ETV Bharat / state

స్నేహితులే హతమార్చారు..! మా కుమారుడి మృతిపై విచారణ జరపాలి..

author img

By

Published : Mar 28, 2023, 10:50 AM IST

Demand for an inquiry into their son death
కుమారుడి మృతిపై విచారణ జరపాలని డిమాండ్

Parents Demand Police Investigation: తమ కుమారుడిని హత్య చేశారని, సమగ్ర విచారణ చేయించి న్యాయం చేయాలని ఏలూరు జిల్లా కొక్కిరాయిలంకకు చెందిన ఉచ్చుల మహంకాళి, రూతమ్మ దంపతులు డిమాండ్ చేశారు. పుట్టినరోజు పార్టీ అని బయటకు తీసుకెళ్లి.. స్నేహితులే హతమార్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

స్నేహితులే హతమార్చారు..! మా కుమారుడి మృతిపై విచారణ జరపాలి..

Parents Demand Police Investigation: తమ కుమారుడి మృతిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఏలూరు మండలం కొక్కిరాయలంక గ్రామస్థులు.. ఉచ్చుల మహంకాళి, రూతమ్మ దంపతులు డిమాండ్ చేశారు. మానవ హక్కుల పరిరక్షణ సంఘం వారి ఆధ్వర్యంలో స్థానిక ఉమెన్స్ క్లబ్ ప్రాంగణంలో దళిత నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. తమ కుమారుడు విజయ భాస్కర్ (24) గత నెల 28వ తేదిన సాయంత్రం తన స్నేహితులైన సాయి, వాసు, శ్రీకాంత్, మరికొంత మంది వ్యక్తులు.. పుట్టిన రోజు పార్టీ ఉందని చెప్పి ఇంటి వద్ద నుంచి తీసుకువెళ్లారని చెప్పారు.

ఆ రోజు అర్ధరాత్రి అయినా తమ కుమారుడు ఇంటికి రాలేదని, తెల్లవారుజామున తమ కుమారుడు మొండికోడు వంతెన వద్ద శవంగా కనిపించాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము వెళ్లి చూసేసరికి అప్పటికే అక్కడికి పోలీసులు చేరుకున్నారని, హత్య జరిగిన ప్రదేశంలో పంచనామా నిర్వహించకుండా హడావుడిగా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు.

మృతదేహంపై బలమైన గాయాలు ఉన్నందున అది హత్యగా తాము భావిస్తున్నామని, కానీ మార్చి ఒకటో తేదీన మృతదేహాన్ని తమకు అప్పగించిన పోలీసులు సరైన విచారణ చేయకుండా హత్యను.. రోడ్డు ప్రమాదంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని మృతుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయంపై డీఎస్పీకు వినతి పత్రం అందజేశామని తెలిపారు.

"గత నెల 28వ తేదీన రత్నాల సాయి అనే కుర్రాడు.. అతనిది మా ఊరే. పుట్టిన రోజు ఉంది సాయంత్రం జరుపుకుందాం అని చెప్పి.. మా అబ్బాయిని తీసుకొని వెళ్లాడు. కానీ తరువాత మా అబ్బాయి తిరిగి రాలేదు. నేను రాత్రి 12 వరకూ చూసి.. ఆ టైమ్​లో ఫోన్ చేశాను. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఉదయాన్నే మా చిన్నాన్న కొడుకుకి ఫోన్ వచ్చింది. వాళ్లు ఎవరూ నాకు చెప్పలేదు. అక్కడకి వెళ్లి చూసిన తరువాత.. చనిపోయాడు అని ఫోన్ చేశాడు. ఉదయాన్నే మేము హాస్పిటల్ దగ్గరకి వచ్చాం.

బాడీ మీకు అర్జెంట్​గా కావాలి అంటే సంతకం చేయమని అన్నారు. మాతో సంతకం చేపించుకున్నారు. దానిని చదివి ఏం చెప్పలేదు. తణుకు నుంచి పనికి వెళ్లి వస్తున్న సమయంలో స్తంభానికి తగిలి పడిపోయాడు అని రాశారు. మా అబ్బాయిని నేను చూసే సమయానికి.. తల వెనుక భాగంలో, తొడ దగ్గర దెబ్బలు ఉన్నాయి. మా అనుమానం ఏంటంటే.. తీసుకెళ్లిన వారే ఏదైనా చేసి ఉండచ్చు. ఎందుకంటే చనిపోయి 27 రోజులవుతుంది.. కానీ ఇప్పటి వరకూ ఎవరూ ఏం చెప్పలేదు". - ఉచ్చుల మహంకాళి, మృతుడి తండ్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.