ETV Bharat / state

ప్రేమ కోసం ప్రాణాలు తీసిన ఘటనలో విస్తుపోయే నిజాలు..!

author img

By

Published : Feb 26, 2023, 2:02 PM IST

Naveen Murder Case: ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడినే హత్య చేశాడు ఓ కిరాతకుడు. గొంతు నులిమి చంపి తర్వాత.. తలను, మొండెం నుంచి వేరు చేశాడు. తన ప్రేయసిని బెదిరించాడని గుండెను చీల్చాడు. చేతి వేళ్లను నరికాడు, మర్మాంగాలను కోశాడు. పేగులు పెకిలించివేశాడు. హత్య చేసిన తర్వాత మృతుడి తండ్రికి ఫోన్ చేసి ఏమీ తెలియనట్లు మాట్లాడాడు నిందితుడు. సైకోలా మారి హత్య చేసిన తీరును చూసి పోలీసులే నివ్వెరపోయారు.

Naveen Murder Case
నవీన్ హత్య కేసు

Naveen Murder Case: ప్రేమ ముందు స్నేహం ఓడిపోయింది. ప్రేమించిన యువతిని వేధిస్తున్నాడనే కారణంతో.. ప్రాణ స్నేహితుడినే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్య కేసులో.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అసలు వెబ్ సిరీస్​ల ప్రభావం యువతపై ఎంతగా ఉందో మరోసారి తెలియజేశాయి.

హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌కు చెందిన హరిహర కృష్ణ.. ఫిర్జాదీగూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితుడు అయిన.. నవీన్ నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గతంలో ఈ ఇద్దరూ కూడా దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ జూనియర్ కళాశాలలో చదువుకునేటప్పుడు మంచి స్నేహితులు.

పరిచయం.. ప్రేమగా: ఇంటర్ మీడియట్ చదివేటప్పుడు దగ్గరలోని శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న ఓ యువతితో నవీన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇంజినీరింగ్‌కు వెళ్లినా ఆమెతో నవీన్ ప్రేమాయణం సాగింది. ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో.. రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత హరిహర కృష్ణతో ఆ యువతి స్నేహంగా ఉండేది. ఈ విషయం తెలుసుకున్న నవీన్... తన స్నేహితురాలిని ప్రశ్నించాడు. తరచూ ఫోన్ చేయడంతో పాటు వాట్సాప్ సందేశాలు కూడా పంపించాడు. నవీన్ ఇబ్బంది పెడుతున్నాడని.. ఆ యువతి హరిహర కృష్ణకు చెప్పింది.

వెబ్ సిరీస్​లు: దీంతో హరిహర కృష్ణ, నవీన్‌పై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా నవీన్‌ను చంపాలని కుట్ర పన్నాడు. గత మూడు నెలలుగా దీనికోసం వివిధ క్రైం వెబ్ సిరీస్‌లు చూశాడు. యూట్యూబ్‌లలోనూ, వివిధ సైట్​లలో హత్యలకు సంబంధించిన దృశ్యాలు చూశాడు. ఆ తర్వాత నవీన్ హత్యకు ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ఈ నెల 17వ తేదీన నవీన్‌కు ఫోన్ చేసిన హరిహర కృష్ణ.. హైదరాబాద్‌కు రావాల్సిందిగా చెప్పాడు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని చెప్పడంతో నల్గొండ నుంచి 17వ తేదీన ఉదయం హరిహర కృష్ణ వద్దకు నవీన్ వచ్చాడు. తర్వాత.. ఇద్దరూ కలిసి హరిహర కృష్ణ ద్విచక్ర వాహనంపై ఇంటర్ స్నేహితుడి దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి భోజనం చేసి.. అక్కడ నుంచి సినిమా చూడటానికి వెళ్లారు. సినిమా చూసిన తరువాత.. ఆ స్నేహితుడు తన ఇంటికి వెళ్లిపోయాడు.

గుండెను చీల్చి.. పేగులు తీసి: హరిహరకృష్ణ.. నవీన్‌ను మూసారాంబాగ్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. నవీన్ నల్గొండ వెళ్తానని చెప్పగా... బైక్​పై ఇద్దరూ బయల్దేరారు. ఎల్బీనగర్ మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్ వైపు వెళ్లారు. నిర్మానుష ప్రాంతంలోకి వెళ్లిన తరువాత.. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత తమ స్నేహితురాలి గురించి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు పరస్పరం నెట్టుకున్నారు. తోపులాటలో నవీన కిందపడిపోగా.. నవీన్‌పై కూర్చుని హరిహర కృష్ణ గట్టిగా గొంతు నులిమి ఊపిరాడకుండా చేశాడు. నవీన్ మృతి చెందిన తరువాత.. తన వెంట తెచ్చుకున్న ఓ కత్తితో తల, మొండెం వేరు చేశాడు. ఈ తర్వాత గుండె చీల్చాడు. పొట్ట భాగాన్ని కోసి.. పేగులు బయటకు తీశాడు. మర్మాంగాలను కోశాడు.

