ETV Bharat / state

Students Unions Bandh: సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాల ఆందోళన

author img

By

Published : Jul 25, 2023, 5:15 PM IST

Students Unions Bandh: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్​కు పిలుపునిచ్చారు. వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీ చేయాలని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేసిన విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

Students Unions Bandh
విద్యార్థి సంఘాల బంద్

రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

Students Unions Bandh: విద్యారంగంలో ప్రభుత్వం వైఖరిపై విద్యార్థి సంఘ నాయకులు మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యా సంస్థల బంద్​కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేసిన విద్యార్థి సంఘ నాయకులను పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలో విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేశారు.

వినూత్న రీతిలో ఆందోళన చేపట్టిన విద్యార్ధి సంఘాలు: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి నిరసనగా విద్యార్థులు భిక్షాటన చేపట్టారు. మోకాళ్లపై కూర్చుని ధర్నా చేశారు. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని, జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం కొనసాగించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు బంద్​కు పిలుపునిచ్చాయి.

విద్యార్థి సంఘం నాయకులను అడ్డుకున్న పోలీసులు: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో కళాశాలల్లో సమస్యలపై విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. విద్యార్థులతో కలిసి ఉదయాన్నే ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. డిగ్రీ జూనియర్ కళాశాలలోనికి విద్యార్థి సంఘం నాయకులను వెళ్లనివ్వలేదు. అనంతరం మధ్యాహ్నం భోజనం వేళ విద్యార్థులు బయటకు రాగానే.. విద్యార్థి సంఘ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థి సంఘ నాయకుల అరెస్ట్: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్​కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టి చేసి.. స్టేషన్​కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ: విద్యారంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను మూయించి విద్యార్థి సంఘం నాయకులు బంద్ చేపట్టారు. ప్రభుత్వం అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెనల అమలుకు అనేక ఆంక్షలు విధిస్తూ.. పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తోందని ఆరోపించారు.

మూడు, నాలుగు, అయిదు తరగతుల విలీనంతో విద్యార్థి దశ పూర్తిగా నిర్వీర్యం అయిందని మండిపడ్డారు. వర్షాల కారణంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల బాధలు వర్ణనాతీతమన్నారు. మాతృభాష తెలుగు కనుమరుగవుతోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం శిథిలావస్థలో ఉన్న హాస్టల్స్​కు మరమ్మతులు చేయించి.. నిత్యావసరాలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని కోరారు. నాణ్యమైన విద్యతో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు.

నెల్లూరు, తెనాలిలో..​: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు.. నెల్లూరులో విద్యా సంస్థల బంద్ నిర్వహించింది. పలు పాఠశాలలు, కళాశాలల ఎదుట నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘ నాయకులు.. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రతి ఏడాది మెగా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ నాలుగేళ్లలో ఎన్ని ఖాళీలు భర్తీ చేశారని ప్రశ్నించారు. జీవో నెంబర్ 77 ద్వారా ఫీజు రియింబర్స్​మెంట్​ను అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.