ద్వీప దేశం శ్రీలంకలోని ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తిండి గింజల కోసం పూట పూటకు ఒక పోరాటమే చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభం మొదలైనప్పటి నుంచి.. కష్టాలు పెరుగుతున్నాయి.. కానీ.. తగ్గడం లేదు. ఏది కొనాలన్నా.. గంటల కొద్దీ క్యూలైన్లో ఉండాల్సిందే. దీంతో ఆ దేశ ప్రజలు నరకం చూస్తున్నారు. ఏం కొనాలన్నా ధరలు ఆకాశన్నంటడం వల్ల.. అనేక మంది నీళ్లతో కడుపులు నింపుకుంటున్నారు. ఈ క్రమంలో తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు శ్రీలంక మాజీ క్రికెటర్ రోషన్ మహానమ. తన దేశ ప్రజల కష్టాలను చూసి.. చలించిన ఆయన.. పెట్రోల్ బంకుల వద్ద క్యూలో నిల్చున్న ప్రజలకు టీ, బన్స్ అందజేస్తూ.. వారి ఆకలిని తీరుస్తున్నాడు.
పెట్రోల్ బంక్ల వద్ద కిలోమీటర్ల మేర క్యూ ఉండటం వల్ల.. గంటల కొద్దీ, కొన్ని చోట్ల అయితే రోజుల కొద్దీ పెట్రోల్, డీజిల్ కోసం పడిగాపులు కాస్తున్నారు. దీంతో చాలా మంది ఆహారం కోసం అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహానమ తన వంతు సాయంగా.. టీ, బన్స్ అందజేస్తున్నాడు.
కొలంబోలోని వార్డ్ ప్లేస్, విజేరామ మావత చుట్టూ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్లో నిలబడ్డ ప్రజలకు టీ, బన్స్ టీ, బన్స్ అందజేశాడు మహానమ. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కమ్యూనిటీ మీల్ షేర్ ద్వారా ఉన్నవాళ్లంతా తోటివారికి సాయం చేయాలని అభ్యర్థించాడు. ఈ కష్టసమయాల్లో ఒకరికి ఒకరు సాయంగా నిలవాలని పిలుపునిచ్చాడు. 'బంక్ల వద్ద క్యూలలో ఒకరినొకరు చూసుకోండి. ద్రవాలు, ఆహారాన్ని తీసుకురండి. ఎవరికైనా నలతగా ఉంటే.. పక్కనే ఉన్న సన్నిహిత వ్యక్తిని సంప్రదించండి. లేకుంటే.. 1990కి కాల్ చేయండి. ఈ కష్ట సమయాల్లో మనం ఒకరినొకరు చూసుకోవాలి' అని మహానామా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
ఇదీ చదవండి: రుతురాజ్, మెద్వెదేవ్పై ఫ్యాన్స్ ఫైర్.. అలా చేయడమే కారణం!