఏర్పాటును వ్యతిరేకించిన వారితో, వారి కుటుంబసభ్యులతో.. ప్రజలు మాట్లాడొద్దంటూ దండోరా వేయించడం వైసీపీ నాయకలు బరితెగింపునకు పరాకాష్ఠ. దీంతో వారంతా ఏకమై గ్రామంలో బెల్టుషాపులు తొలగించాలని ఆందోళన చేశారు. అయినా ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. మద్యపానాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్‌.. గ్రామస్థాయిల్లోనూ పెంచుకుంటూ పోవడమేంటని మహిళలు, గ్రామస్థులు నిలదీస్తున్నారు. కుటుంబాలను నాశనం చేస్తున్న మద్యపానాన్ని, బెల్టుషాపులను నిర్మూలించాలని డిమాండ్ చేస్తున్నారు.

"మా నాన్నకు రోజుకు 500 రూపాయలు వస్తాయి. వాటిని తాగేందుకు వినియోగిస్తున్నారు. అదికాకుండా తాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నారు. దీనికి కారణం మందే.. మందు దుకాణాలను నిర్మూలిస్తామన్న జగన్​ ప్రభుత్వం నిర్మూలించటం లేదు." -కొత్తవీరాపురం గ్రామస్థురాలు

శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం గ్రామంలోని కిళ్లీ కొట్టు అచ్చంగా ఓ బెల్టు దుకాణమే. దీని పక్కనే ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం తెరిచి ఉన్నా, మూసి ఉంచినా.. ఈ పాన్‌ షాపులో ఎప్పుడు కావాలన్నా సరకు దొరుకుతుంది. ఇలాంటివి ఈ ఊళ్లో నాలుగున్నాయి. పూల కొట్లు, కిరాణా దుకాణాల్లోనూ కొందరు బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. వాటిలో కొన్ని గ్రామ సచివాలయం ఎదురుగానే నడుస్తున్నాయి. దీన్ని బట్టి ఎవరైనా ఫిర్యాదు చేస్తారేమో అనే భయం వారిలో ఏ కోశాన లేదనేది అర్థమవుతోంది. ఏకంగా మహిళల చేతనే బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మిస్తున్నారు. ఇలా చేస్తే ఎలాంటి గొడవా ఉండదనే ఉద్దేశంతోనే.. స్థానిక వైసీపీ నాయకులే వారిని వెనకుండి నడిపిస్తున్నారని మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

"మహిళలను బెల్టు షాపుల్లో ఉంచి మద్యం వాళ్ల చేత అమ్మిస్తున్నారు. ఒక పక్క బెల్టు షాపుల లేవని ప్రభత్వం చెప్తోంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నారు. నీళ్ల సీసాలు అమ్మినట్లు అమ్ముతున్నారు. ఇకనైనా ప్రభుత్వం పట్టించుకుని సంపూర్ణ మద్యపాన నిషేదం చేపట్టి.. మహిళలకు మేలు చేయాలని కోరుతున్నాము." -మహిళ సంఘం నేతలు

