శ్రద్ధ హత్య కేసులో కీలక ఆధారం.. చేతిలో బ్యాగ్​తో అఫ్తాబ్​ సీసీటీవీ ఫుటేజ్​!

author img

By

Published : Nov 19, 2022, 7:36 PM IST

Shraddha Murder Case

Shraddha Murder Case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి శరీర భాగాలను దిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసినట్లు నిందితుడు అఫ్తాబ్‌ పూనావాలా విచారణలో చెప్పడంతో వాటి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి ఓ సీసీటీవీ ఫుటేజ్‌ బయటకు వచ్చింది. అందులో అఫ్తాబ్‌ చేతిలో బ్యాగు పట్టుకుని తెల్లవారుజామున నడుచుకుంటూ వెళ్తున్నట్లు కన్పించింది. అఫ్తాబ్‌ ఫ్లాట్‌ నుంచి ఓ భారీ, పదునైన కట్టింగ్‌ పరికరాన్ని సైతం దర్యాప్తు వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి.సోమవారం అఫ్తాబ్‌కు నార్కొటిక్‌ పరీక్షల నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

శ్రద్ధ హత్య కేసులో కీలక ఆధారం.. చేతిలో బ్యాగ్​తో అఫ్తాబ్​ సీసీటీవీ ఫుటేజ్​!

Shraddha Murder Case : దిల్లీలో అత్యంత పాశవికంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్‌ కేసుకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అతి ముఖ్యమైన సీసీటీవీ ఫుటేజ్‌ను దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. అందులో అఫ్తాబ్‌ చేతిలో బ్యాగు పట్టుకుని తెల్లవారుజామున నడుచుకుంటూ వెళ్తున్నట్లు కన్పించింది. అది మెహ్రౌలీ అటవీ ప్రాంతానికి వెళ్లే మార్గమని తెలుస్తోంది. అయితే, ఆ వీడియో అక్టోబరు 18న రికార్డ్‌ అయినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. నిజానికి శ్రద్ధా మే 18న హత్యకు గురైంది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసిన అఫ్తాబ్‌, వాటిని అటవీ ప్రాంతంలో, దిల్లీలోని మరికొన్ని చోట్ల విసిరేసినట్లు విచారణలో చెప్పాడు. దీంతో అక్టోబరు 18న అతడు బ్యాగు పట్టుకుని మళ్లీ ఆ మార్గంలో ఎందుకు వెళ్లాడన్నది అంతుచిక్కకుండా మారింది. దీంతో ఈ వీడియోపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీడియోలో అఫ్తాబ్‌ చేతిలో కన్పిస్తున్న బ్యాగులో శ్రద్ధా శరీర భాగాలు ఉన్నాయా? లేదా? అన్న కోణంలో విచారిస్తున్నారు.

ఆ ఆధారం కీలకం..
అఫ్తాబ్‌ ఫ్లాట్‌ నుంచి దిల్లీ పోలీసులు ఓ భారీ, పదునైన కట్టింగ్‌ పరికరాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శద్ధాను ఈ ఆయుధంతోనే ముక్కలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై అఫ్తాబ్‌ను ఆరా తీస్తున్నారు. కేసు విచారణలో ఈ ఆయుధం కీలకంగా మారే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, హత్య జరిగిన సమయంలో శ్రద్ధా వేసుకున్న దుస్తుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. అటు మృతురాలి ఫోన్‌ కూడా ఇంతవరకూ లభించలేదు. ఇక అటవీ ప్రాంతంలో పోలీసులకు శ్రద్ధావిగా అనుమానిస్తున్న కొన్ని శరీర భాగాలు లభించాయి. ఇందులో చాలా వరకు ఎముకలే ఉన్నాయి. వాటిని డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు. ఆ నివేదిక వస్తే కేసులో పురోగతి లభించే అవకాశముంది.

పోలీసులను తప్పుదోవ పట్టినస్తున్న అఫ్తాబ్?
అఫ్తాబ్‌ పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నాడనే అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. అతడు నేరం అంగీకరించినా.. విచారణను తప్పుదోవ పట్టిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫ్తాబ్‌కు నార్కొ అనాలిసిస్‌ పరీక్ష నిర్వహించేందుకు దిల్లీ కోర్టు అనుమతించింది. దీంతో ఈ పరీక్ష సోమవారం దిల్లీలోని బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆస్పత్రిలో జరిగే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అప్తాబ్‌ కస్టడీ గడువు మంగళవారంతో ముగియనుండటంతో దానికి ఒక రోజు ముందే.. నార్కొటిక్ పరీక్ష చేయించాలని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే అఫ్తాబ్‌కు తొలుత ప్రీ-నార్కోటిక్‌ పరీక్షలు చేస్తారని తెలుస్తోంది. అందులో అతడి మానసిక పరిస్థితిని నిర్దారించుకున్న తర్వాతే తుది పరీక్షకు వెళతారని సంబంధిత వర్గాలు చెప్పాయి. మరోవైపు నార్కొటిక్ పరీక్షకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం రాలేదని అంబేడ్కర్ ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి.

ఇవీ చదవండి : ప్రియుడితో పెళ్లి కోసం మతం మార్చుకున్న ప్రియురాలు.. వేదమంత్రాలతో ఘనంగా పెళ్లి

భార్యాపిల్లలు నిద్రిస్తున్న ఇంటికి నిప్పు పెట్టిన భర్త.. రైలు ఢీకొని ఇద్దరు లోకో పైలట్లు మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.