ETV Bharat / state

ఆ అంశాలపై స్టే ఇవ్వడం కుదరదు: సుప్రీంకోర్టు

author img

By

Published : Nov 29, 2022, 7:14 AM IST

AMARAVATHI ON SUPRIM COURT
రాజధాని

Amaravati on Supreme Court: రాజధాని మార్పునకు అసెంబ్లీకి శాసనాధికారాలు లేవన్న హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అయితే అమరావతిలో పనులు పూర్తి చేయడానికి విధించిన నిర్దిష్ట గడువులపై మాత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. కోర్టులో విచారణ సందర్భంగా రైతుల భవితవ్యంపై గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేసిన ధర్మాసనం.. హైకోర్టు ఎక్కడ ఉంటుందని పదే పదే ఆరా తీసింది. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది.

స్టే కుదరదు

Amaravati on Supreme Court: రాష్ట్ర రాజధానిని మార్చడానికి కానీ, రాజధానిని రెండు, మూడుగా విభజిస్తూ తీర్మానం కానీ, చట్టం కానీ చేసే శాసనాధికారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు లేదు అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు ముందుకు రాలేదు. అలా చేస్తే కేసు వినకుండానే హైకోర్టు తీర్పును కొట్టేసినట్లవుతుందని స్పష్టం చేసింది. అయితే రాజధాని ప్రాంతంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి నిర్దిష్ట గడువు విధిస్తూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసిన ఏడు అంశాల్లో అయిదింటిపై తదుపరి ఉత్తర్వుల వచ్చే వరకు స్టే ఇచ్చింది. ఈ కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. డిసెంబర్‌ చివరి వారంలోపు అందరూ సమాధానం ఇవ్వాలంటూ విచారణను వచ్చే ఏడాది జనవరి 31కి వాయిదా వేసింది.

రాజధానిపై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదంటూ ఈ ఏడాది మార్చి 3న హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రం ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన ఎస్.ఎల్.​పీ లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్, రాజ్యసభ ఎంపీ నిరంజన్‌రెడ్డి, అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం, సీనియర్‌ అడ్వకేట్‌ నఫ్డే వాదనలు వినిపించారు. రైతుల తరఫున సీనియర్‌ అడ్వకేట్లు ఫాలీ ఎస్‌.నారిమన్, శ్యాం దివాన్, ఆదినారాయణరావులు వాదనలు వినిపించారు. సుమారు గంటన్నరపాటు సాగిన వాదనల్లో న్యాయమూర్తులు కూడా పలు అంశాలపై ప్రశ్నలు వేశారు. అన్ని పక్షాల వాదోపవాదనలు విన్న తర్వాత హైకోర్టు కంటిన్యుయస్‌ మేండమస్‌ ఇచ్చిన అంశాల్లో కొన్నింటిపై స్టే ఇచ్చారు.

తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరపున కే.కే వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ... ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 15న ఉపసంహరించుకుందని.. మూడు రాజధానులుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పిన ఆ చట్టాన్ని ఉపసంహరించుకున్నందున ఇప్పుడు ఏమీ మిగలలేదన్నారు. దీనిపై జోక్యం చేసుకున్న జస్టిస్‌ కేఎం జోసెఫ్‌....ఏమీ మిగలలేదా ఇంకా ఏదైనా మిగిలి ఉందా అని ప్రశ్నించారు. కేకే వేణుగోపాల్‌ స్పందిస్తూ తనకు తెలిసినంతవరకూ ఏమీ లేదన్నారు. చేసిన చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ మూడు రాజధానుల అంశాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఉత్తర్వులు జారీ చేస్తే కోర్టులు ప్రభుత్వ శాసనాధికారాల్లో జోక్యం చేసుకున్నట్లే అవుతుందన్నారు. ఫలానా విధానంలో బిల్లును ఆమోదించాలనే అధికారం కానీ, ఫలానా రకమైన చట్టాన్ని చేయొద్దని చెప్పే అధికారం కానీ హైకోర్టుకు లేదన్నారు. ఇది మొత్తం వ్యవస్థల మధ్య అధికార విభజనలోకి వస్తుందన్నారు. రాష్ట్ర రాజధానిపై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని, పార్లమెంటుకు మాత్రమే ఉందని చెప్పడమూ తప్పేన్నారు. ఒకసారి చట్టాన్ని ఉపసంహరించుకున్నా... దాని స్థానంలో శాసనసభ మరో చట్టం తెచ్చే వరకూ హైకోర్టు వేచిచూడాలన్నారు. కానీ ఇప్పుడు చట్టం అమల్లో లేకపోయినా ఒక్కో విషయాన్ని పరిగణనలోకి తీసుకొని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం వింతగా కనిపిస్తోందని వాదనలు వినిపించారు.


