ETV Bharat / state

Cultivation Of Paddy: వరి సాగుకు వెనకాడుతున్న రైతన్న.. గిట్టుబాటు లేదంటూ ఆవేదన

author img

By

Published : Jun 9, 2023, 2:39 PM IST

Production of Paddy In Andhra Pradesh: రాష్ట్రంలోని రైతులు వరి సాగు చేయటానికి వెనకడుగు వేస్తున్నారు. దిగుబడి కంటే పెట్టుబడి ఖర్చులు పెరిగి నష్టపోతున్నామని రైతులు వరి సాగు చేయటానికి ముందుకు రావటం లేదు. రాష్ట్రంలో వరి సాగుకు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతాల రైతులే.. పంట విరమణ ప్రకటిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Production of Paddy In AP
ఏపీ వరి సాగు

గిట్టుబాటు ధర లేక వరి సాగుకు వెనకాడుతున్న రైతులు

Production of Paddy Decreasing in AP : ఎకరానికి 45 వేల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టి.. వానల్ని, వరదల్ని తట్టుకుని పండిస్తేనే రైతన్న చేతికి ధాన్యం వస్తుంది. గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయటం ప్రభుత్వ బాధ్యత అన్న విషయాన్ని విస్మరించిన ముఖ్యమంత్రి జగన్‌.. ఉచితంగా ఇచ్చినట్లు, ధాన్యం కొనుగోలు ద్వారా రైతులకు 58 వేల కోట్ల రూపాయలు సాయం చేశామని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతులు సంతోషంగా ఉన్నారంటున్న ఆయన.. గతేడాది ఖరీఫ్‌, రబీలో సాధారణ విస్తీర్ణం కంటే 9 లక్షల ఎకరాల్లో వరి సాగు ఎందుకు తగ్గిందో చెప్పలేదు. ధాన్యం అమ్ముకోవాలంటే రైతులు మిల్లర్లకు ఎదురు సొమ్ము చెల్లించాల్సిన దుస్థితి మన రాష్ట్రంలో ఎందుకుందో సెలవివ్వలేదు. రైతులకు బోనస్‌ ఇచ్చి ఆదుకోవాలన్న ఆలోచననే ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి మానుకున్నారు.

ఎకరా వరి సాగుకు రైతు కుటుంబ శ్రమ కాకుండానే 45 వేల రూపాయలకు పైగా పెట్టుబడి అవుతోంది. క్వింటాలు ఉత్పత్తికి 2 వేల 84 రూపాయల ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వమే అంచనా వేసింది. అయినా కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర 2 వేల183 రూపాయలు మాత్రమే. ఇందులోనూ తేమ, నూకల పేరుతో క్వింటాలుకు 300 నుంచి 400 వరకు కోతలు విధిస్తున్నారు. వర్షాలు, వరదల వంటివి వచ్చి వడ్లు రంగు మారినా, మొలకలు వచ్చినా ధరలు తగ్గిస్తున్నారు. ఇలా ధరలు తగ్గించటంతో అన్నపూర్ణగా పేరొందిన ఏపీలో వరి సాగు చేయటానికి రైతన్నలు వెనకాడుతున్నారు. ధాన్యం అధికంగా పండిస్తారని పేరున్న గోదావరి జిల్లాల్లోనే ఖరీఫ్‌లో వరి సాగుకు విరామం ప్రకటిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నామని.. ఈ కొత్త విధానంతో రైతులంతా సంతోషంగా ఉన్నారంటున్నారని ప్రభుత్వం అంటోంది. కుంగిపోతున్న అన్నదాతల ఆవేదనను మాత్రం పట్టించుకోవడం లేదు.

2023-24 సంవత్సరానికి క్వింటాలు వరికి మద్దతు ధరగా రూ 3 వేల 126 చొప్పున ఇవ్వాలని వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. అయితే కేంద్రం 2 వేల 183 మాత్రమే నిర్ణయించింది. అంటే రాష్ట్రం ప్రతిపాదించిన ధర కన్నా 943 రూపాయలు తక్కువే. క్వింటాలు ఉత్పత్తికి 2 వేల 84 రూపాయలు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం సీఏసీపీకి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఎకరానికి ఇరవై నాలుగు క్వింటాళ్ల దిగుబడి అని నిర్ణయించి ఈ లెక్కలు వేసింది.