ఏమీ ఎరగనట్టు: 17వ తేదీన వెళ్లిన నవీన్ రెండు రోజులైనా యూనివర్శిటీ హాస్టల్‌కు రాకపోవడంతో తోటి విద్యార్థులు హరిహరకృష్ణకు 19వ తేదీ ఫోన్ చేశారు. 17వ తేదీ రాత్రే తన దగ్గరి నుంచి వెళ్లినపోయినట్లు హరిహర కృష్ణ.. నవీన్ హాస్టల్ ఫ్రెండ్స్‌కు చెప్పాడు. నవీన్ హాస్టల్‌కు రాకపోవడంతో.. అక్కడ ఉంటే తోటి విద్యార్థులు ఆయన తండ్రికి చెప్పారు. కానీ అప్పటికే.. నవీన్ సమీప బంధువు చనిపోవడంతో వాళ్ల తల్లిదండ్రులు.. ఆ బాధలో ఉన్నారు. ఈ నెల 20వ తేదీన హరిహర కృష్ణ.. నవీన్ తండ్రి శంకర్‌కు ఫోన్ చేశాడు. నవీన్ కనిపించడం లేదని.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామని ఏమీ తెలియనట్లు చెప్పాడు. స్నేహితుల ఇంటికి వెళ్లి ఉంటాడులే అని భావించిన నవీన్ తండ్రి శంకర్.. మరుసటి రోజు వరకూ ఎదురు చూశాడు. తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి నవీన్ గురించి అడిగాడు.

ఫోన్ స్విచాఫ్: అయినా సరే ఆచూకీ తెలియక పోవడంతో 21వ తేదీన హరిహర కృష్ణకు ఫోన్ చేసిన నవీన్ తండ్రి శంకర్.. హైదరాబాద్ వస్తున్నామని చెప్పారు. నగరానికి చేరుకున్న తర్వాత హరిహరకృష్ణకు శంకర్ ఫోన్ చేశాడు. గంటలో వస్తానని దిల్‌సుఖ్‌నగర్‌లో వేచి ఉండమని చెప్పిన హరిహరకృష్ణ.. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసి పెట్టుకున్నాడు. దీంతో నవీన్ తండ్రి శంకర్.. నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఈ నెల 21వ తేదీన సాయంత్రం ఫిర్యాదు చేశారు. 22వ తేదీన.. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, నవీన్ కాల్ డేటాను పరిశీలించారు. చివరగా హరిహరకృష్ణ నెంబర్‌ నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. 22వ తేదీన పోలీసులు హరిహర కృష్ణ ఇంటికి వెళ్లారు. అప్పటికి ఇంట్లో అతను లేకపోవడంతో... తల్లిదండ్రుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

తల్లిదండ్రుల రోదన: పోలీసులు నిఘా పెట్టిన విషయాన్ని తెలుసుకున్న హరిహర కృష్ణ 24వ తేదీన రాత్రి అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల వద్ద లొంగిపోయినట్లు సమాచారం. తమ స్నేహితురాలు తనతో స్నేహంగా ఉంటూ మాట్లాడుతున్నందుకు నవీన్ బెదిరించడంతోనే ఈ హత్య చేసినట్లు హరిహర కృష్ణ ఒప్పుకున్నట్లు తెలిసింది. ఘటనా స్థలానికి నిందితునితో పాటు కలిసి వెళ్లిన పోలీసులు.. అక్కడ నవీన్ మృతదేహాన్ని గుర్తించారు. మొండెంతో పాటు తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నవీన్ హత్య గురించి తెలుసుకున్న ఇతర స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ వద్ద ఆందోళనకు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు.

కూలీ పనులు చేసుకుంటూ: నాగర్ కర్నూల్ జిల్లాలోని వెల్దండ మండలం కొట్రతండాకు చెందిన నవీన్ తండ్రి.. సన్నకారు రైతు కాాగా.. వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులను తల్లిదండ్రులు చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు నవీన్ నల్గొండలో మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగా.. రెండో కుమారుడు కల్వకుర్తిలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నవీన్, హరిహర కృష్ణ ఇద్దరు ప్రాణ స్నేహితులని.. నవీన్ తండ్రి శంకర్ పేర్కొన్నారు. నిందితుడు హరిహర కృష్ణ ఎస్బీఐ కాలనీలోని మూసారాంబాగ్‌లో తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఫిర్జాదీగూడలోని అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్నాడు.

రిమాండ్: నవీన్‌ను హత్య చేసేందుకు హరిహర కృష్ణ పలు క్రైం వెబ్ సీరీస్‌లతో పాటు, వివిధ యూట్యూబ్‌ వీడియోలు, పలు రకాలు సైట్లు చూసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎటువంటి ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. నవీన్ మృతదేహం నుంచి అవయవాలు వేరు చేసే సమయంలో చేతికి గ్లౌజులు వేసుకొని కత్తిని పట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మృతదేహం ఆనవాళ్లు గుర్తించకుండా నవీన్ వేసుకున్న దుస్తులను.. తీసి ఓ బ్యాగులో పెట్టుకున్నాడు. అంతే కాకుండా నవీన్ ఉపయోగించిన ఫోన్​ని ధ్వంసం చేసి దాన్ని తన వెంట తీసుకెళ్లాడు. నిందితుడు హరిహర కృష్ణను అరెస్ట్ చేసిన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు.. హయత్ నగర్ కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు పంపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.