వాదనల మధ్యలో జోక్యం చేసుకున్న జస్టిస్ జోసెఫ్‌.. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు సమకూర్చిందని... ఇప్పటి వరకు దాదాపు 15 వేల కోట్లు అమరావతి కోసం ఖర్చు పెట్టారన్నారు. రైతులతో చేసుకున్న చట్టబద్ధ ఒప్పందం ప్రకారం ఏటా 10శాతం పెంపుదలతో కౌలుతోపాటు అభివృద్ధి చేసిన స్థలాలను ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసిందని గుర్తు చేశారు. విభజన చట్టానికి లోబడి హైకోర్టు అమరావతి నుంచి పనిచేస్తుందని.. రాష్ట్రపతి 2018లో నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఎక్కడి నుంచి పనిచేయాలో పార్లమెంటు మాత్రమే నిర్దేశించగలుగుతుందన్నారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా మీరు హైకోర్టు ప్రధాన ధర్మాసనం కర్నూలులో పెడతామని ప్రతిపాదించారని తెలపగా.. ఇప్పుడు ఆ ప్రతిపాదనే లేదని కే.కే వేణుగోపాల్‌ బదులిచ్చారు. జస్టిస్‌ జోసెఫ్‌ స్పందిస్తూ ప్రస్తుతం రైతుల ప్రాథమిక హక్కులకు ముప్పు పొంచి ఉందన్న అనుమానం ఉందని... బహుశా దాని ప్రాతిపదికనే హైకోర్టు జోక్యం చేసుకొని ఉండొచ్చన్నారు. అందువల్ల మీరు వాస్తవంగా ఏం చేయాలనుకుంటున్నారన్నది.. స్పష్టంగా చెప్పాలని’ జస్టిస్ జోసెఫ్‌ స్పష్టం చేశారు. జస్టిస్‌ నాగరత్న జోక్యం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని ఎక్కడికి మార్చాలనుకుంటోందని ప్రశ్నించారు. అది శాసనసభ నిర్ణయిస్తుందని వేణుగోపాల్‌ బదులివ్వగా.... ఇక్కడ హైకోర్టు ‘ఎ’ కేపిటల్‌ కాదు.. ‘ది’ కేపిటల్‌ అని చెప్పింది కదా అని జస్టిస్‌ జోసెఫ్‌ గుర్తుచేశారు. జస్టిస్‌ నాగరత్న జోక్యం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారాల విభజన లేదా? హైకోర్టు కార్యనిర్వాహక వ్యవస్థగా వ్యవహరించడం ప్రారంభించిందా అని వ్యాఖ్యానించారు. ఈ అంశాలను తాము పరిశీలించాలని, అందుకే కేసును విచారణకు స్వీకరించి కక్షిదారులందరికీ నోటీసులు జారీచేయాలనుకుంటున్నామని జస్టిస్‌ జోసెఫ్‌ చెప్పారు. చట్టబద్ధమైన ఒప్పందం ప్రకారం భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. వేణుగోపాల్‌ స్పందిస్తూ పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నందున ఇప్పుడు 2014 చట్టం అమల్లో ఉంటుందన్నారు. దాని ప్రకారం ఈ రోజుకు అమరావతే రాజధాని అని చెప్పగా ‘దట్స్‌ రైట్‌’ అని జస్టిస్‌ జోసెఫ్‌ వ్యాఖ్యానించారు.

