ETV Bharat / sports

భారత్​ గెలిచిన ప్రతిష్టాత్మక 'థామస్'​ కప్​ గురించి ఈ విషయాలు తెలుసా?

author img

By

Published : May 16, 2022, 7:13 AM IST

కోట్లాది మంది అభిమానుల ఆకాంక్షలను నెరవేరుస్తూ.. 43 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత బ్యాడ్మింటన్‌ జట్టు అద్భుతమే చేసింది. ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌లో భారత్‌ విజేతగా నిలిచింది. అత్యధికంగా 14 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేసియాను సమష్టిగా రాణించి ఫైనల్లో చిత్తు చిత్తుగా ఓడించి భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లఖించింది. థామస్‌ కప్‌ టైటిల్‌ సాధించిన ఆరో దేశంగా ఘనతను అందుకుంది. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారిగా కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రక విజయంలో ఆటగాళ్లందరూ హీరో పాత్రనే పోషించారు. ఈ నేపథ్యంలో ‘థామస్‌ కప్‌’ టోర్నమెంట్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

How India reacted to its historic win in Thomas Cup
భారత్​ గెలిచిన ప్రతిష్టాత్మక 'థామస్'​ కప్​ గురించి ఈ విషయాలు తెలుసా?

బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ టోర్నీల్లో ఒకటైన థామస్‌ కప్‌లో భారత్‌ అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క పతకం కూడా గెలవని భారత పురుషుల జట్టు.. ఏకంగా స్వర్ణంతో సత్తాచాటింది. ఆదివారం ఫైనల్లో భారత్‌ 3-0తో ఇండోనేసియాను మట్టికరిపించింది. 14 సార్లు విజేత ఇండోనేసియా.. భారత ఆటగాళ్ల పట్టుదల, పోరాటస్ఫూర్తి ముందు తలవంచింది. థామస్‌ కప్‌లో 1979 నుంచి కనీసం సెమీస్‌ కూడా చేరని భారత్‌.. స్వర్ణంతో బోణీకొట్టడం విశేషం. టోర్నీ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