కేవలం ఖరీఫ్‌ పంటనే పరిశీలిస్తే 2019-20సంవత్సరంలో ఎకరాకు 21 క్వింటాళ్ల దిగుబడి రాగా.. 2020-21లో 16.89, 2021-22లో 17.21 క్వింటాళ్ల దిగుబడే లభించింది. గత సంవత్సరం కూడా ముందస్తు అంచనాల ప్రకారం 20.78 క్వింటాళ్ల దిగుబడి అని గుర్తించారు. ప్రభుత్వం చెప్తున్నట్లు గత నాలుగు సంవత్సరాలలో దిగుబడి ఎప్పుడు కూడా లేదు. ఖరీఫ్‌లో వాస్తవ పెట్టుబడి ఎకరానికి 50 వేలు వరకు అవుతుంది. సగటున 20 క్వింటాళ్ల దిగుబడి లెక్కన చూస్తే.. క్వింటాలు ఉత్పత్తికి 2 వేల 500 చొప్పున ధర దక్కాలి. కేంద్రం నిర్ణయించిన 2 వేల 183కు అమ్ముకుంటే క్వింటాలుపై రైతు 317 రూపాయలు నష్టపోతున్నారు. ఎకరానికి 30 బస్తాల ధాన్యం పండిస్తే.. తేమ, నూక పేరుతో 12వేల రూపాయల వరకు వ్యాపారులే దోచుకుంటున్నారు. ప్రభుత్వం సైత్యం రైతుల్ని వ్యాపారులకు వదిలేసి పట్టనట్లు చోద్యం చూస్తోంది.

"ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోవటం వల్ల రైతులు నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలనూ అలస్యంగా ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యంలో తేమ పేరుతో 300 రూపాయలు తగ్గించి విక్రయాలు జరిపారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కోంటున్న కూడా బోనస్​ ఇవ్వకుండా రైతులను మరింతా ఇబ్బందులకు గురి చేస్తోంది." -బండి వెంకటేశ్వర్రావు, రైతు సంఘం నాయకుడు

వరి సాగు చేయటానికి పెట్టుబడి అధికంగా అయ్యే రాష్ట్రాల్లో పక్క రాష్ట్రమైన తెలంగాణ తర్వాత స్థానాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే ఆక్రమించుకుంది. 2021-22 గణాంకాల ప్రకారం తెలంగాణలో ఎకరాకు 45 వేల 306 రూపాయలు ఖర్చు అవుతుంటే.. ఆంధ్రప్రదేశ్​లో 41 వేల 423 అవుతోంది. కేరళలో 40 వేల 364 రూపాయలు ఖర్చవుతోంది. అయినా అక్కడి ప్రభుత్వం క్వింటాలుపై 780 వరకు బోనస్‌ ఇస్తోంది. తమిళనాడులోనూ 100 వరకు ఇస్తున్నారు. తేమ, నూకశాతం పేరుతో వ్యాపారులు, రైతులను 200నుంచి 400 రూపాయల వరకు దోచుకుంటున్నారు. ధాన్యం సేకరణ ద్వారా లబ్ధి పొందే వారిలో సన్నకారు రైతులు కేవలం 22శాతం మంది మాత్రమే ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 53.7శాతం, తెలంగాణలో 71.5శాతం మందికి లబ్ధి కలుగుతోంది. గ్రామాల్లో ఎకరం నుంచి రెండెకరాల వరకు కౌలుకు తీసుకుని వరి పండించే రైతుల నుంచి ధాన్యం సేకరించటం లేదని అర్థమవుతోంది. వీరి పేరుతో యజమానులే అమ్ముకుంటున్నారు. అందుకే అయిదెకరాలు, ఆపై విస్తీర్ణమున్న రైతుల సంఖ్య అధికంగా ఉంది.

"కేరళ రాష్ట్రంలో ప్రభుత్వం మద్దతు ధరకు అదనంగా ధర కల్పించి కొనుగోలు చేస్తోంది. పక్క రాష్ట్రామైనా తమిళనాడు కూడా బోనస్​ ధరకు కొనుగోలు చేస్తోంది. కానీ, ఆంధ్రప్రదేశ్​లో మాత్రం మద్దతు ధరకు ఒక్క రూపాయి కూడా అదనంగా వెచ్చించి కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపించటం లేదు." -శ్రీనివాస్‌, సహాయ కార్యదర్శి, రాష్ట్ర రైతు సంఘం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.