విచారణ సందర్భంగా మరోసారి జోక్యం చేసుకున్న జస్టిస్ నాగరత్నం.. మీరు ఎన్ని నగరాలైనా అభివృద్ధి చేసుకోవచ్చని... అన్నింటినీ ఒకే ప్రాంతంలో పెట్టడానికి బదులు ఎక్కువ పట్టణ కేంద్రాలు రావడం మేలన్నారు. వాటిని ఎక్కడ పెట్టాలన్నది ప్రభుత్వానిదే నిర్ణయమని... ఈ విషయంలో హైకోర్టు తన హద్దులను దాటినట్లు అనిపిస్తోందన్నారు. హైకోర్టు కార్యనిర్వాహక వ్యవస్థలా మారకూడదన్నారు. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామని, కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఉండాల్సింది కాదని కే.కే వేణుగోపాల్‌ అన్నారు. మరి భూములిచ్చిన

29 వేల మంది రైతుల హక్కుల సంగతేంటని జస్టిస్‌ జోసెఫ్‌ అడగగా, మరో న్యాయవాది నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ... పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేసినా ఆ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రభుత్వం చెప్పిందన్నారు. అమరావతిని రాజధానిగా తొలగించలేదని.. మూడు పాలనా కేంద్రాల్లో అదీ ఒకటన్నారు. అక్కడ లే అవుట్ల అభివృద్ధి జరుగుతుందని.... భూసేకరణ చట్టం మనుగడలోనే ఉంటుందని వివరించారు. రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు మీరు ఎలా కాపాడతారన్నదే మాకు సమస్యగా కనిపిస్తోందని జస్టిస్‌ జోసెఫ్‌ వ్యాఖ్యానించారు. నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ ‘భూములు ఇచ్చిన రైతుల కోసం మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేస్తామన్నారు.. వికేంద్రీకరణ చట్టం కూడా అదే చెప్పిందన్నారు. వారికి ఏటా చేసే చెల్లింపులకు రక్షణ కల్పించడంతోపాటు, పెంచుతామని కూడా ఆ చట్టంలో చెప్పారన్నారు. ఇప్పటి వరకు అక్కడ 5 వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని, అందులో 2 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం అయిదేళ్లలో వెచ్చించింది కేవలం 3 వేల కోట్లేనన్నారు. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేయాలంటే లక్షా 9వేల కోట్లు ఖర్చవుతుందని, 2 లక్షల కోట్ల వరకు పోవచ్చన్నారు. ప్రస్తుత బడ్జెట్‌ కేటాయింపుల ప్రకారం చూస్తే ఆ స్థాయి అభివృద్ధి పూర్తవడానికి 40 నుంచి 50 ఏళ్లు పట్టొచ్చన్నారు.


కొత్తగా హైకోర్టును ఎక్కడికి తరలిస్తున్నారని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించగా.. వికేంద్రీకరణ చట్టం ప్రకారం శాసనరాజధాని అమరావతిలో, కార్యనిర్వాహక రాజధాని విశాఖ, న్యాయరాజధాని కర్నూలులో ఉంటుందని నిరంజన్‌రెడ్డి బదులిచ్చారు. ఏ చట్టం ప్రకారం అవి వస్తాయని న్యాయమూర్తి అడగ్గా.. ఆ చట్టాన్ని రద్దు చేసినట్లు నిరంజన్‌రెడ్డి బదులిచ్చారు.

ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితేంటని... మీరేం చేయాలని ప్రతిపాదించారని న్యాయమూర్తి ప్రశ్నించారు. వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేసినందున అసలు చట్టం అమల్లోకి వచ్చిందని, అందువల్ల రాజధాని అమరావతిలోనే ఉందని నిరంజన్‌రెడ్డి చెప్పారు. అవసరమైతే ఆ అంశాన్ని శాసనసభ పునఃపరిశీలించి, కొత్త చట్టం తీసుకొస్తుందన్నారు. భవిష్యత్తులో శాసనసభ ఏం చేస్తుందన్నది చెప్పడం తమకు కష్టమన్నారు. ఆ వాదన సరికాదంటూ రాజధాని రైతుల తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ అడ్వకేట్‌ ఫాలీ నారిమన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టును ఏం చేయాలనుకుంటున్నారని మిమ్మల్ని పదేపదే అడుగుతున్నాం... అది అమరావతిలోనే ఉంటుందా అని జస్టిస్‌ జోసెఫ్‌ మరోమారు ప్రశ్నించారు. ప్రస్తుతం హైకోర్టు అమరావతి నుంచే పనిచేస్తోందని నిరంజన్‌రెడ్డి బదులిచ్చారు. ఇప్పుడు పని చేస్తోంది, ఇక ముందు కూడా పని చేయడానికి అనుమతిస్తారా అని ప్రశ్నించగా ఈ రోజు వరకు అదే పరిస్థితి ఉందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. నెలల్లో పూర్తి చేయాల్సిన పనులకు ఐదేళ్లు కావాలని అడగటం కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేయడం కాదా అని జస్టిస్‌ జోసెఫ్‌ ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఈ కేసును విచారించడానికి తాము సుముఖంగా ఉన్నామని, ఆలోపు మీరు మధ్యంతర ఉత్తర్వులుగా ఏం కోరుకుంటున్నారని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. మొత్తం జడ్జిమెంట్‌పై స్టే కాకుండా ఏం కోరుకుంటున్నారో చెప్పాలన్నారు. రాజధానిని నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్న హైకోర్టు తీర్పులోని అంశంపై స్టే ఇవ్వాలని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వదిలిపెట్టాలని వేణుగోపాల్‌ కోరారు. అలా స్టే ఇస్తే మీకు కొత్తగా చట్టం చేయడానికి స్వేచ్ఛనిస్తుంది కదా అని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. అలా చేస్తే ఈ కేసు విచారణే నిరర్థకంగా మారుతుందన్నారు. అది తుది విచారణ సమయంలో పరిశీలించాల్సిన అంశమని వ్యాఖ్యానించారు.