  • థామస్‌ కప్‌ టోర్నీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన జార్జ్‌ అలన్‌ థామస్‌ది. ఇంగ్లాండ్‌కు చెందిన థామస్‌.. 1900ల్లో గొప్ప బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ సహ వ్యవస్థాపకుడు.
  • టెన్నిస్‌లో డేవిస్‌ కప్‌.. ఫుట్‌బాల్‌లో వరల్డ్‌ కప్‌ ఉన్నట్లే బ్యాడ్మింటన్‌లోనూ ఓ ప్రపంచస్థాయి టోర్నమెంట్‌ ఉండాలని థామస్‌ భావించారు. ఈ మేరకు ‘థామస్‌ కప్‌’టోర్నీకి ప్రణాళిక రచించారు. థామస్‌ కప్‌నే ‘వరల్డ్స్‌ మెన్స్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్స్‌’అని కూడా పిలుస్తుంటారు.
  • 1941లోనే ఈ టోర్నీ నిర్వహించాలని ప్రయత్నించినా...రెండో ప్రపంచయుద్ధం కారణంగా వీలుపడలేదు. దీంతో 1948-49లో తొలి ‘థామస్‌ కప్‌’ టోర్నీని ఇంగ్లాండ్‌లో నిర్వహించారు.
  • ఇందులో ఆసియన్‌, ఆస్ట్రేలియన్‌, పాన్‌-అమెరికన్‌, యూరోపియన్‌ ఇలా నాలుగు కేటగిరీల్లో మూడు క్వాలిఫైయింగ్‌ జోన్స్‌గా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆఫ్రికన్‌, ఓషియనియన్‌ కేటగిరీలు వచ్చి చేరాయి.
  • మూడేళ్లకోసారి జరిగే ఈ టోర్నీలో క్రీడాకారులు బెస్ట్‌ ఆఫ్ నైన్‌ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చేది. ఐదు సింగిల్స్‌ విభాగంలో.. నాలుగు డబుల్స్‌ విభాగంలో మ్యాచ్‌లు ఆడాలి. ఎవరైతే ఎక్కువ మ్యాచ్‌లు గెలుస్తారో వారే విజేతగా నిలిచేవారు. అలా తొలి ‘థామస్‌ కప్‌’ను మలేషియా గెలుచుకుంది.
  • 1984 నుంచి ఈ టోర్నీ రెండేళ్లకొకసారి జరుగుతోంది. అలాగే.. బెస్ట్‌ ఆఫ్‌ నైన్‌ కాకుండా బెస్ట్‌ ఆఫ్‌ ఫైవ్‌ ఫార్మాట్‌లో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. రెండు డబుల్స్‌, మూడు సింగిల్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.
  • తొలి మూడు సార్లు ‘థామస్‌ కప్‌’ను మలేషియానే గెలుచుకుంది. 1957 నుంచి దాదాపు దశాబ్దకాలం కప్‌ను ఇండోనేషియానే కైవసం చేసుకుంది.
  • ఇప్పటి వరకు జరిగిన ఈ టోర్నీలో డెన్మార్క్‌(2014) మినహా ఆసియేతర దేశాల్లో ఏ ఒక్కటీ ఈ కప్‌ను గెలవకపోవడం గమనార్హం.
  • ఇండోనేషియా అత్యధికంగా 14 సార్లు ఈ కప్‌ గెలవగా.. చైనా 10 సార్లు, మలేషియా నాలుగుసార్లు విజేతగా నిలిచాయి.
  • 2014లో దిల్లీ వేదికగా జరిగిన ఈ అంతర్జాతీయ మెగా టోర్నీలో జపాన్‌ తొలిసారి కప్‌ను దక్కించుకుంది.
  • భారత్‌ విషయానికొస్తే.. 1952లో తొలిసారి ‘థామస్‌ కప్‌’లో పోటీ పడింది. రెండు సార్లు ఫైనల్‌ రౌండ్‌ వరకు వెళ్లింది. మూడుసార్లు క్వార్టర్‌ ఫైనల్స్‌.. ఓసారి సెమీఫైనల్‌ వరకు వచ్చి వెనుదిరిగింది.
  • తాజాగా థాయ్‌లాండ్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మొదటిసారి భారత్‌ కప్ గెలిచి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.
  • ప్రపంచంలోని అన్నీ దేశాలు ఈ టోర్నీలో క్వాలిఫై అయి ఫైనల్‌ స్టేజ్‌కి చేరుకునేందుకు తాపత్రయపడుతుంటాయి. కానీ, కొన్ని దేశాలే ఫైనల్‌ స్టేజ్‌కు చేరుకుంటాయి.
  • 1984 నుంచి 2002 వరకు ఫైనల్‌ స్టేజ్‌లో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించేవారు. ఆ తర్వాత వీటి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
  • తాజా టోర్నమెంట్‌లో మొత్తం 29 దేశాలు పోటీ పడగా.. 16 దేశాలు క్వాలిఫై అయ్యాయి. వాటిని నాలుగు గ్రూపులుగా విభజించించి.. పోటీలు నిర్వహించారు.
  • ఫైనల్‌ మ్యాచ్‌లో 14 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాతో భారత్‌ తలపడి విజయకేతనం ఎగరవేసింది. థామస్‌ కప్‌ను తొలిసారి ముద్దాడింది.
    Thomas' Cup that India won
    భారత బ్యాడ్మింటన్‌ టీమ్​ సందడి

'థామస్'​ పోరు సాగిందిలా..

