ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన.. కేంద్ర జలశక్తి శాఖ అధికారులు

author img

By

Published : May 22, 2022, 5:46 AM IST

polavaram
polavaram

కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ సహా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ, డీడీఆర్పీ సభ్యులు శనివారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, రాక్ ఫిల్ గైడ్ బండ్, కాఫర్ డ్యామ్ లను పరిశీలించారు.

పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరాం.. నిపుణుల బృందంతో కలిసి శనివారం సాయంత్రం పరిశీలించారు. పనుల గురించి రాష్ట్ర జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి, ప్రాజెక్టు సీఈ సుధాకరబాబు వివరించారు. ముందుగా మోడల్‌ హౌస్‌ను సందర్శించి ప్రాజెక్టు నమూనాను పరిశీలించారు. అనంతరం స్పిల్‌వే బ్రిడ్జిపై నుంచి అప్రోచ్‌ ఛానల్‌, ఫిష్‌ల్యాడర్‌ చూశారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంలోని గ్యాప్‌-1, 2లతో పాటు డయాఫ్రం వాల్‌ రింగ్‌బండ్‌, సీపేజీ ప్రాంతాలను పరిశీలించారు. దిగువ కాఫర్‌డ్యాంతో పాటు ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను తనిఖీ చేసి తిరిగి ప్రాజెక్టు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే బస చేసిన శ్రీరాం ఆదివారం ఉదయం జలవిద్యుత్‌ కేంద్రం, కుడివైపు స్పిల్‌ఛానల్‌, క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌ పరిశీలిస్తారని జలవనరుల శాఖాధికారులు తెలిపారు. అనంతరం నిపుణుల బృందంతో పాటు సంబంధిత విభాగాలకు చెందిన వారితో సమీక్షిస్తారని పేర్కొన్నారు. సలహాదారు వెంట పీపీఏ సీఈవో జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌, ఎంకే శ్రీనివాస్‌, డీడీఆర్‌పీ కోఆప్టెడ్‌ సభ్యుడు గోపాలకృష్ణ, సభ్యులు వై.కె.హాండా, డీపీ భార్గవ్‌, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ ప్రతినిధి డాక్టర్‌ చిత్ర, సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ ఖయ్యూం అహ్మద్‌, పీపీఏ డైరెక్టర్లు దేవేంద్రరావు, అశ్వనీకుమార్‌, డాక్టర్‌ మహేష్‌గుప్తా, ప్రాజెక్టు ఈఈలు మల్లికార్జునరావు, పి.ఆదిరెడ్డి, కె.బాలకృష్ణమూర్తి, మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.

పోలవరం అక్రమాల్లో ఎమ్మార్వో, వీఆర్వో సస్పెన్షన్‌ : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం ఎమ్మార్వో ఎం.వీర్రాజు, చినరమణయ్యపేట వీఆర్వో షేక్‌ సత్తార్‌ బాబులను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. పోలవరం భూ సేకరణలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. నకిలీ డి.ఫాం పట్టాలు సృష్టించి అనర్హులకు రూ.కోట్ల మేర పరిహారం పంపిణీ చేశారు. ఈ అక్రమాలన్నింటినీ ‘పరిహారం...ఫలహారం’ శీర్షికన ‘ఈనాడు’ ప్రధాన సంచికలో మే 5న వెలుగులోకి తీసుకువచ్చింది. వీటిపై పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌, ఎక్స్‌ అఫీషియో జాయింట్‌ కలెక్టర్‌ను ప్రభుత్వం విచారణకు నియమించింది. ఆయన తన నివేదికను జిల్లా పాలనాధికారికి సమర్పించారు. ఈ అంశంలో ఎమ్మార్వో వీర్రాజు భూ రికార్డులు పరిశీలించకుండానే నకిలీ పట్టాలు ఉన్న వారికి అవసరమైన పత్రాలు ఇచ్చేశారని విచారణలో తేలింది. చినరమణయ్యపేట వీఆర్వో కూడా రికార్డులు ఏవీ పరిశీలించకుండా ఇచ్చిన నివేదికల మేరకు ఎమ్మార్వో సంతకాలు చేసి నకిలీ పట్టాలకు పరిహారం అందేందుకు తోడ్పడినట్లు విచారణలో తేలినట్లు నివేదిక సమర్పించారు. అస్సైన్‌మెంటు రిజిష్టర్‌, సబ్‌ డివిజన్‌ రికార్డులు, అడంగల్‌, వెబ్‌ల్యాండ్‌, ఏ రిజిష్టర్‌ తదితరాలు పరిశీలించకుండానే ఎడమ కాలువ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారని విచారణలో గమనించినట్లు నివేదికలో పేర్కొన్నారు. పరిహారం ఇచ్చేందుకు నిర్దేశించిన విధానాలు అనుసరించకుండానే తన విధులను ఎమ్మార్వో నిర్లక్ష్యం చేసినట్లు తెలిపారు. ఈ కారణాల వల్ల ఎమ్మార్వోను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన స్థానంలో డిప్యూటీ తహసీల్దార్‌ను ఆ స్థానంలో ఇన్‌ఛార్జిగా నియమించారు. వీఆర్వో సైతం రికార్డులు ఏవీ పరిశీలించకుండానే నివేదికలు ఇచ్చినట్లు పేర్కొంటూ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పోలవరం భూసేకరణ ప్రత్యేకాధికారి మురళీని సైతం బదిలీ చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: POLAVARAM: పోలవరంపై ఎత్తిపోతల నిర్మాణం.. మీ ఇష్టమొచ్చినట్లుగా నిర్మాణాలు సాధ్యం కాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.