'సిరివెన్నెల లేని తెలుగు సినిమా పాటలు ఊహించడం కష్టం'

author img

By

Published : Dec 1, 2021, 2:07 PM IST

Updated : Dec 1, 2021, 6:44 PM IST

sirivennela latest news

Celebrities last respects Sirivennela: సిరివెన్నెల సీతారామ శాస్త్రికి కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రముఖులు ఫిలిం ఛాంబర్​కు తరలివచ్చారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సిరివెన్నెలను స్మరించుకున్న ప్రముఖులు

Sirivennela Seetharama Sastry death: సిరివెన్నెల సీతారామశాస్త్రి లేని తెలుగు సినిమా పాటలు ఎలా ఉంటాయో ఊహించుకోవడం కష్టమని అగ్ర కథానాయకుడు మహేశ్ బాబు అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా తెలుగు సంగీతానికి ఆయన పేరు పర్యాయపదంగా మారిపోయిందని చెప్పారు. ఫిలిం ఛాంబర్​లో సిరివెన్నెల భౌతికకాయాన్ని సందర్శించుకున్న ఆయన.. అత్యంత గొప్ప వ్యక్తిని ఇండస్ట్రీ కోల్పోయిందని పేర్కొన్నారు.

Venkatesh on Sirivennela Seetharama Sastry

సాహిత్య రంగంలో ఓ దిగ్గజాన్ని కోల్పోయామని అగ్ర కథానాయకుడు వెంకటేశ్ అన్నారు. 'నా కెరీర్​ ప్రారంభం నుంచి సిరివెన్నెలతో పనిచేశాను. 'స్వర్ణకమలం' నుంచి మొన్న వచ్చిన 'నారప్ప' వరకు ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడిని. సాహిత్య రంగంలో మనం ఓ లెజెండ్​ను కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని వెంకటేశ్ పేర్కొన్నారు.

Nagarjuna on Sirivennela

ఫిలిం ఛాంబర్​లో అభిమానుల సందర్శనార్థం ఉంచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి అగ్ర కథానాయకుడు నాగార్జున నివాళులర్పించారు. సిరివెన్నెలతో స్నేహం ఎప్పటి నుంచో ఉందని నాగార్జున పేర్కొన్నారు. ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారని గుర్తుచేసుకున్నారు.

"'తెలుసా.. మనసా' పాటను ఆయన పక్కన ఉండి రాయించుకున్నాను. నాన్నగారితో కలిసి చేసిన సినిమాలో 'ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా' పాట కూడా శాస్త్రిగారే రాశారు. స్వర్గంలో కూడా దేవుళ్లకు ఇవే పాటలు, మాటలు వినిపిస్తారని అనుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" అని నాగార్జున పేర్కొన్నారు.

Allu Aravind at Sirivennela last rites

దిగ్గజ దర్శకుడు విశ్వనాథ్​తో పనిచేయడం, సిరివెన్నెలతో పాటలు రాయించుకోవడం తన అదృష్టమని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయేందుకు వారితో పనిచేస్తే చాలని అన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వేటూరి సుందర రామమూర్తిది ఒకే కోవకు చెందినవారని చెప్పారు. సిరివెన్నెల మృతితో వీరి శకం ముగిసిపోయిందని అన్నారు.

Allu Arjun Sirivennela news

సిరివెన్నెల పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్ పేర్కొన్నారు. సిరివెన్నెల భౌతికకాయానికి నివాళి అర్పించిన అల్లు అర్జున్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. "శాస్త్రిగారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నా కుటుంబసభ్యుల తర్వాత కాళ్లకు నమస్కారం చేసే అతి తక్కువమంది వ్యక్తుల్లో సీతారామశాస్త్రి ఒకరు. ఆయన పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి" అని అల్లు అర్జున్ అన్నారు.

సిరివెన్నెల పార్థివదేహానికి నివాళులు అర్పిస్తూ.. భావోద్వేగానికి లోనయ్యారు నటుడు, రచయిత తనికెళ్ల భరణి. భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనను త్రివిక్రమ్ ఓదార్చారు. తనికెళ్లతో పాటే దర్శకులు విజయ్ భాస్కర్, మారుతి, నటుడు రావు రమేశ్, సంగీత దర్శకుడు మణిశర్మ.. సిరివెన్నెలకు నివాళులర్పించారు.

ఇదీ చదవండి:

Last Updated :Dec 1, 2021, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.