WTC Final 2023 : కోహ్లీ X గిల్‌.. టాప్​ స్కోరర్​ ఎవరో?.. టీమ్​ఇండియా గెలిస్తే నయా చరిత్ర!

author img

By

Published : Jun 3, 2023, 3:27 PM IST

wtc final 2023
wtc final 2023 ()

WTC Final 2023 : డబ్ల్యూటీసీ ఫైనల్​ ప్రారంభానికి ముందే క్రికెట్​ అభిమానుల మధ్య కొత్త చర్చ మొదలైంది. ఈ మ్యాచ్​లో టాప్‌ స్కోరర్‌గా ఎవరు నిలుస్తాడోనని అంతా చర్చించుకుంటున్నారు. అయితే చాలా మంది టీమ్​ఇండియా బ్యాటర్లు శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీలో ఎవరో ఒకరు టాప్‌ స్కోరర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు, ఈ మ్యాచ్​లో భారత్​ గెలిస్తే కొత్త చరిత్ర లిఖించనుంది. అదేంటంటే?

WTC Final 2023 : భారత్‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్‌ మైదానం వేదికగా జూన్‌ 7 నుంచి 11 వరకు జరుగనున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్​లో ఏ ఆటగాడు టాప్‌ స్కోరర్‌గా నిలుస్తాడన్న డిస్కషన్‌ ఇప్పటి నుంచే మొదలైంది. ఇరు జట్ల బ్యాటింగ్‌ బలాబలాలు సమతూకంగా ఉండటం వల్ల ఎవరు అధిక పరుగులు చేస్తారని చెప్పడం కాస్త కష్టమైన పనే అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Kohli Vs Gill : కొందరు నెటిజన్లు విరాట్ కోహ్లీ, శుభమన్​ గిల్​, ఛతేశ్వర్​ పుజారా పేర్లు చెబుతుంటే.. మరికొందరు స్టీవ్​ స్మిత్​, లబూషేన్​, ట్రవిస్​ హెడ్​లో ఎవరో ఒకరు టాప్‌ స్కోరర్‌గా నిలుస్తారని అభిప్రాయపడుతున్నారు. అంచనాలు, అభిప్రాయాలు పక్కన పెట్టి, ఇరు జట్ల ఆటగాళ్ల తాజా ఫామ్‌ను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే.. టీమ్​ఇండియా బ్యాటర్లు శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీలలో ఎవరో ఒకరు టాప్‌ స్కోరర్‌గా నిలుస్తారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది!

తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో అదరగొట్టారు. వీరిద్దరు భీకర ఫామ్‌లో ఉండి పరుగులు వరద పారించారు. గిల్‌ 17 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలతో 890 పరుగులు చేయగా.. కోహ్లీ 14 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలతో 639 పరుగులు చేశాడు. వీరిద్దరు ఇదే ఫామ్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ కొనసాగిస్తే, సెంచరీల మోత మోగి పరుగుల వరదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

WTC Final Pujara : టీమ్​ఇండియాలోనే మరో ఇద్దరికి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌ పరిస్థితులకు అతికినట్లు సరిపోయే పుజారా, ఓవల్‌ మైదానంలో మంచి ట్రాక్‌ రికార్డు (గత మ్యాచ్‌లో సెంచరీ) కలిగిన రోహిత్‌ శర్మకు కూడా అధిక పరుగులు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఆసీస్‌ బ్యాటర్ల అవకాశాలను కూడా తీసి పారేయడానికి వీలు లేదు. స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబూషేన్‌, ట్రవిస్‌ హెడ్‌, డేవిడ్‌ వార్నర్‌లలో ఎవరో ఒకరు టాప్‌ స్కోరర్‌గా నిలువవచ్చు.

టీమ్​ఇండియా గెలిస్తే నయా చరిత్ర!
WTC Final Team India Record : అయితే ఈ ఫైనల్​ మ్యాచ్​లో టీమ్​ఇండియా విజయం సాధిస్తే.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంటుంది. వన్డే, టీ20, టెస్టు మూడు ఫార్మాట్లలో వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలిచిన తొలి జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. టీమ్​ఇండియా ఇప్పటి వరకు వన్డే, టీ20 వరల్డ్‌కప్‌లో ఛాంపియన్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకోగా.. అనంతరం ధోనీ సారధ్యంలో 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచింది. మరోవైపు ఆస్ట్రేలియా గెలిచినా కూడా అదే రికార్డును లిఖిస్తుంది. ఆస్ట్రేలియా కూడా ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్‌లో ఐసీసీ ట్రోఫీలను సొం‍తం చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.