ETV Bharat / state

కర్నూలు వైసీపీ ఆఫీస్​.. ఆర్టీసీ స్థలంపై నేతల కన్ను

author img

By

Published : Jan 15, 2023, 1:05 PM IST

YCP Occupied Government Land: కర్నూలులోని విలువైన భూములపై వైకాపా నేతల కన్ను పడింది. వైకాపా జిల్లా పార్టీ కార్యాలయం పేరుతో కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ వద్ద ప్రతిపాదనలు పెట్టగా నేరుగా కేటాయించాలా? లేక లీజు పేరుతో అప్పగించాలా అనేదానిపై చర్చ జరుగుతోంది.

LAND YCP
LAND YCP

అధికార పార్టీ నేతల భూ దాహానికి అడ్డూఅదుపూ లేదా..?

YCP Occupied Government Land: రాష్ట్రంలో వైకాపా జిల్లా కార్యాలయాలకు ప్రభుత్వ భూములు, కార్పొరేషన్‌ స్థలాలు అప్పనంగా అప్పగించేందుకు పావులు కదులుతున్నాయి. ఇందులో భాగంగానే కర్నూలులోనూ వైకాపా నేతలు ప్రభుత్వ స్థలాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఎక్కడైనా రెండు ఎకరాలు కేటాయించాలంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టిలో స్థల వ్యవహారం పెట్టారు. అధికారులు స్థలాలు గుర్తించి వివరాలు చెప్పేలోగా, వైకాపా నేతలు కొన్ని స్థలాలపై కన్నేశారు.

ఈ భూములన్నీ నగరం నడిబొడ్డున ఉండటంతో వీటి విలువ కోట్లలోనే ఉన్నాయి. అయితే స్థలాల ఎంపికలోనూ కొందరు ప్రజాప్రతినిధులకు మధ్య సఖ్యత కరువైంది. ఒకరు ఒకటి సూచిస్తే మరొకరు ఇంకో స్థలం అయితే బాగుంటుందన్న ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. సీ క్యాంపు టీజీవీ కళాక్షేత్రం ఎదురుగా ఉన్న ఆర్ అండ్‌ బీ క్వార్టర్స్‌పై వైకాపా నేతల దృష్టి ఉంది. ఈ స్థలాన్ని గతంలో తెలుగుదేశం కార్యాలయానికి ప్రతిపాదించగా ప్రభుత్వం మారాక ప్రస్తుతం వైకాపా దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇక్కడ ఉన్న మూడు క్వార్టర్స్‌ను పడగొట్టి ఆ స్థలాన్ని పార్టీ కార్యాలయానికి ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఈ క్వార్టర్స్‌లో ప్రస్తుతం డీఈ స్థాయి ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. ఈ స్థలం సుమారు ఎకరానికి పైగా ఉంటుంది. దీని విలువ మార్కెట్లో రూ.50 కోట్లకు పైగా పలుకుతోంది. సిల్వర్‌ జూబ్లీ కళాశాల సమీపంలోనూ శిథిలావస్థలో ఉన్న ఆర్ అండ్‌ బీ క్వార్టర్స్‌ స్థలాలనూ పరిశీలిస్తున్నారు.

రాజ్‌విహార్‌ కూడలిలోని ఆర్టీసీ స్థలంపై వైకాపా నేతల కన్ను పడింది. తాజాగా బస్సులను ఇక్కడికి రానివ్వకుండా, ట్రాఫిక్‌ పేరుతో బైపాస్‌ నుంచి మళ్లించారు. ఈ చర్యతో రాజ్‌విహార్‌ బస్టాండ్‌ నిరుపయోగంగా ఉందనే సంకేతాలు తీసుకెళ్లి ఈ స్థలం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఎకరా 30 సెంట్ల స్థలం ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో వంద కోట్ల పైమాటే. అదేవిధంగా కొత్త బస్టాండు, ట్రైనింగ్‌ కళాశాల ఆవరణ మొత్తం 33 ఎకరాల్లో ఉంది. కల్లూరు రోడ్డులోని ఆర్టీసీ స్థలంలో ఇప్పటికే ఎలాంటి ప్రకటన, టెండర్లు లేకుండా గోదాం నిర్మాణం జరిగింది. ఇక్కడ స్థలం వైకాపా కార్యాలయానికి కేటాయిస్తే బాగుటుందన్న ఆలోచనలో క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేసినట్టు తెలుస్తోంది.

వైకాపా జిల్లా కార్యాలయానికి ఎంచుకున్న స్థలాల్లో ఆగ్రోస్‌ స్థలం ఒకటి. ఆర్ఎస్‌ రోడ్డులో ఐదు రోడ్ల కూడలి సమీపంలో ఉన్న 1.60 ఎకరాలను.. మేయర్‌ బీవై రామయ్య పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ స్థలం విలువ బహిరంగమార్కెట్లో రూ.90 కోట్ల పైమాటే. జలవనరుల శాఖ స్థలాన్ని గతంలో ఏపీ అగ్రోస్‌కు కేటాయించగా రెవెన్యూ రికార్డుల్లోనూ జలవనరులశాఖ స్థలంగానే ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఆగ్రోస్‌ సంస్థ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. కనుక తిరిగి స్వాధీనం చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇందులో వరద సమయంలో సామగ్రి నిల్వ చేసుకునేందుకు ఇరిగేషన్‌ గోదాం అవసరమని, తిరిగి స్థలం వెనక్కి ఇస్తే అందులో నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఈలోగా ఏపీఆగ్రోస్ బోర్డు సమావేశంలోనూ కర్నూలులోని ఈ ఖాళీ స్థలంపై చర్చకు వచ్చింది. ఇందులో ఆగ్రోస్‌ భవనం, రైతులకు శిక్షణ కేంద్రం, సమావేశం హాల్, రైతులకు వసతి గృహం వంటి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సూచించినట్లు ఆగ్రోస్ అధికారులు చెబుతున్నారు.


ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.