రైతుల తరపున వాదనలు వినిపించిన ఫాలీ నారిమన్‌.....రాష్ట్రాల సరిహద్దులను మార్చడం, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకే వస్తుందని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం స్పష్టంగా చెప్పిందన్నారు. పార్లమెంటు ఒక కేపిటల్‌ అని చెబితే అదే అనుసరించాలి. ఇష్టానుసారం రాజధానులను ఎంచుకోవడానికి వీల్లేదన్నారు. దీనిపై జోక్యం చేసుకున్న జస్టిస్‌ జోసెఫ్‌....రాజధాని ఫలానా చోటే ఉండాలని పార్లమెంటు చట్టంలో ఎక్కడా లేదు కదా? అని ప్రశ్నించారు. నారిమన్‌ స్పందిస్తూ అది రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోని అంశం కాదని.... ఆర్టికల్‌ 3, 4 ప్రకారం ఒకే రాజధాని ఉండాలని పార్లమెంటు చెప్పిందని, అందువల్ల మూడు రాజధానులు ఉండటానికి వీల్లేదని గుర్తుచేశారు. రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ శ్యాం దివాన్‌ వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం భూసేకరణలో ఉన్న సమస్యలు, ధరలను బట్టిచూస్తే కొత్త నగరం నిర్మించడం అసాధ్యమని...కానీ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరుక 33 వేల ఎకరాల భూములను రాజధానికి రైతు ఇచ్చారన్నారు. రాజధానికి భూములిచ్చిన తర్వాత వారి దగ్గర ఏమైనా మిగిలి ఉందా అని న్యాయమూర్తి అడగ్గా ఏమీ మిగలలేదని, అంతా ఇచ్చేశారని శ్యాం దివాన్‌ బదులిచ్చారు. ఎంతో అభివృద్ధి జరుగుతుందని భావించినా...ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితి లేదన్నారు. జస్టిస్‌ జోసెఫ్‌ స్పందిస్తూ హైకోర్టు నెల రోజుల్లోపు పనులు పూర్తి చేయాలని ఎలా చెబుతుందని ప్రశ్నించగా ….. అది కంటిన్యుయస్‌ మేండమస్‌కు సంబంధించిన అంశమని, రైతులకు కేటాయించిన భూములకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో నిర్దిష్ట గడువు విధించిందన్నారు. ఈ పనులన్నీ చట్టబద్ధంగా 2020లోపే పూర్తిచేయాల్సి ఉన్నందున హైకోర్టు చాలా కఠినమైన గడువు విధించిందని శ్యాందివాన్‌ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చట్టం ఉపసంహరించుకున్న తర్వాత కూడా హైకోర్టు ఎందుకు ముందుకెళ్లిందని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చిన శ్యాందివాన్‌....మా కార్యనిర్వాహణాధికారాలు శాసనాధికారాలతో ముడిపడి ఉన్నాయని, అందువల్ల చట్టం లేకపోయినా రాజధాని మార్పునకు పరిపాలనాధికారాలు జారీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం వల్లే హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. శాసనాధికారాలు లేకపోయినా కార్యనిర్వాహక అధికారాల కింద కార్యాలయాలను తరలించే అధికారం తమకుందని చెప్పి కొన్ని కార్యాలయాలను తరలించారని గుర్తుచేశారు. హైకోర్టు వాటిని అడ్డుకుంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిందన్నారు. హైకోర్టు విషయంలో రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఉంది కాబట్టి ఆ పని చేయలేకపోయారని తెలిపారు. మధ్యలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ నాగరత్నం....ఆ ప్రాంతాన్ని రాజధానిని చేయడం, లేదంటే నగరంగా మార్చడం అన్నది వేరే విషయం.. కానీ ఇలాగే చేయాలని చెప్పడానికి హైకోర్టు ఏమైనా టౌన్‌ప్లానింగ్‌ చీఫ్‌ ఇంజనీరా? ఇవేం ఉత్తర్వులన్నారు.

