ETV Bharat / state

Rains in AP: అకాల వర్షం.. అన్నదాతకు తెచ్చెను మళ్లీ కష్టం

author img

By

Published : Apr 24, 2023, 10:13 AM IST

Heavy Rains in AP
Heavy Rains in AP

Heavy Rains in AP: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాలులలో మొదలైన వాన.. ఉరుములు, మెరుపులు, పిడుగులు, వడగండ్లతో బీభత్సం సృష్టించింది. వేర్వేరు జిల్లాల్లో పిడుగుపాటుకు ఏడుగురు మృతి చెందారు. ఓ బాలికకు తీవ్రగాయాలయ్యాయి. అకాల వర్షాలతో పంటలు నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

అకాల వర్షం.. అన్నదాతకు తెచ్చెను మళ్లీ కష్టం

Heavy Rains in AP: ఆంధ్రప్రదేశ్​లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులతో మొదలైన వర్షం.. ఉరుములు, మెరుపులు, వడగండ్లు, పిడుగులతో ప్రజలు, అన్నదాతలను బెంబెలెత్తిచింది. అకాల వర్షాల కారణంగా చాలా మంది రైతులు చేతికొచ్చిన పంటను కోల్పోయారు. పిడుగుపాటుతో పలువురు మృతి చెందారు.

పిడుగుపాటుకు ఏడుగురు మృతి: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం గ్రామ రైతు చాట్ల శ్యామ్‌బాబు, కూలీలు కొరివి కృపాదానం, నీలం ప్రవీణ్‌.. కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటపై పట్టాలు కప్పి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురయ్యారు. ప్రమాదంలో శ్యామ్‌బాబు అక్కడికక్కడే చనిపోగా.. కృపాదానం స్థానిక CHCలో చికిత్స పొందుతూ మరణించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రామానగరంలో ఇద్దరు.. కృత్తివెన్ను మండలం సంగమూడికి చెందిన రైతు కొనసాని వెంకటేశ్వరరావు పిడుగుపాటుకు ప్రాణాలొదిలారు. అవనిగడ్డ మండలం రామచంద్రపురంలో మొక్కజొన్న పంట తడవకుండా పరదాలు కప్పేందుకు వెళ్లిన వ్యవసాయ కూలీ వెంకట రామయ్య పిడుగు పాటుకు దుర్మరణం చెందారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం సామంతపూడికి చెందిన పోకూరి తిరుపతయ్య గేదెలను మేత కోసం పొలానికి తోలుకెళ్లి పిడుగు పడి మృత్యువాతపడ్డారు.

పిడుగుపాటుకు వరికుప్పలు దగ్ధం: తాళ్లూరు మండలం నాగంకొట్లపాలెం గ్రామానికి చెందిన బాలిక శిరీష వడగండ్ల ధాటికి తీవ్రంగా గాయపడింది. తల్లితో కలిసి పొలానికి వెళ్లిన శిరీషపై పెద్ద సైజు వడగండ్లు పడటంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పిడుగుపాటుకు ఐదు చోట్ల వరికుప్పలు, వరిగడ్డి వాములు దగ్ధమయ్యాయి. అకాల వర్షానికి పొలాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న, పసుపు పంట, కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది.

బాపట్లలో పిడుగుపడి రెండు గేెదెలు మృత్యువాత: బాపట్ల జిల్లా అద్దంకి మండలం చక్రాయపాలెంలో పిడుగుపడి గుమ్మడి నరసింహారావు అనే రైతుకు చెందిన రెండు గేదెలు చనిపోయాయి. ఒక్కో గేదె ఖరీదు సుమారు 80వేల వరకు ఉంటుందని రైతు వాపోయారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు , తాళ్లూరు, దర్శి మండలాల్లో వడగండ్ల వానతో మిర్చి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు.

సోమ, మంగళ రెండు రోజులు వర్షాలు: మార్చి నెలాఖరులో కురిసిన వర్షాలకు చాలా చోట్ల పంటలు దెబ్బతినగా.. మళ్లీ వర్షాలు, ఈదురుగాలులు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో.. పొలాల్లో వర్షపు నీరు నిలవడంతో ఇప్పట్లో కోతలు కూడా సాగే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. సోమ, మంగళవారాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని, ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురుస్తాయని.. అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.