ETV Bharat / state

Botsa on Education System: 'విద్యా వ్యవస్థలో మార్పులు.. ఉత్తమ విద్యార్థులకు రేపు అభినందన సభ'

author img

By

Published : Jun 19, 2023, 5:17 PM IST

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

Minister Botsa said changes in education system: విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై మంత్రి మాట్లాడుతూ.. పెండింగ్ అంశాలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించనున్నట్లు వెల్లడించారు. విజయవాడలో మంగళవారం నిర్వహించే విద్యార్థుల అభినందన సభకు ముఖ్యమంత్రి జగన్ హాజరవుతారని తెలిపారు.

Minister Botsa said changes in education system: విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులను ఉపాధ్యాయ సంఘాలకు వివరించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో 82వేలకు పైగా ఉపాధ్యాయులు.. వారు కోరుకున్నట్లుగానే బదిలీలకు అవకాశం కల్పించామని వెల్లడించారు. వివిధ పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో 1012 మంది విధుల్లో చేరాల్సి ఉందని చెప్పారు. 679 ఎంఈఓ పోస్టులు భర్తీలు భర్తీ చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా కల్పిస్తామని, ఇతర ఉపాధ్యాయులను ఎంఈఓలుగా నియమించే విషయం ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తామన్నారు. ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నచోట సీనియర్ ఉపాధ్యాయులను పదోన్నతిలో భాగంగా గుర్తిస్తామన్నారు.

విద్యార్థులకు అభినందన సభ.. ఎండల తీవ్రత దృష్ట్యా ఒంటిపూట బడులు మరో వారం పెంచినట్లు మంత్రి తెలిపారు. నాడు-నేడులో భాగంగా పాఠశాలల్లో అటెండర్, రాత్రి వాచ్ మెన్ పోస్టులు భర్తీ చేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సరిగ్గా లేని ఉపాధ్యాయులకు 175 ఇంజినీరింగ్ ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. 98 మంది కంటే తక్కువ సంఖ్య ఉన్న పాఠశాలల్లో సబ్జెక్టులకు టీచర్లు లేరని, అలాంటి వారిని ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాల్లోని ఉన్నత, సంక్షేమ పాఠశాలల్లో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను బొత్స కోరారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. విద్యా కానుక కిట్ల పంపిణీ వారంలో పూర్తి చేస్తామని, విద్యార్థులకు సరిపోని బూట్లు ఉంటే వాటి స్థానంలో కొత్తవి అందజేస్తామన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్​లో మంచి మార్కులు సాధించిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా అభినందన సభలు నిర్వహించామన్నారు. రేపు విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహిస్తామన్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని మంత్రి బొత్స తెలిపారు.

వైఎస్సార్సీపీ బీసీల పార్టీ.. రౌడీలు, గూండాలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని బొత్స సత్యనారాయణ తెలిపారు. మహిళలు, చిన్నారులపై దాడులు, అత్యాచారాలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. గతంలో శాంతి భద్రతలు ప్రస్తుతం కంటే దారుణంగా ఉండేవన్నారు. టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లు నిర్మించామని చంద్రబాబు చెబుతున్నారని మరెందుకు ప్రజలకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఒక రాజకీయ అవగాహన లేని వ్యక్తి అని బొత్స విమర్శించారు. ఆయన మాటలపై ఇంతకంటే స్పందించదలుచుకోలేదన్నారు. విశాఖపట్నంలో శాంతి భద్రతలకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ బీసీల పార్టీ అన్న బొత్స.. సీఎం జగన్ బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే శాసన సభ ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి వచ్చినా తాము ఒంటరిగానే వెళ్తామన్నారు. ప్రతిపక్ష నేతలు మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని మంత్రి బొత్స కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.