ETV Bharat / state

3 వారాల సమయం కోరిన తెలంగాణ ప్రభుత్వం.. సీజే పర్మిషన్​ తీసుకోవాలన్న హైకోర్టు

author img

By

Published : Feb 7, 2023, 6:56 PM IST

HC
హైకోర్టు

TS MLAs Poaching Case Updates: తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పును 3 వారాలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. అత్యవసర విచారణ చేపట్టాలని జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి బెంచ్‌ను కోరింది. గతంలో ఇచ్చిన తీర్పుపై 3 వారాలు సస్పెన్షన్ ఇవ్వాలని సింగిల్ జడ్జికి విజ్ఞప్తి చేసింది.

TS MLAs Poaching Case Updates: తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పును 3 వారాలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. అత్యవసర విచారణ చేపట్టాలని జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి బెంచ్‌ను కోరింది. గతంలో ఇచ్చిన తీర్పుపై 3 వారాలు సస్పెన్షన్ ఇవ్వాలని సింగిల్ జడ్జికి విజ్ఞప్తి చేసింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీలుగా సమయం ఇవ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌ కోరారు. ప్రభుత్వ అభ్యర్థనపై విచారించిన జస్టిస్​ బి.విజయ్​సేన్​రెడ్డి ధర్మాసనం.. విచారణకు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకోవాలని సూచించింది. దీంతో రేపు ఉదయం సీజే అనుమతి కోరతామని ఏజీ బీఎస్​ ప్రసాద్​ కోర్టుకు విన్నవించారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేయాలని సిట్‌ను గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించారు. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని హైకోర్టు సీజే ధర్మాసనం వద్ద ప్రభుత్వం అప్పీలు చేసింది. క్రిమినల్ కేసుల్లో సింగిల్ జడ్జి తీర్పులపై అప్పీలు తమ పరిధిలోకి రాదని ధర్మాసనం తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సమయం ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై... సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు సింగిల్ జడ్జికి ప్రభుత్వం తెలిపింది.

వివాదం అంతా కోర్టుల చుట్టూనే: ఎమ్మెల్యేలకు ఎర కేసు నమోదైనప్పటి నుంచి.. వివాదం అంతా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. గతేడాది అక్టోబర్ 26న మెయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి నాంపల్లి అనిశా ప్రత్యేక కోర్టులో ముగ్గురు నిందితులైన రాంచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను ప్రవేశ పెట్టారు. కోర్టు మాత్రం నిందితుల రిమాండ్‌కు అంగీకరించలేదు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ను నమోదు చేశారని.. దీన్ని దర్యాప్తు చేసే పరిధి మెయినాబాద్ పోలీసులకు లేదంటూ అనిశా కోర్టు తిరస్కరించింది.

దీంతో పోలీసులు హైకోర్టుకు వెళ్లి న్యాయమూర్తి ఆదేశాలతో ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి ఈ కేసు దర్యాప్తునకు బదిలీ చేసింది. సిట్ ఏర్పాటును సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మాత్రం సిట్ దర్యాప్తుపై స్టే విధించడానికి నిరాకరిస్తూ.. హైకోర్టు దీని విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తిరిగి హైకోర్టులో సిట్ దర్యాప్తుపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుదీర్ఘ వాదనలు కొనసాగిన తర్వాత.. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ విజయసేన్ రెడ్డి తీర్పునిచ్చారు.

ఆ సమయంలో పలు మధ్యంతర పిటిషన్లు దాఖలయ్యాయి. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎల్ సంతోష్, తుషార్ కపూర్, జగ్గుస్వామిలకు సిట్ అధికారులు 41ఏ సీఆర్పీసీ నోటీసులివ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 41ఏ సీఆర్పీసీ నోటీసులపై కోర్టు స్టేలు విధిస్తూ వచ్చింది. బీఎల్ సంతోష్, తుషార్‌లను నిందితులుగా చేరుస్తూ మెయినాబాద్ పోలీసులు.. నాంపల్లి అనిశా ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన మెమోలను సైతం కోర్టు తిరస్కరించింది.

సీజే ధర్మాసనంలోనూ పోలీసులకు చుక్కెదురు: హైకోర్టు సింగిల్ బెంచ్‌లో ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ తీర్పునిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ధర్మాసనంలో అప్పీల్ చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత సీజే ధర్మాసనంలోనూ పోలీసులకు చుక్కెదురైంది. ఎమ్మెల్యేలకు ఎర కేసును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో పోలీసులున్నారు. ధర్మాసనం ఇచ్చిన తీర్పు అమలును రెండు వారాలపాటు వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కోరినా.. దానికి ప్రధాన న్యాయమూర్తి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.