ETV Bharat / state

Chilli Crops Loss: మిర్చి రైతుల ఆశలు వర్షార్పణం.. మిన్నంటిన కష్టాలు

author img

By

Published : May 6, 2023, 8:50 AM IST

Updated : May 6, 2023, 9:40 AM IST

Chilli farmers lost due to rains
Chilli farmers lost due to rains

Chilli Farmers Crop Loss due to Rains: మండు వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలు.. రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో పెట్టుబడి కూడా రాదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వచ్చిన మిరప పంట.. నాశనమైపోవడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోని కర్షకులు కన్నీళ్లు పెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ వాపోతున్నారు.

Chilli Farmers Crop Loss due to Rains: కల్లాల్లో ఎండబెట్టిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు. అయినా ఫలితం లేక బూజు పట్టిపోతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మిర్చి రైతులు పంటను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. వారం రోజులుగా వర్షాలు పడుతుండటంతో.. కల్లాల్లో ఉన్న మిర్చిపై పట్టాలు తీయడం లేదు. దీంతో పట్టాల కింద ఉన్న మిర్చి బూజు పట్టి కుళ్లిపోతుందంటూ రైతులు వాపోతున్నారు. కల్లాల్లో కాయలు తడిచిపోవడంతో వాటిని మళ్లీ వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి పట్టాలపై ఆరపెడుతున్నారు. అయినప్పటికీ పంటను పూర్తిగా చేతికి తీసుకునే పరిస్థితి లేదంటున్నారు. మరోవైపు కోతకు సిద్ధంగా ఉన్న మిర్చి వర్షాలకు తడిచి తాలుగా మారిపోయాయి. మిర్చిలో తాలు కాయలు వేరుచేసే పద్ధతి నుంచి.. తాలు నుంచి మంచి కాయలు ఏరుకునే దుస్థితికి వచ్చామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

వాతావరణ హెచ్చరికలతో కుంగిపోతున్న రైతులు: చీడ, పీడల నుంచి పంటను కాపాడుకుని కల్లం దాకా చేర్చాక.. అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు కల్లాల్లోని మిర్చి పూర్తిగా తడిచిపోయింది. కల్లాలోని మిర్చిపై టార్పలిన్‌ పట్టాలు కప్పడంతో లోపలే కుళ్లిపోయే పరిస్థితిలు కూడా కనిపిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే విధమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతు మరింత కుంగిపోతున్నాడు. ఇప్పుడు కళ్లాలలో ఉన్న మిర్చి ముప్పావు వంతు పాడై పోయిందని కన్నిటీ పర్యంతమవుతున్నారు.

పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాని పరిస్థితి: రంగు మారితే రేటు తగ్గి పోయి పెట్టుబడులు కూడా రాక పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకు పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలంలో మొక్కలకు ఉన్న కాయలు సైతం తాలుగా మారిపోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తడిసిన కాయలు ఆరబెట్టేందుకు అదనపు ఖర్చులు అవుతున్నాయి. ఆరబెట్టిన తర్వాత వ్యాపారులు ఎంతకు కొంటారో తెలియడం లేదు. సాగు ఖర్చులు, కౌలు, పురుగుమందులు అన్నీ కలిపి ఎకరాకు లక్షన్నర నుంచి 2లక్షల మేర ఖర్చు చేశారు. ఇప్పుడు అందులో సగం కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదనగా చెబుతున్నారు.

పల్నాడు జిల్లాలో 4టన్నుల కాయలు తడిసిపోయినట్లు అంచనా: మిర్చి పంట కోసిన తర్వాత నష్టం జరిగితే నిబంధనల ప్రకారం పరిహారం అందదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉద్యానశాఖ అధికారులు ఆరబెట్టిన మిర్చి ఎంతమేర నష్టపోయారన్న వివరాలు సైతం అంచనా వేయడం లేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేనందున తామేమి చేయలేమని క్షేత్రస్థాయి అధికారులు మిన్నకుండిపోయారు. పల్నాడు జిల్లాలో 4 టన్నులు కాయలు తడిసినట్లు ప్రాథమికంగా అంచనా వేయగా గుంటూరు జిల్లాలో శనివారం నాటికి లెక్కలు తేలుతాయని యంత్రాంగం చెబుతోంది.

ఇవీ చదవండి:

Last Updated :May 6, 2023, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.