కోర్టులకు ఇందులో నైపుణ్యం ఉండదు కాబట్టి అందులో మేం జోక్యం చేసుకోం అని వ్యాఖ్యానించారు. రెండు నెలల్లో కనీసం డ్రాయింగ్‌లు కూడా తయారుచేయలేరు కదా? అలాంటప్పుడు మొత్తం నగరాన్నే నిర్మించాలని కోర్టు ఎలా చెబుతుందన్నారు. కార్యనిర్వాహక అధికారాలను హైకోర్టు తన చేతుల్లోకి తీసుకొని ఇలా ఉత్తర్వులు జారీచే యొచ్చా అని ప్రశ్నించారు. శ్యాందివాన్‌ బదులిస్తూ ఇప్పటికే డ్రాయింగ్‌లన్నీ సిద్ధంగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. రైతులతో కుదుర్చుకున్న చట్టబద్ధమైన ఒప్పందానికి లోబడే కోర్టు ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కంటిన్యుయస్‌ మేండమస్‌ జారీ చేయడం కరెక్టేనని, వారికి ఒక నెల చాలదనుకుంటే హైకోర్టుకు వెళ్లి వాస్తవ సమయం కోరవచ్చని తెలిపారు. మళ్లీ జోక్యం చేసుకున్న జస్టిస్ జోసెఫ్‌.. రాజధాని అంటే ఏంటి? శాసనసభ, సెక్రటరీలు కూర్చొనే స్థలాన్ని రాజధాని అంటారా? ఈ వ్యవస్థలన్నీ తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఉండాలా? అది ఎక్కడైనా ఉందా? అని అడిగారు. ఇవన్నీ చట్టానికి సంబంధించిన విషయాలని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మరో సీనియర్‌ న్యాయవాది నఫ్డే వాదిస్తూ 2014లో 10 వేల మంది రైతులు భూములు అమ్మారని, ఆ భూములు కొన్నవారిలో కొందరి పేర్లు సున్నితమని, దాని గురించి అందరికీ తెలుసన్నారు. జస్టిస్‌ నాగరత్న జోక్యం చేసుకుంటూ మేం మీ వాదనలు పూర్తిగా వింటామని, అందుకు సమయం కావాలని మాత్రమే చెబుతున్నామన్నారు. అందుకే నోటీసులు జారీచేసి జనవరి 31న వింటామని జస్టిస్‌ జోసెఫ్‌ చెప్పారు. వేణుగోపాల్‌ జోక్యం చేసుకుంటూ రాజధాని ఏర్పాటుపై శాసనసభకు అధికారాలు లేవంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరగా జస్టిస్‌ జోసెఫ్‌ నిరాకరించారు. అలా చేస్తే ఏమవుతుందని ప్రశ్నించగా.. వాదనలు వినకుండానే హైకోర్టు తీర్పును తిరస్కరించినట్లవుతుందని శ్యాం దివాన్‌ అన్నారు. అవునంటూ జస్టిస్‌ జోసెఫ్‌ సంకేతం ఇచ్చారు. మధ్యంలో జోక్యం చేసుకున్న జస్టిస్ నాగరత్న...లేని చట్టంపై ముందస్తుగా ఉత్తర్వులు జారీచేయొచ్చా? ఇది ముందస్తు ఉత్తర్వుల జారీ కిందికి వస్తుందని అన్నారు.

జస్టిస్‌ జోసెఫ్‌ స్పందిస్తూ అందుకే మనం ఈ కేసు వినడానికి కారణంగా చెబుతున్నామని పేర్కొన్నారు. తాము ఈ కేసు వింటామని, అయితే హైకోర్టు నిర్దేశించిన గడువులపై స్టే విధించడానికి సుముఖంగా ఉన్నామని చెప్పారు. హైకోర్టు ఆదేశాల్లోని 1, 2 అంశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినందున దానిపై స్టే ఇవ్వబోమన్నారు. డిసెంబర్‌ చివరి వారానికల్లా అందరూ అఫిడవిట్లు దాఖలు చేయాలని పేర్కొన్నారు. జనవరి 31న ఈ కేసులను టాప్‌ ఆఫ్‌ ది బోర్డులో ఉంచాలని ఆదేశించారు. అప్పటి వరకు ఈ కేసులో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వుల్లోని 3 నుంచి 7 వరకు ఉన్న అంశాలపై స్టే ఇస్తున్నట్లు చెప్పారు. స్టే ఇవ్వడానికి బదులు.. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎలాగూ చెప్పినందున అక్కడ మౌలిక వసతుల పనులు జరిపేందుకు అవకాశం ఇవ్వాలని రైతుల తరఫు న్యాయవాది శ్యాందివాన్‌ కోరారు. తాము హైకోర్టు ఉపయోగించిన అధికారాలను చూస్తున్నాం తప్పితే... ఇటుకానీ... అటు కానీ చూడటంలేదని జస్టిస్‌ నాగరత్న అన్నారు. జస్టిస్‌ జోసెఫ్‌ స్పందిస్తూ ఆరు నెలల్లోపు రాజధానిని అభివృద్ధి చేయాలని చెప్పడంలో చాలా వేగ్‌నెస్‌ ఉందన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.