లక్ష్య వెనుకబడి కూడా..: అయిదుసార్లు ఛాంపియన్‌ మలేసియాపై క్వార్టర్‌ఫైనల్లో విజయం.. 2016 విజేత డెన్మార్క్‌పై సెమీస్‌లో గెలుపుతో జోరుమీదున్న భారత్‌.. ఫైనల్లో సాధికారిక ప్రదర్శనతో చెలరేగింది. యువ ఆటగాడు లక్ష్యసేన్‌, భారత అగ్రశ్రేణి డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టిల గొప్ప పోరాటానికి స్టార్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ అద్భుతమైన ముగింపునిచ్చాడు. తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 8-21, 21-17, 21-16తో ఆంథోని జింటింగ్‌పై విజయం సాధించాడు. గంటా 5 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో మొదటి గేమ్‌లో 8-21తో ఓడిన లక్ష్యసేన్‌ అసాధారణ రీతిలో పుంజుకున్నాడు. 7-3 ఆధిక్యంతో రెండో గేమ్‌ను ప్రారంభించిన లక్ష్య అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు. 17-13తో ముందజ వేసిన లక్ష్య.. 20-17తో రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 12-8తో ప్రత్యర్థి ఆధిపత్యం కనబరిచాడు. అయితే ఒక్కసారిగా గేరు మార్చిన లక్ష్య వరుసగా 5 పాయింట్లు నెగ్గి 13-12తో పైచేయి సాధించాడు. చూస్తుండగానే 21-16తో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

సాత్విక్‌ జోడీ అదరహో: అనంతరం మొదటి డబుల్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ 18-21, 23-21, 21-19తో సంజయ సుకముల్జో- ఎహసాన్‌ జంటపై విజయం సాధించింది. గంటా 13 నిమిషాల పాటు సాగిన పోరులో 18-21తో తొలి గేమ్‌లో ఓడిన సాత్విక్‌- చిరాగ్‌ జంట.. రెండో గేమ్‌లో 17-20తో దాదాపుగా మ్యాచ్‌ను కోల్పోయినట్లు కనిపించింది. ఇంకో పాయింటు గెలిస్తే ఇండోనేసియా జోడీదే మ్యాచ్‌. కానీ సాత్విక్‌- చిరాగ్‌ జోడీ మూడు మ్యాచ్‌ పాయింట్లను కాచుకుని 20-20తో స్కోరును సమం చేసింది. ప్రత్యర్థి జంట 21-20తో ముందంజ వేసినా.. మ్యాచ్‌పై ఆశలు వదులుకోలేదు. వరుసగా 3 పాయింట్లు నెగ్గి 23-21తో రెండో గేమ్‌ దక్కించుకుంది. మూడో గేమ్‌లో భారత జోడీ 11-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే కెవిన్‌- ఎహసాన్‌ జంట వరుసగా పాయింట్లు నెగ్గి 16-13తో ముందంజ వేసింది. ఈ సమయంలో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ వరుసగా 3 పాయింట్లతో ప్రత్యర్థి జంటను అందుకుంది. తర్వాత కెవిన్‌- ఎహసాన్‌ జోడీ 18-17తో ఆధిక్యంలో నిలిచింది. అయితే సాత్విక్‌- చిరాగ్‌ జోడీ మళ్లీ పుంజుకుని 21-19తో గేమ్‌ను, మ్యాచ్‌ను చేజిక్కిచుకుంది.

Thomas' Cup that India won
భారత బ్యాడ్మింటన్‌ ఆటగాళ్ల ఆనందం

అదిరే ముగింపు: రెండో సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 21-15, 23-21తో జొనాథన్‌ క్రిస్టీపై విజయభేరి మోగించాడు. శ్రీకాంత్‌ జోరు ముందు క్రిస్టీ తేలిపోయాడు. 48 నిమిషాల్లో ముగిసిన పోరులో తొలి గేమ్‌లో శ్రీకాంత్‌కు నామమాత్రమైన పోటీ ఎదురైంది. 8-2తో శ్రీకాంత్‌ ముందంజ వేసినప్పుడే భారత స్టార్‌దే మ్యాచ్‌ అని అర్థమైంది. రెండో గేమ్‌ హోరాహోరీగా సాగింది. ఒక దశలో 13-10తో శ్రీకాంత్‌ ఆధిక్యంలో నిలవగా.. తర్వాత 18-16తో క్రిస్టీ ముందుకెళ్లాడు. శ్రీకాంత్‌ 19-18తో పుంజుకున్నా.. ఆపై 21-20తో క్రిస్టీ గేమ్‌కు చేరువయ్యాడు. అయితే వరుసగా 3 పాయింట్లు గెలిచిన శ్రీకాంత్‌ 23-21తో మ్యాచ్‌లో పైచేయి సాధించాడు. రెండో డబుల్స్‌, మూడో సింగిల్స్‌తో పనిలేకుండా భారత్‌ ఛాంపియన్‌గా అవతరించింది.

