ETV Bharat / state

హంద్రీనీవా నుంచి ఆగిన సాగునీరు... పంట కాల్వల్లో పారుతున్న రైతుల కన్నీరు

author img

By

Published : Nov 1, 2022, 7:29 AM IST

Water supply Stopped to Handriniva
హంద్రీనీవా సుజల స్రవంతి పథకం

Water supply Stopped to Handriniva: సాగు నీరు పారాల్సిన పంట కాల్వల్లో రైతుల కన్నీరు పారుతోంది. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీరందించే హంద్రీనీవా సుజల స్రవంతి పథకం పడకేసింది. దాదాపు 2 వేల 300 కోట్ల రూపాయల విద్యుత్‌ బిల్లులు బకాయి పడటంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. 12 రోజులుగా కాల్వల్లో నీటి సరఫరా లేక వేల ఎకరాల్లో పంట ఎండుముఖం పట్టింది.

హంద్రీనీవా నుంచి ఆగిన నీటి సరఫరా

Water supply Stopped to Handriniva: శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆయకట్టుకు అందించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని దశాబ్దాల కిందటే చేపట్టారు. తొలిదశలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లక్షా 98 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు 216 కిలోమీటర్ల పొడవున ప్రధాన కాలువ తవ్వారు. జగన్‌ సీఎం అయ్యే నాటికే కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి జలాశయాలను సైతం,.. నిర్మించారు.

ప్రధాన కాలువ నిర్మాణ పనులు 90శాతం పూర్తి కాగా భూసేకరణ 99శాతం పూర్తయ్యింది. డిస్ట్రిబ్యూటరీల నిర్మాణమూ కొంతమేర జరిగింది. మిగిలిన డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి, మరో 305 కోట్లు ఖర్చు చేస్తే తొలిదశకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. కానీ మూడేళ్లలో కనీసం డిస్ట్రిబ్యూటరీలను సైతం నిర్మంచలేదు. 613 కోట్ల రూపాయలుగా ఉన్న విద్యుత్ బకాయిలు 2 వేల 343 కోట్లకు పెరిగాయి. ఈ ఒక్క ఏడాది బకాయిలే రూ.380 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

హంద్రీనీవా ప్రధాన కాలువపై ఉన్న పంపుహౌసుల్ని మేఘ సంస్థ నిర్మించింది. వాటి నిర్వహణనూ అదే సంస్థకు అప్పగించారు. కొన్ని నెలలుగా నిర్వహణకు సంబంధించి బిల్లులు చెల్లించలేదు. 32 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో మోటార్లలో గ్రీజు వేసే పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. నీటి సరఫరా నిలిచిన నేపథ్యంలో నిధులు విడుదల చేస్తే చిన్నచిన్న మరమ్మతులు చేసుకుంటామని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఈ ఏడాది శ్రీశైలానికి ముందుగా భారీగా నీరురావడంతో రైతులు ధైర్యంగా పంటలు వేశారు. రెండు ఉమ్మడి జిల్లాల్లో లక్ష ఎకరాలకు పైగా సాగు చేశారు. ప్రభుత్వం నీళ్లివ్వలేక చేతులెత్తేయడంతో వారికి ఏం పాలుపోవడం లేదు. హంద్రీనీవాలో దాదాపు 12 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందికొట్కూరు, వెల్దుర్తి, కల్లూరు, కృష్ణగిరి, దేవనకొండ, పత్తికొండ మండలాల్లో దాదాపు 48 వేల ఎకరాల ఆయకట్టు ఎండిపోయేలా ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ, విడమనకల్లు, బెలుగుబ్బ మండలాల్లో ఏకంగా 70 వేల ఎకరాల్లో పంటలు సాగు చేసిన రైతులు బిక్కమొహం వేశారు. శ్రీశైలం జలాశయంలో 208 టీఎంసీల నీళ్లున్నాయి. నీటిని అందించేందుకు పంపుహౌస్‌లు, మోటార్లు, కాల్వలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కానీ... కాల్వల్లో ఇప్పుడు రైతుల కన్నీరు తప్ప నీరు లేదు. పంటలు ఎండిన తర్వాత నీళ్లిచ్చి ఉపయోగం ఏంటని రైతులు ఆక్రోశిస్తున్నారు.

హంద్రీనీవాలో నీటి సరఫరా నిలిచిపోవడానికి విద్యుత్తు బకాయిలు కారణం కాదని అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రధాన కాలువకు కొంతమేర మరమ్మతులు చేయాల్సి ఉందని, అందుకే పంపింగ్‌ నిలిపివేశామని తెలిపారు. రెండ్రోజుల్లో నీరు విడుదలచేసే అవకాశం ఉందన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.