ETV Bharat / state

ఉన్నత విద్యాశాఖలో ఖాళీల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

author img

By

Published : Jan 19, 2023, 8:17 PM IST

CM REVIEW
ఉన్నత విద్యాశాఖపై జగన్ సమీక్ష సమావేశం

CM YS Jagan mohan Reddy: ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూన్ కల్లా నియామకాలు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు డిగ్రీ పూర్తి చేయగానే ఉద్యోగం లభించేలా పాఠ్యప్రణాళిక, సహా సరికొత్త కోర్సులు అందుబాటులోకి తేవాలని జగన్ అధికారులకు సూచించారు. ప్రతి కళాశాలలో బోధనా, వసతుల పరంగా నాణ్యత పెరగాలని సీఎం ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖలోని విద్యాసంస్థలు నాక్‌ అక్రిడిటేషన్‌ కచ్చితంగా సాధించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

YS Jagan Review on Higher Education: ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్​ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నత విద్యాశాఖ సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు. సమీక్షాసమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్ రెడ్డితో పాటు... ఉన్నత విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకుని జూన్‌ కల్లా నియామక ప్రక్రియను ప్రారంభించాలని సీఎం నిర్దేశించారు. ఉన్నత విద్యాశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నామని.. ఈ నేపథ్యంలో సిబ్బంది భర్తీని త్వరితగతిన చేపట్టాలని సీఎం సూచించారు. డిగ్రీ చదువుతున్నవిద్యార్థుల నైపుణ్యాలను మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వివిధ కోర్సులను పాఠ్యప్రణాళికలో ఇంటిగ్రేట్‌ చేయాలని సూచించారు. విదేశాల్లో విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను పరిశీలించాలని, వాటిని ఇక్కడి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్‌: జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యులమ్‌ ఉండాలని, సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ కరిక్యులమ్‌లో భాగం కావాలన్నారు. ఈ తరహా కోర్సుల వలన డిగ్రీ పూర్తయ్యేనాటికి స్వయం ఉపాధి అందుతుందన్నారు. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్‌ చూసి, వాటిని మన దగ్గర అమలయ్యేలా చూడాలని సూచించారు. స్వయం ఉపాధిని కల్పించే నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్ వంటి సంస్ధలతో ఈ కోర్సుల కోసం టైఅప్‌ చేసుకోవాలని సీఎం నిర్దేశించారు. రిస్క్‌ అనాలసిస్, బ్యాంకింగ్, రిస్క్‌ మేనేజ్​మెంట్, రియల్‌ ఎస్టేట్‌ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలని, వచ్చే జూన్‌ కల్లా పాఠ్యప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలని సీఎం సూచించారు.

నాక్‌ అక్రిడిటేషన్‌: ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రతి కాలేజీలోనూ బోధనాపరంగా, వసతులు పరంగా నాణ్యత పెరగాలని సీఎం ఆదేశించారు. ప్రతి విద్యాసంస్థ నాక్‌ అక్రిడిటేషన్‌ సాధించాలని, మూడేళ్లలో కాలేజీల ప్రమాణాలు పెంచుకునేలా వారికి చేయూత నివ్వాలని సూచించారు. ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ మూడేళ్లలో ప్రమాణాలు పెంచుకోవాలన్నారు. మూడేళ్ల తర్వాత ఉన్నత విద్యాశాఖలోని విద్యాసంస్థలు నాక్‌ అక్రిడిటేషన్‌ కచ్చితంగా సాధించాలని సీఎం స్పష్టంచేశారు. అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. అప్పుడే విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. కళాశాలల్లో కోర్సులన్నీ ఇవాల్టి అవసరాలకు తగిన విధంగా రూపొందించాలన్నారు.

యూనిఫామ్‌ పాలసీ: కళాశాలలకు అనుమతుల విషయంలో యూనిఫామ్‌ పాలసీ ఉండాలని సీఎం తెలిపారు. వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్‌ అందించే బాధ్యత స్కిల్‌ యూనివర్సిటీ తీసుకోవాలన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కిల్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్న సీఎం.. ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు చేయాలన్నారు. హై ఎండ్‌ స్కిల్స్‌లో భాగంగా.. సాప్ట్‌వేర్‌ స్కిల్స్‌ను అభివృద్ధి చేయాలన్నారు. కోడింగ్, క్లౌడ్‌ సర్వీసెస్‌ లాంటి డిమాండ్‌ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలన్నారుు. విద్యార్ధులకు సర్టిఫికేషన్‌ ఉంటేనే ఎంప్లాయిమెంట్‌ పెరుగుతుందని, ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలు కలిపి కరిక్యులమ్‌ రూపొందించాలని సీఎం నిర్దేశించారు. సోలార్‌ పార్క్‌లు, సోలార్‌ మోటార్లు, ప్యానెల్స్‌ రిపేరు వంటి వాటిలో నైపుణ్యం కొరత చాలా ఎక్కువగా ఉందని, ప్రతి నియోజకవర్గంలో ఇవి అందుబాటులో ఉండాలన్నారు. ఈ మేరకు కోర్సులు, కరిక్యులమ్, శిక్షణ ఉండాలన్నారు. వచ్చే జూన్‌ లక్ష్యంగా ఈ తరహా కోర్సులు ఏర్పాటు చేయాలన్నారు.

అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజి బలోపేతం: కొన్ని ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో బోధన, వసతులు తీసికట్టుగా ఉన్నాయని, మరికొన్ని కాలేజీలు మోసపూరిత చర్యలకు దిగుతున్నాయన్న అంశంపై సమావేశంలో చర్చించారు. బోధన సిబ్బంది, వసతి, సౌకర్యాలను ప్రమాణంగా తీసుకోవాలని, అందులో చదివే విద్యార్థుల హాజరును మరొక ప్రమాణంగా తీసుకుని.. ఆయా కాలేజీలపై ఒక నిర్ణయానికి రావాలని సీఎం స్పష్టం చేశారు. బోధన సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తిరుపతి, విశాఖపట్నంలో ఉన్న అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీని బలోపేతం చేయడం సహా సెంట్రల్‌ ఆంధ్రా పరిధిలో ఒకచోట అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. యూనివర్శిటీల్లో నియామకాలకు సంబంధించి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంపై ఆలోచించాలని సీఎం ఆదేశించారు. సమర్థులైన బోధనా సిబ్బందిని నియమించేందుకు, తద్వారా బోధనా ప్రమాణాలను విశ్వవిద్యాలయాల్లో పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ట్రిపుల్‌ ఐటీలలో సిబ్బంది నియామకం, ఇతర పెండింగ్‌ అంశాలను సత్వరమే పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.