రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, లఖ్నవూ సూపర్ జెయింట్స్ ప్లేయర్ నవీనుల్ హక్ మధ్య ఇటీవలే జరిగిన వివాదం చర్చనీయాంశంగా మారింది. అయితే వీరిద్దరి మధ్య గొడవ జరిగి వారం రోజులు గడుస్తున్నా.. వివాదానికి మాత్రం తెర పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య వార్ నడుస్తుందా అంటే.. ఔను అనే చెప్పాలి. తాజాగా నవీనుల్ హక్ ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ మరిన్ని చర్చలకు తావిస్తోంది.
గౌతమ్ గంభీర్తో ఉన్న ఫొటోకు.. 'మీతో ఇతరులు ఎలా ప్రవర్తించాలని అనుకుంటారో మీరూ అలానే ఉండాలి. మీతో ప్రజలు ఎలా మాట్లాడాలని అనుకుంటారో మీరూ అలానే మాట్లాడాలి' అంటూ కామెంట్ జత చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు నవీనుల్. అతడు చేసిన ఈ పోస్ట్కు లఖ్నవూ మెంటార్ గంభీర్ కూడా స్పందించాడు. 'నువ్వు నీలానే ఉండు.. ఎప్పటికీ మారొద్దు' అని కామెంట్ సెక్షన్లో రాసుకొచ్చాడు. గంభీర్ కామెంట్తో అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే శనివారం బెంగళూరు, దిల్లీతో మ్యాచ్ ఓడిన అనంతరం నవీనుల్ ఈ పోస్ట్ చేయటం వివాదాస్పదమైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అసలేం జరిగిందంటే?
ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా గత సోమవారం లఖ్నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్, నవీనుల్ మధ్య.. మ్యాచ్ అనంతరం విరాట్, గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది. వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధానికి పలువురు సీనియర్లు సైతం స్పందించారు. క్రీడా స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం అని వారి అభిప్రాయాలు వెల్లడించారు. వీరి వివాదంపై ఐపీఎల్ నిర్వాహకులు విరాట్ సహా నవీనుల్, గంభీర్లకు క్రీడా నింబంధనలు ఉల్లంఘించారంటూ జరిమానా విధించింది.
బీసీసీఐకి విరాట్ లేఖ..
వీరి వివాదం కారణంగా మ్యాచ్ రిఫరీ విరాట్ కోహ్లీ, గంభీర్కు మ్యాచ్ ఫీజులో వంద శాతం, నవీనుల్కు 50 శాతం ఫైన్ విధించారు. అయితే ఈ జరిమానాను కోహ్లీ తరఫున ఆర్సీబీ యాజమాన్యం చెల్లించింది. ఈ విషయంపై విరాట్ కోహ్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీసీసీఐకు లేఖ రాశాడు. వంద శాతం జరిమానా విధించే అంత పెద్ద తప్పు తానేమీ చేయలేదంటూ వివరణ ఇచ్చాడు.