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజుపూడిలో కిళ్లీ కొట్టు ముసుగులో బెల్టుషాపులు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇక్కడ ఇలాంటివి 10 ఉన్నాయి. కిళ్లీ కొట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు వెనుక భాగంలో గ్రీన్‌నెట్‌తో చిన్న గదులు ఏర్పాటు చేసి వాటిని బార్లుగా మార్చేస్తున్నారు. మందుబాబులకు కావాల్సిన ఆహారం, గ్లాసులు వంటిని సరఫరా చేస్తూ అదనంగా సంపాదిస్తున్నారు. బాపట్ల జిల్లా చందోలులో కాల్వ కట్టకు సమీపంలో బెల్టు దుకాణాలున్నాయి. ఒక్క ఫోన్‌ చేస్తే చాలు బైక్‌పై వచ్చి మద్యం సీసాలు అందించే మొబైల్‌ దుకాణాలనూ కొందరు నడిపిస్తున్నారు. 6 వేల జనాభా ఉన్న విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో 16 బెల్టు షాపులున్నాయి. వీటి నిర్వహణలో కీలక పాత్రధారులైన నలుగురు వ్యక్తులు ప్రభుత్వ దుకాణాల్లో మద్యం కొని బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వైఎస్సార్‌ జిల్లా బ్రహ్మంగారిమఠంలో ఆలయ పరిసర ప్రాంతాల్లోనే బైక్‌లపై బెల్టుషాపులు నడుస్తున్నాయి. కొందరు యువకులు మద్యం సీసాలను పెట్టుకుని.. బైక్‌లపై తిరుగుతూ అడిగిన వారికి సరఫరా చేస్తున్నారు. కోనసీమ జిల్లా రావులపాలెం, పల్నాడు జిల్లా పాటిబండ్లలో కొందరు బెల్టుషాపుల నిర్వాహకులకు ఫోన్‌ కొడితే చాలు ఇంటికే మద్యం తెచ్చి అందిస్తున్నారు. మరికొందరైతే ఆటోలనే మొబైల్‌ బెల్టుషాపులుగా మార్చేశారు. విశాఖ జిల్లా గండిగుండంలోని ఓ రెండు బెల్టుషాపుల వద్ద కూర్చొని తాగేందుకు ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో బెల్టుషాపుల నిర్వాహకులు కొందరు మద్యానికి బాగా బానిసైన వారిని గుర్తించి వారితో ప్రభుత్వ దుకాణాల వద్ద నుంచి మద్యం కొనిపిస్తున్నారు. ప్రతిగా వారికి 90 మిల్లీలీటర్లు ఉచితంగా పోస్తున్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లే కూలీలకు అరువుపై మద్యం ఇస్తున్నారు. సాయంత్రానికి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఇళ్లల్లోనూ బెల్టుషాపులు నడుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్నిచోట్లా ఇదే పరిస్థితి. నెల్లూరు జిల్లాలోని పలుకూరివారిపాలెం, జంగాలపల్లిలో గడ్డివాములు, పశువుల కొట్టాల్లో మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లులో ఓ ఇంట్లో మద్యం సీసాలు నిల్వ ఉంచి రోజూ వచ్చేవారికి అమ్ముతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసంలో కొందరు ఇళ్లలోనే బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా మద్దికెరలో ప్రభుత్వ మద్యం దుకాణానికి సమీపంలోని కొన్ని ఇళ్లలోనే బెల్టుషాపులు నడుస్తున్నాయి. కైకలూరు, కంచికచర్ల, పెద్దనాగులవరం వంటి ప్రాంతాల్లో బడ్డీకొట్లు, శీతల పానీయాల దుకాణాలు, చిల్లరకొట్లలో బెల్టుషాపులు నడుస్తున్నాయి. రావులపాలెంలో ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోనే బెల్టుషాపులు నడిపిస్తున్నారు. అనకాపల్లి జిల్లా కశింకోట, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో టీ, టిఫిన్ దుకాణాలు, కిళ్లీ కొట్లలో యథేచ్ఛగా మద్యం అమ్ముతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం గరుగుతండాలో 3 బెల్టు షాపులు నడిపిస్తున్నారు. కొంత మంది ఇళ్లలో నిల్వ ఉంచి తెలిసినవారికి అమ్ముతున్నారు. మరికొందరు కిరాణా దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ముదిగుబ్బలోని ప్రభుత్వ దుకాణాల నుంచి వీటికి మద్యం సరఫరా అవుతోంది. కర్ణాటక నుంచి అరటిపండ్ల లోడుతోపాటు మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. చాలా చోట్ల బెల్టు షాపులు 24 గంటలూ అందుబాటులో ఉంటున్నాయి.

ఏలూరు జిల్లా కైకలూరులో వైసీపీ మద్దతుదారులు, కార్యకర్తలు 15 బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. వీటిలో రోజుకు సగటున లక్ష రూపాయల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లులో స్థానిక వైసీపీ నాయకుల మద్దతుతో 3 బెల్టుషాపులు నడుస్తున్నాయి. ఏపీ మద్యంతోపాటు కర్ణాటక మద్యాన్ని ఇక్కడ టెట్రా ప్యాక్‌లలతో అమ్ముతున్నారు. వైకాపా ఎమ్మెల్యే నంబూరి శంకర్‌రావు దత్తత గ్రామమైన పల్నాటి జిల్లా పాటిబండ్లలో వైకాపా సానుభూతిపరులే బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా పెద్దనాగులవరంలో వైకాపా నాయకుల మద్దతుతో బెల్టుషాపులు నడుస్తున్నందనే ఫిర్యాదు చేయడానికి జంకుతున్నట్లు గ్రామస్థులు చెప్పడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. ఫిర్యాదులు చేసినా చాలా సందర్భాల్లో వాటిపై చర్యలు ఉండట్లేదన్న విమర్శలున్నాయి. మద్యం అక్రమ రవాణా, అడ్డగోలు విక్రయాలను అరికట్టాల్సిన ఎస్​ఈబీ సిబ్బంది ఇటువైపు కన్నెత్తి చూడట్లేదు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దాబాల్లోనూ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.