ETV Bharat / state

నూతన సీఎస్‌గా జవహర్​ రెడ్డి.. పలువురు ఐఏఎస్‌ల బదిలీ

author img

By

Published : Nov 29, 2022, 4:44 PM IST

Updated : Nov 29, 2022, 7:38 PM IST

నూతన సీఎస్‌గా జవహర్‌ రెడ్డి నియామకం
నూతన సీఎస్‌గా జవహర్‌ రెడ్డి నియామకం

16:39 November 29

సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

నూతన సీఎస్‌గా జవహర్​ రెడ్డి

JAWAHAR REDDY AS NEW CS TO AP : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్‌ రెడ్డి నియమితులయ్యారు. సమీర్‌ శర్మ పదవీ విరమణ తర్వాత.. 1990 బ్యాచ్‌ ఐఏఎస్​ అధికారి కేఎస్​ జవహర్‌రెడ్డిని నూతన సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30వ తేదీతో సమీర్ శర్మ పదవీకాలం పూర్తి కానుండగా.. డిసెంబరు 1 నుంచి కొత్త ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు. 2024 జూన్‌ వరకు.. అంటే మరో ఏడాదిన్నరపాటు జవహర్‌ రెడ్డి సీఎస్‌ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది.

ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న జవహర్‌ రెడ్డి.. కొత్త సీఎస్‌గా నియమితులయ్యారు. జవహర్‌రెడ్డి కంటే సీనియర్లుగా ఉన్న 1987 బ్యాచ్‌ అధికారి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, 1988 బ్యాచ్‌కు చెందిన పూనం మాలకొండయ్య, 1989 బ్యాచ్ అధికారి కరికాల్‌ వలవన్‌.. సీఎస్‌ పోస్టును ఆశించారు. ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం.. జవహర్‌రెడ్డి వైపే మొగ్గు చూపారు.

ఆయనికి ప్రత్యేక ప్రాధాన్యం: వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జవహర్‌రెడ్డికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన కోరిక మేరకే తితిదే ఈవోగా నియమించారు. ఆ పోస్టులో కొనసాగిస్తూనే సీఎంవోకి తీసుకొచ్చారు. కొన్ని నెలలపాటు ఆయన రెండు బాధ్యతల్నీ నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా ప్రస్తుతం సీఎంవో వ్యవహారాలన్నీ జవహర్‌రెడ్డి కనుసన్నల్లోనే సాగుతున్నాయి. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మిని.. కొన్ని సామాజిక సమీకరణాల దృష్ట్యా సీఎస్‌ పోస్టులో నియమించాలన్న ప్రతిపాదనను ఒక దశలో పరిశీలించినట్లు తెలిసింది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు నలుగురు అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేశారు. వారిలో ఒక్క ఎల్వీ సుబ్రహ్మణ్యం తప్ప.. మిగతా ముగ్గురూ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అత్యంత విధేయులుగా మెలిగారు. అసలు సీఎస్‌ పోస్టు అంటూ ఒకటి ఉందా అనే అనుమానం వచ్చేలా, సొంత నిర్ణయాలేమీ తీసుకోకుండా.. ముఖ్యమంత్రి కార్యాలయం ఏది చెబితే దానికి తలాడిస్తూ వచ్చారు.

ఆ విధేయతకు బహుమానంగా సర్వీసు ముగిశాక కూడా కొన్ని నెలల కొనసాగింపుతో పాటు, పదవీ విరమణ తర్వాత కీలక పోస్టులూ దక్కాయి. నీలం సాహ్నిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గాను, ఆదిత్యనాథ్‌ దాస్‌ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగాను నియమించారు. 2021 అక్టోబరు 10న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సమీర్‌శర్మ 2021 నవంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. సీఎం విజ్ఞప్తి మేరకు మొదట ఆరు నెలల, ఆ తర్వాత మరో ఆరు నెలల పాటు కేంద్రం పొడిగింపునిచ్చింది.

సీఎస్‌గా పదవీ విరమణ తర్వాత సమీర్‌ శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమించనున్నట్టు తెలిసింది. దాంతో పాటు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లీడర్‌షిప్‌, ఎక్స్‌లెన్స్‌ అండ్‌ గవర్నెన్స్‌ వైస్‌ఛైర్మన్‌ పోస్టులోనూ ఇన్‌ఛార్జిగా నియమించనున్నట్టు తెలుస్తోంది.

పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ల బదిలీ: సీఎస్‌గా జవహర్‌రెడ్డిని నియమించిన ప్రభుత్వం.. పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. పూనం మాలకొండయ్యను ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. వ్యవసాయశాఖ శాఖ స్పెషల్‌ సీఎస్‌గా మధుసూదనరెడ్డిని, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్‌ ప్రకాశ్‌ను బదిలీ చేసింది. రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా ప్రద్యుమ్నను, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్‌గా రాహుల్‌ పాండేను నియమించింది. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మహ్మద్‌ దివాన్‌ను నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక.. సెలవుపై వెళ్లిన స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్‌ను... తిరిగి వచ్చాక జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

కొత్త పోస్టు: ప్రస్తుత సీఎస్‌ సమీర్‌ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండగా.. ఆయన కోసం ప్రభుత్వం సీఎం కార్యాలయంలో కొత్త పోస్టు సృష్టించింది. సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ ఎక్స్ అఫీషియో చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ కొనసాగనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 29, 2022, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.