ETV Bharat / state

నవరత్న ఇల్లు.. గ్రామీణ పేద ప్రజలకు నిల్లు!.. ఇంటి నిర్మాణాల కోసం లక్షల మంది ఎదురుచూపులు

author img

By

Published : Feb 17, 2023, 7:08 AM IST

RURAL PEPOLE WAITING FOR HOUSES
RURAL PEPOLE WAITING FOR HOUSES

RURAL PEPOLE WAITING FOR HOUSES : వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడున్నర సంవత్సరాలైనా.. సొంతంగా ఒక్క ఇల్లూ గ్రామీణ పేదలకు మంజూరు చేయలేదు. దాదాపుగా 2.5 లక్షల మంది పేదలు ఇంటి నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయంతో నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాన్ని నెట్టుకొస్తున్న ప్రభుత్వం.. పేదలను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు.

నవరత్న ఇల్లు.. గ్రామీణ పేద ప్రజలకు నిల్లు!.. ఇంటి నిర్మాణాల కోసం లక్షల మంది ఎదురుచూపులు

RURAL PEPOLE WAITING FOR HOUSES : వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో.. గ్రామీణ పేద ప్రజల సొంత ఇంటి నిర్మాణం.. అందని ద్రాక్షగానే మిగులుతోంది. అధికారం చేపట్టి సుమారు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా.. జగన్ ప్రభుత్వం మాత్రం ఒక్కటంటే ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు. సుమారు రెండు లక్షల 50వేల మంది ఇంటి నిర్మాణం కోసం ఎదురుచూస్తుండగా.. రెండు సంవత్సరాల క్రితమే వీరికి ఇంటి స్థలాలు కేటాయించింది. కానీ నిర్మాణాల ఊసు మాత్రం పట్టించుకోవడం లేదు. అయితే రెండో దశలో చేపట్టే ఇళ్ల నిర్మాణాల్లో వీటిని చేర్చారు. కానీ వృథా ప్రయాసే అయ్యింది. 5 నెలల క్రితమే రెండో దశ కింద సుమారు 3 లక్షల నిర్మాణాలను ప్రారంభించినా.. గ్రామీణ పేదలకు మాత్రం వాటిని మంజూరు చేయలేదు.

రాష్ట్రంలో "నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల పథకం" కింద వైఎస్సార్​సీపీ సర్కార్​ జగనన్న కాలనీలు, ప్రజల సొంత స్థలాల్లో 16 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను చేపడుతోంది. ఇవన్నీ నగరాలు, పట్టణాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లోనే ఉన్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి పట్టణాభివృద్ధి సంస్థల్లో కేంద్రం దాదాపు లక్షా 80 వేల రూపాయలు ఇస్తుండగా.. నగరాలు, పట్టణాల్లో రూ.లక్షా 50 వేలు అందిస్తోంది. నగరాలు, పట్టణాల్లో ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.30 వేలు ఇస్తోంది.

2020 డిసెంబరులో ఇంటి నిర్మాణం ప్రారంభం సందర్భంగా.. మొదటి దశలో 15.60 లక్షలు, రెండో దశలో 13 లక్షలు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అప్పట్లోనే రెండో దశలో గ్రామీణ ఇళ్లను చేర్చింది. మొదట్లో గ్రామీణ ప్రాంతంలో 4 లక్షల వరకు ఇళ్లను నిర్మించాల్సి ఉంటుందని గృహ నిర్మాణ శాఖ అధికారులు లెక్కగట్టారు.నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల పథకం గ్రామాలకు వర్తించదు. గ్రామీణ పేదల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకానికి కేంద్రం గతంలోనే లబ్ధిదారులను ఎంపిక చేసింది. రాష్ట్రంలో ఈ పథకానికి 1.80 లక్షల మందిని అర్హులుగా గుర్తించి, సాయాన్ని వారికి అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 4 లక్షల మంది గ్రామీణ పేదలకు.. ఈ రెండు పథకాలు వర్తించవు. ఫలితంగా వీరికి సంబంధించిన పూర్తి ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రాష్ట్రమే భరించాల్సిన పరిస్థితి.

ఈ భారాన్ని తగ్గించుకునేందుకు రాష్ట్రం ప్రభుత్వం ఓ ఎత్తుగడ వేసింది. పట్టణాభివృద్ధి సంస్థల విస్తీర్ణాన్ని పెంచి.. కొత్త పట్టణాభివృద్ధి సంస్థలనూ ప్రకటించింది. దీని వల్ల గ్రామీణ లబ్ధిదారులు కొందరు.. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వెళ్లారు. ఇది వరకే "నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల పథకం" కింద ఎంపికై.. వివిధ కారణాలతో నిర్మాణం చేపట్టలేని సుమారు లక్షా 70 వేలు మంది ఇళ్లను ప్రభుత్వం రద్దు చేసింది.

తొలగించిన వారి స్థానంలో పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చిన గ్రామీణ పేద లబ్ధిదారుల పేర్లను చేర్చి సర్దుబాటు చేసింది. మొత్తంగా లక్షా 50 వేల ఇళ్ల భారాన్ని రాష్ట్రం గత రెండు సంవత్సరాలలో తగ్గించుకుంది. మరో రెండున్నర లక్షల మంది లబ్ధిదారులు అచ్చంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వీరంతా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం చివర్లో గ్రామీణ ఇళ్లను ప్రారంభించే అవకాశమున్నట్లు గృహ నిర్మాణశాఖ అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.