శ్రీశైలంలో లడ్డూ సరకుల ధరలు దారుణం: రెడ్డివారి చక్రపాణి రెడ్డి

author img

By

Published : Jan 11, 2023, 10:23 AM IST

meeting

Prices of Laddu Making Goods High in Srisailam: శ్రీశైలం దేవస్థానంలో లడ్డూ తయారీ సరుకుల ధరలు దారుణంగా ఉన్నాయని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు. 20 ఏళ్ల నుంచి ఒకే కాంట్రాక్టర్ ఏ విధంగా సరుకులు సరఫరా చేయగలుగుతారని.. అధికారుల సహకారం లేనిదే జరగదన్నారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలన్నారు.

Prices of Laddu Making Goods High in Srisailam: శ్రీశైలం దేవస్థానంలో లడ్డూ తయారీ కోసం గుత్తేదారు సరఫరా చేస్తున్న సరకుల ధరలు దారుణంగా ఉన్నాయని, నవంబరు నెలకు సంబంధించి పరిశీలిస్తే మార్కెట్‌ కంటే రూ.42 లక్షలు తేడా ఉందని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి తెలిపారు. తేడాను అరికట్టకపోతే ఈ వ్యత్యాసం పెరిగిపోతుందని, టెండర్‌ రద్దు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.

మంగళవారం శ్రీశైలంలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. అనంతరం చక్రపాణిరెడ్డి విలేకరులకు పలు అంశాలు వెల్లడించారు. దేవస్థానంలో పడితరం సరకుల సరఫరాకు 20 ఏళ్ల నుంచి ఒకే గుత్తేదారు.. తన వాళ్లు ముగ్గురి పేర్ల మీద టెండర్లు వేస్తూ, అసాధారణ ధరలు వేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్‌లో జీసీసీ వారు కిలో జీడిపప్పు రూ.690కే ఇస్తామని ముందుకు వస్తుంటే, ఇక్కడి గుత్తేదారు శ్రీశైల దేవస్థానానికి రూ.960కు సరఫరా చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

మొదటిరకం యాలకులు కిలో రూ.1590 పలుకుతుండగా, ఇక్కడ రూ.4,100లకు కోట్‌ చేసిన విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. సాంబారు, రసం పొడి ధరల్లోనూ వ్యత్యాసం ఉందని చెప్పారు. కొన్ని నెలల కిందటే ఈ విషయాలను గుర్తించి, టెండర్‌ రద్దు చేయాలని తీర్మానం చేసి దేవదాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపినా ఇంతవరకు స్పందన లేదని పేర్కొన్నారు. దేవస్థానం అధికారుల వైఖరిలోనూ నిర్లక్ష్యం కనిపిస్తుందని ఛైర్మన్‌ అసహనం వ్యక్తం చేశారు.

టెండర్‌ రద్దు చేయాలని మంగళవారం జరిగిన సమావేశంలో మరోసారి తీర్మానం చేసినట్లు ఛైర్మన్‌ చెప్పారు. దేవదాయశాఖ కమిషనర్‌, ప్రిన్సిపల్‌ కార్యదర్శి చర్యలు తీసుకోకపోతే దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.