గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండలోని ఓ అపార్టుమెంటుపై దాడిచేసిన పోలీసులు.. గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 1900 గ్రాముల గంజాయిని, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సమీపంలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో బీటెక్, బీసీఏ చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.
సొంత అవసరాలకు ఫీజులు
గంజాయికి అలవాటు పడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫీజుల్ని సొంత అవసరాలకు వాడుకున్న విద్యార్థులు.. తర్వాత డబ్బులు అవసరమై గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారని ఎస్పీ అమ్మిరెడ్డి వివరించారు.
విశాఖ నుంచి తీసుకువచ్చి విక్రయాలు
పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు.. గంజాయి విక్రయిస్తున్న ప్రదేశానికి వెళ్లి దాడులు చేశారు. విశాఖ జిల్లా నుంచి గంజాయిని కొని ద్విచక్రవాహనాలపై తీసుకొచ్చి చిన్నచిన్న పొట్లాలుగా మార్చి అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా.. నిందితులను పట్టుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై.. తరచూ దృష్టి సారించాలని ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు.
ఇదీ చదవండి: భారీ చోరీ: 100 తులాల బంగారం.3.5 లక్షల అపహరణ