నేను సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. జట్టు విభాగాల్లో విజయం సాధించడం.. అదీ థామస్‌ కప్‌ ఫైనల్స్‌ గెలవడం ఎంతో ప్రత్యేకం. ఇది ఒక్కరి విజయం కాదు.. పది మంది కలిసి ఆడి సాధించిన గొప్ప గెలుపు. - శ్రీకాంత్‌

అందరూ హీరోలే: భారత పురుషుల సింగిల్స్‌ నంబర్‌వన్‌ ఆటగాడు లక్ష్యసేన్‌ కలుషిత ఆహారం కారణంగా జబ్బు పడ్డాడు.. అగ్రశ్రేణి షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ గాయం నుంచి అప్పుడే కోలుకున్నాడు.. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఈ సీజన్‌లో పెద్దగా రాణించలేదు.. ఇదీ థామస్‌ కప్‌ ఆరంభానికి ముందు భారత జట్టు పరిస్థితి. కానీ అంచనాలను దాటి.. అడ్డంకులను అధిగమించి.. జట్టు అద్భుతమే చేసింది. ఈ చారిత్రక విజయంలో అందరూ హీరోలే. గాయం నుంచి కోలుకుని బరిలో దిగిన మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ ఆడిన అయిదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సత్తాచాటాడు. ఇక క్వార్టర్స్‌, సెమీస్‌లో స్కోరు 2-2తో సమమైనప్పుడు తానున్నానంటూ జట్టును గెలిపించే బాధ్యతను ప్రణయ్‌ సమర్థంగా నిర్వర్తించాడు. లక్ష్యసేన్‌ ఫైనల్‌కు ముందు మూడు మ్యాచ్‌లూ ఓడిపోయాడు. తుదిపోరులోనూ తొలి గేమ్‌ కోల్పోయాడు. కానీ ఆ తర్వాత అతను పుంజుకున్న తీరు అద్భుతం. క్వార్టర్స్‌, సెమీస్‌లో డబుల్స్‌ మ్యాచ్‌లు గెలిచి జోరుమీదున్న సాత్విక్‌- చిరాగ్‌ శెట్టి పసిడి పోరులోనూ దూకుడు కొనసాగించారు.

దేశం ఉప్పొంగిపోతోంది: ప్రధాని

థామస్‌ కప్‌ నెగ్గిన భారత జట్టుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ‘‘భారత బ్యాడ్మింటన్‌ జట్టు చరిత్ర సృష్టించింది. థామస్‌ కప్‌ను భారత్‌ గెలుచుకోవడం పట్ల యావత్‌ దేశం ఉప్పొంగిపోయింది. ఈ ఘనతను సాధించిన బృందానికి అభినందనలు. వారి భవిష్యత్‌ ప్రయత్నాలకు శుభాకాంక్షలు. ఈ విజయం ఎంతోమంది వర్ధమాన క్రీడాకారుల్లో స్ఫూర్తినింపుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ భారత షట్లర్లకు అభినందనలు తెలిపారు.

Thomas' Cup that India won
భారత బ్యాడ్మింటన్‌ ఆటగాళ్లు

రూ.కోటి నజరానా

థామస్‌ కప్‌లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.1 కోటి నజరానా ప్రకటించింది. ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు రూ.1 కోటి నగదు బహుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి: IPL 2022: రాజస్థాన్ రాజసం.. లఖ్​నవూపై విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.