ETV Bharat / state

కేంద్ర హోంశాఖ ఫిర్యాదు ప్రతి పంపండి: సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

author img

By

Published : Dec 4, 2022, 1:11 PM IST

సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ
సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

MLC Kavitha Letter To CBI : దిల్లీ మద్యం కేసులో నోటీసులు అందుకున్న తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్​ నకలును తనకు అందించాలని ఆమె కోరారు. తాను అడిగిన పత్రాలను పంపిన తర్వాతే ఈ అంశంపై తాను వివరణ ఇస్తానని స్పష్టం చేశారు. రాజకీయ కక్షలతో ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా పోరాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. కవితకు సూచించినట్లు తెలుస్తోంది.

MLC Kavitha Letter To CBI : మద్యం కుంభకోణం కేసు విచారణ వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు.. సీబీఐ నోటీసులు పంపటం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాఖీదులందుకున్న తర్వాత సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన కవిత.. కాసేపటికే దిల్లీలోని సీబీఐ డీఎస్పీ అలోక్‌కుమార్‌ షాహికి లేఖ రాశారు. దిల్లీ మద్యం కేసులో సీబీఐ శుక్రవారం రాత్రి సీఆర్​పీసీ-160 కింద కవితకు నోటీసులు ఇచ్చింది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్‌లో గానీ.. దిల్లీలో గానీ ఆమె నివాసంలో విచారించాలనుకుంటున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. దర్యాప్తు ప్రయోజనాల దృష్ట్యా పలు అంశాలపై విచారించాల్సిన అవసరం ఏర్పడిందని.. ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో తెలియజేయాలని సూచించింది. నోటీసులు అందుకున్న కవిత హైదరాబాద్‌లోని నివాసంలో వివరణ తీసుకోవచ్చని అధికారులకు వెల్లడించారు.

ఆ డాక్యుమెంట్లను పంపిన తర్వాతే వివరణ: ఈ నేపథ్యంలోనే మద్యం కేసుకు సంబంధించిన ఫిర్యాదు, ఎఫ్​ఐఆర్​ కాపీలను కోరుతూ సీబీఐ డీఎస్పీకి ఆమె లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన.. ఎఫ్​ఐఆర్​ నకలును సాధ్యమైనంత త్వరగా తనకు అందించాలని కోరారు. తద్వారా తనకు వివరణ ఇవ్వడం తేలిక అవుతుందని తెలిపారు. ఆ డాక్యుమెంట్లను పంపిన తర్వాతే వివరణ ఇచ్చే తేదీని ఖరారు చేసి.. హైదరాబాద్‌లో కలుద్దామని వివరించారు.

సీఎం కేసీఆర్​ను కలిసిన కవిత: కాగా నిన్న ఉదయం కవిత ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిశారు. తనకు వచ్చిన నోటీసుల ప్రతిని ఆమె సీఎంకు అందజేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను కవిత వివరించారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం ధైర్యం చెప్పినట్లు తెలిసింది. సీబీఐ నోటీసుల వెనుక దురుద్దేశం ఉందని, దానికి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయ కక్షల కారణంగా ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా పోరాడాలని.. న్యాయపరంగా దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సూచించినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి నివాసం నుంచి వచ్చిన తర్వాతే కవిత సీబీఐ డీఎస్పీకి లేఖ రాశారు. సీబీఐ నోటీసుల నేపథ్యంలో టీఆర్​ఎస్​ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హైదరాబాద్‌లోని కవిత నివాసానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఆమెకు, సీఎంకు అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితకు మద్దతుగా నగరంలో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి.

సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.