ETV Bharat / sports

టీమ్​ఇండియాకు గుడ్​న్యూస్​.. శ్రేయస్​ సర్జరీ సక్సెస్​.. మెగాటోర్నీతో రీఎంట్రీ!

author img

By

Published : Apr 21, 2023, 3:51 PM IST

Updated : Apr 21, 2023, 4:23 PM IST

టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ శ్రేయస్​ అయ్యర్​ వెన్నునొప్పి ఆపరేషన్ సక్సెస్​ అయింది. దీంతో అతడు ఈ ఏడాది జరిగే మెగా టోర్నీకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Shreyas Iyer Operation Success News
శ్రేయస్​ అయ్యర్ ఆపరేషన్​ విజయవంతం తాజా వార్తలు

టీమ్​ఇండియా మిడిలార్డర్​ బ్యాటర్​​ శ్రేయస్​ అయ్యర్​ ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​. వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన శ్రేయస్​ ఆపరేషన్​ విజయవంతమైనట్లు సమాచారం.

కొద్దిరోజుల క్రితం జరిగిన బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీ 2023 టెస్ట్​ సిరీస్​లోని తొలి మ్యాచ్​కు ఆడలేకపోయిన అయ్యర్​.. ఆ తర్వాత రెండో మ్యాచ్​కు అందుబాటులోకి వచ్చాడు. కానీ, వెన్నునొప్పి మళ్లీ ఇబ్బందిపెట్టడం వల్ల మూడో టెస్ట్​ మధ్యలోనే ఆట నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్​కు దూరంగా ఉన్న అతడు​ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్​ మెగా లీగ్​కు కూడా ఆడే అవకాశం కోల్పోయాడు. వీటన్నంటికి ప్రధాన కారణం వెన్నునొప్పి బాధించడం. ఇందుకోసమే అతడు లండన్​ వెళ్లి అక్కడ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది

అయినప్పటికీ ఈ గాయం నుంచి అయ్యర్​కు కోలుకోవటానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని.. ఆ తర్వాతే అతడు పూర్తి ఫిట్​నెస్​ సాధించగలడని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కూ అయ్యర్​ దూరంగా ఉంటాడని స్పష్టంగా తెలుస్తోంది. కానీ, అక్టోబరులో భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023 టోర్నీకి మాత్రం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఐపీఎల్​లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు కెప్టెన్​గా ఉన్న అయ్యర్​.. గాయం కారణంతో అతడి స్థానంలో నితీశ్​ రాణాకు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అతడి సారథ్యంలో కేకేఆర్​ ఇప్పటివరకు 6 మ్యాచ్​లు ఆడింది. ఇందులో కేవలం 2 మ్యాచ్​లు మాత్రమే గెలిచి 4 పాయింట్లతో స్కోర్​ బోర్డులో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఏదేమైనా అయ్యర్​ లేని లోటు జట్టుకు తీరలేనిదంటూ కొందరు ఫ్యాన్స్​ అభిప్రాయపడుతున్నపటికీ.. త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్‌లోనైనా ఆడతాడన్న ధీమాతో ఉన్నారు ఫ్యాన్స్​.

బుమ్రా సర్జరీ కూడా సక్సెస్​!
ఇటీవలే టీమ్​ఇండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఫిట్‌నెస్‌ గురించి బీసీసీఐ ఓ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. కొంతకాలంగా జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఇందుకోసం బుమ్రా కూడా సర్జరీ చేయించుకున్నాడని.. అది విజయవమైందని బీసీసీఐ తెలిపింది. "వెన్ను దిగువ భాగంలో తీవ్రనొప్పితో బాధపడుతున్న జస్‌ప్రీత్‌ బుమ్రాకు న్యూజిలాండ్‌లో సర్జరీ జరిగింది. అతడు ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. వైద్యుల సూచన మేరకు బుమ్రా ఆరు వారాల పాటు రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో ఉండనున్నాడు. ఇది పూర్తయ్యాక అతడు జాతీయ క్రికెట్‌ అకాడమీలో శిక్షణను ప్రారంభిస్తాడు" అని బీసీసీఐ తెలిపింది.

Last Updated : Apr 21, 2023, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.