ఉత్తుత్తి యాప్​తో ​​.. రూ.100 కోట్లకు పైనే మోసం

author img

By

Published : Nov 19, 2022, 10:50 PM IST

Fraud

Multijet company Fraud: లక్ష పెట్టుబడి పెడితే.. 8 నెలల్లో రూ.4 కోట్లు మీ సొంతమంటూ వేలమందిని.. బురిడీకొట్టించిన దందాలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు మల్టీజెట్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ ఎండీ ముక్తిరాజ్ నకిలీ యాప్‌తో బాధితుల్ని మోసం చేశాడు. సెబీ గుర్తించిన సాంకేతికత కాకుండా సొంతంగా తయారుచేయించిన యాప్‌తో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేస్తున్నట్లు నమ్మించాడు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాక బోర్డు తిప్పేయాలని చూశాడు. బాధితుల ఫిర్యాదుతో అసలు తతంగం బయటపడింది.

ఉత్తుత్తి యాప్​తో ​​.. రూ.100 కోట్లకు పైనే మోసం

Multijet company Fraud: హైదరాబాద్ రామంతపూర్‌కి చెందిన నిందితుడు ముక్తీరాజ్‌ బంగారం, బొగ్గు, గ్యాస్‌పై ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేయిస్తూ లావాదేవీలు జరిగినట్లు పలువురిని నమ్మించాడు. పెట్టుబడి పెట్టాక తొలుత కొందరికి లాభాలు అందించాడు. వాటిని నమ్మి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టాక బోర్డు తిప్పేయాలని చూశాడు. అనుమానం వచ్చి బాధితులు ఫిర్యాదు చేయడంతో ముక్తీరాజ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భారీగా పెట్టుబడులు స్వీకరించిన ముక్తిరాజ్.. సుమారు రూ.100 కోట్లకుపైనే మోసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

నిందితుడు తయారు చేయించిన యాప్‌లోని లావాదేవీల ఆధారంగా ఆ మొత్తం తేల్చారు. మల్టీజెట్ ప్రైవేట్ లిమిటెడ్, రియల్ లైఫ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ పేరిట ఉన్న.. బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయగా రూ.12 లక్షలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన డబ్బు డ్రా చేసినట్లు వివరించారు. ఇంత పెద్దమొత్తంలో డబ్బు ఎలా మళ్లించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో పెట్టుబడి పెట్టినవారికి తిరిగి ఇచ్చింది ఎంత? ఇతర అవసరాలకు ఎంత మళ్లింది? వాటిని ఏం చేశారు? తదితర వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆ సొమ్ము ఎక్కడ దాచారనే అంశంపై పోలీసులు ఆరా: కొందరు నేరుగా కార్యాలయానికి వెళ్లి డబ్బు కట్టారు. వాటిని కట్టలు కట్టి రోజూ ఓ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆ సొమ్ము ఎక్కడ దాచారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు . సంస్థ ఖాతాల్లోని నగదు వారం రోజుల క్రితమే ఉపసంహరించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేసు విచారణలో భాగంగా మల్టీజెట్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాప్ తయారుచేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

పెద్దఎత్తున నగదు మళ్లించారనే అనుమానం: ఈ మోసం జరిగిన విధానాన్ని అతడి ద్వారా తెలుసుకుంటున్నారు. పెద్దఎత్తున నగదు మళ్లించారనే అనుమానంతో ముక్తీరాజ్‌ కుటుంబసభ్యులు, సంస్థలో పనిచేసిన వ్యక్తులు సహా.. మరికొందరి బ్యాంకు ఖాతాలు పరిశీలించనున్నారు. ముక్తీరాజ్‌ గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు తెలిసింది. అప్పుడు నమోదైన కేసులను పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు . నిందితుడు గతంలో వరంగల్, హైదరాబాద్‌ జైళ్లలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడన్న విషయం తెలిసినా.. కొందరు జైలు సిబ్బంది అతని వద్ద పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.