ETV Bharat / state

సివాలెత్తిన సీఐ.. మండిపడ్డ సీపీఐ నేత రామకృష్ణ

author img

By

Published : Feb 28, 2023, 3:17 PM IST

Etv Bharat
Etv Bharat

Ramakrishna Angry On CI Madhu : రెండు రోజుల క్రితం సీఐ మధు ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండి వైఎస్సార్సీపీ కార్యకర్తలా ప్రవర్తించడం ఏంటని పలువురు మండిపడ్డారు. తాజాగా ఈ విషయమై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘూటుగా స్పందిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి తమ అభ్యర్థులపై నమ్మకం లేక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవం చేసుకుంటున్నారని రామకృష్ణ ఆరోపించారు.

Ramakrishna Angry On CI Madhu :ఓ సీఐ మీసాలు తిప్పుతుంటే, మరో సీఐ తొడగొట్టి ప్రతిపక్ష పార్టీ నేతలను రెచ్చగొడుతూ బెదిరింపులకు దిగుతుంటే రాష్ట్ర డీజీపీ ఏమి చేస్తున్నారంటూ సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించిన రామకృష్ణ.. పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్సార్సీపీలో చేరాలనుకుంటే పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని, ప్రజలను.. ప్రతిపక్ష పార్టీల నాయకులను రెచ్చగొట్టి అక్రమ కేసులు పెట్టడం ఏమిటని ఆయన అన్నారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పోలీసుల తీరు దుర్మార్గంగా తయారైందని ఆయన ఆరోపించారు. కదిరిలో టీడీపీ మహిళను దుర్భాషలాడి రెచ్చగొట్టి, ఆందోళనకు దిగిన కార్యకర్తలపై వైఎస్సార్సీపీ నాయకులతో దాడులు చేయించారని విమర్శించారు. ఈ సంఘటనను వీడియో తీయటానికి వెళ్లిన నలుగురు మీడియా ప్రతినిధులపై కేసు పెట్టడం ఏమిటని, పోలీసు అధికారుల తీరు ఏమాత్రం బోగోలేదని ఆయన ఆరోపించారు. మహిళను దుర్భాషలాడిన కదిరి సీఐ మధును వెంటనే సస్పెండ్ చేయాలని, మీడియా ప్రతినిధులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి తమ అభ్యర్థులపై నమ్మకం లేక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవం చేసుకుంటున్నారని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నప్పటికీ, జగన్ మోహన్ రెడ్డికి తన అభ్యర్థులపై నమ్మకం లేక అక్రమాలకు పాల్పడి ఏకగ్రీవం చేసుకున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మారువేషాల్లో వెళ్లి నామినేషన్ వేసుకునే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలోనే ఏర్పడిందన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలిపేవారు కాదని, అందుకు భిన్నంగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

మీసాలు తిప్పుతూ, తొడలు కొడుతూ ప్రతిపక్షాలను రెచ్చగొడుతున్నారు: రామకృష్ణ

"పోలీసులకు ఇండియన్ పీనల్ కోడ్ ఉందో లేదో నాకు తెలియదు. సీఐ మధు వైఎస్ అవినాశ్ తొత్తు. గతంలో పోలీసు అధికారులు చూశాం. అధికార పార్టీ వాళ్ల మెడలు ఎక్కి ఈయనే వాళ్ల నాయకుడు అయినట్లుగా మీసాలు దువ్వుతున్నాడు. డీజీపీ నిద్రపోతున్నారా? ఉద్యోగానికి రాజీనామా చేసీ వైఎస్సార్సీపీ కండువా కప్పుకో. టిక్కెట్టు ఇస్తే హిందుపూరం ఎంపీ గోరంట్ల మాధవ్ మాదిరి పోటీ చేయ్యి. " - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

సీఐపై మండిపడడానికి కారణం : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి దేవళం బజారులో ఆక్రమణ తొలగింపు సందర్భంగా సీఐ మధు వ్యవహార శైలి ఉద్రిక్తత రాజేసింది. ఎలాంటి నోటీసులు లేకుండా ఆక్రమణలు ఎలా తొలగిస్తారంటూ తెలుగుదేశం కౌన్సిలర్‌ సుధారాణి అధికారులను నిలదీశారు. కౌన్సిలర్‌పై రాయడానికి వీల్లేని బూతు పదంతో దూషించారు. సీఐ తీరును నిరసిస్తూ తెదేపా మహిళా నాయకులు మధు నివాసం ఎదుట నిరసనకు వెళ్లారు.సీఐ మళ్లీ దురుసుగా ప్రవర్తించి, లాఠీతో కొట్టారని మహిళలు ఆరోపించారు. విషయం తెలుసుకున్న టీడీపీ కదిరి నియోజకవర్గ ఇంఛార్జి కందికుంట వెంకటప్రసాద్ పార్టీ శ్రేణులతో కలిసి జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రంగ ప్రవేశం చేశారు. గుంపులుగా వచ్చి టీడీపీ నాయకులు, కార్యకర్తల పైకి రాళ్లు, సీసాలు విసిరారు. కర్రలతో కొట్టారు. ఈ దాడిలో పదిహేనుమంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు.

ఈ సమయంలో సీఐ మధు వైఎస్సార్సీపీ నాయకులను మించి ప్రవర్తించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు సీఐను భుజం పైకి ఎక్కించుకోగా ఆయన మీసం మెలేశారు. టీడీపీ నేత కందికుంట వెంకటప్రసాద్‌కు సవాల్ విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన వేళ కదిరి గ్రామీణ, నల్లమాడ సీఐలు సిబ్బందితో అక్కడికి వచ్చారు. రెండు పార్టీల శ్రేణులను చెదర గొట్టారు. రాస్తారోకో చేస్తున్ననాయకుల్ని అక్కడి నుంచి స్టేషన్‌కు, గాయపడినవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులను టీడీపీ నాయకులు బీకే పార్థసారథి నిమ్మలకిష్టప్ప, పల్లె రఘునాథరెడ్డి పరామర్శించారు. సీఐ మధుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. గతంలోనూ అధికారపార్టీ అండ చూసుకుని టీడీపీ నాయకులపైకి తొడగొట్టారని ధ్వజమెత్తారు. స్టేషన్‌కు వెళ్లిన మహిళా నేతలను అవమానించారని ఇప్పుడు మహిళా కౌన్సిలర్‌ను బూతులు తిట్టారని గుర్తు చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.