పేదింటి మహిళకు భారమైన గ్యాస్‌ బండ

author img

By

Published : Sep 25, 2021, 8:00 AM IST

gas cylinder

ఏడాది కాలంలోనే గ్యాస్​ సిలిండర్‌ ధర 50శాతం మేర పెరగడం వల్ల పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు వంటింటి బడ్జెట్‌ తల్లకిందులవుతోంది. ఇప్పటివరకు ఉజ్జ్వల యోజన కింద 8.12 కోట్ల కనెక్షన్లను పేదలకు నామమాత్ర ధరకే కేంద్రం అందించింది. దీంతో 2016 నాటికి దేశంలో 62శాతంగా ఉన్న ఎల్‌పీజీ కనెక్షన్లు ఇప్పుడు 99.8శాతానికి చేరాయని కేంద్రం ప్రకటించింది. ఈ ఎనిమిది కోట్ల మంది వినియోగదారులు పూర్తిగా నిరుపేదలే. గ్యాస్‌ ధర పెరిగిందని మళ్లీ వారు కట్టెల పొయ్యి వైపు మళ్లితే ఉజ్జ్వల పథకం స్ఫూర్తి దెబ్బతిన్నట్లే.

గ్యాస్‌ సిలిండర్‌ వంటింట్లో మంటలు పుట్టిస్తోంది. కళ్లెం లేకుండా పరిగెడుతున్న గ్యాస్‌ ధర వినియోగదారుణ్ని ఠారెత్తిస్తోంది. ఏడాది కాలంలోనే సిలిండర్‌ ధర 50శాతం మేర పెరగడంతో పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు వంటింటి బడ్జెట్‌ తల్లకిందులవుతోంది. 'డైనమిక్‌ ప్రైసింగ్‌' పేరిట ఎప్పటికప్పుడు ధరలో హెచ్చు తగ్గులుంటాయని ప్రభుత్వం ప్రకటించినా, గత అయిదేళ్లలో భారీగా ధర పెంచిన ప్రభుత్వం- తగ్గించిన సందర్భాలు చాలా తక్కువ. మరోవైపు వినియోగదారుడికిచ్చే రాయితీకి క్రమంగా మంగళం పాడుతోంది. ఫలితంగా గ్యాస్‌ సిలిండర్‌ పూర్తి భారాన్ని వినియోగదారుడే మోయాల్సి వస్తోంది. పేదింటి గృహిణులపై ఈ ధరల పెరుగుదల మరింత భారమవుతోంది.

స్ఫూర్తి దెబ్బతిన్నట్లే..

వంట చెరకు, బొగ్గు, పిడకలు వంటివి వాడటం ద్వారా వచ్చే పొగ గ్రామీణ మహిళల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. దాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 2016 మే నెలలో ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజనను ప్రారంభించింది. 2020లోగా ఈ పథకం కింద గ్రామీణ పేద కుటుంబాలకు ఎనిమిది కోట్ల వంట గ్యాస్‌ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఆ లక్ష్యం పూర్తి కావడంతో 2021-22 బడ్జెట్‌లో మరో కోటి కనెక్షన్లను వలస కుటుంబాల కోసం ప్రత్యేకంగా కేటాయించింది. ఇప్పటివరకు ఉజ్జ్వల యోజన కింద 8.12 కోట్ల కనెక్షన్లను పేదలకు నామమాత్ర ధరకే అందించింది. దీంతో 2016 నాటికి దేశంలో 62శాతంగా ఉన్న ఎల్‌పీజీ కనెక్షన్లు ఇప్పుడు 99.8శాతానికి చేరాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఎనిమిది కోట్ల మంది వినియోగదారులు పూర్తిగా నిరుపేదలే. గ్యాస్‌ ధర పెరిగిందని మళ్ళీ వారు కట్టెల పొయ్యి వైపు మళ్ళితే ఉజ్జ్వల పథకం స్ఫూర్తి దెబ్బతిన్నట్లే. ధరల పెంపుతో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన భారమే ఏడాదికి రూ.4,016 కోట్లు. ఇక దేశంలో ఉజ్జ్వల పథకం కింద గ్యాస్‌ కనెక్షన్‌ పొందిన వినియోగదారుల్లో 22శాతం, తరవాత ఒక్కసారి కూడా మళ్ళీ సిలిండర్‌ బుక్‌ చేసుకోలేదని ఎల్పీజీ గ్యాస్‌ పంపిణీదారుల సమాఖ్య గత సంవత్సరం ప్రకటించింది. రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 85శాతానికి పైగా ఉజ్జ్వల గ్యాస్‌ కనెక్షన్‌ లబ్ధిదారులు ఇప్పటికీ కట్టెల పొయ్యినే వాడుతున్నారని ఓ అధ్యయనం తేల్చింది. ప్రధాని మోదీ చేతులమీదుగా ఉజ్జ్వల పథకంలో ఎనిమిది కోట్లవ లబ్ధిదారుగా 2019లో గ్యాస్‌ కనెక్షన్‌ అందుకున్న మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఆయేషా షేక్‌ కూడా సిలిండర్‌ ధరను భరించలేక మళ్ళీ కట్టెల పొయ్యినే వాడుతున్నారని పీటీఐ కథనం పేర్కొంది.

వినియోగదారుల్లో అసహనం..

వంటగ్యాస్‌కు నగదు బదిలీ 2015 జనవరి నుంచి మొదలైంది. జూన్‌ నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది. గ్యాస్‌ ధరను పూర్తిగా వినియోగదారుడే చెల్లిస్తే- రాయితీ మొత్తాన్ని వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేసే ఈ విధానం ఆది నుంచీ విమర్శలనే ఎదుర్కొంది. సిలిండర్‌ తీసుకున్న నెలల తరవాతా రాయితీ సొమ్ము జమ కాకపోవడంతో వినియోగదారుల్లో అసహనం పెరిగింది. ఈ ప్రక్రియ కాస్త గాడిన పడేసరికి రాయితీలను ప్రభుత్వం నామమాత్రంగా మార్చేసింది. ప్రస్తుతం నగదు బదిలీ రూ.15-20కి మించకపోవడంతో చాలా ప్రాంతాల్లో సిలిండర్‌ ధర 900 దాటుతోంది. అనధికారిక డెలివరీ రుసుములు కూడా కలిపితే కొన్ని దూర ప్రాంతాల్లో సిలిండర్‌ ధర వెయ్యికి చేరువైంది. ఎల్‌పీజీకి రాయితీ నిమిత్తం 2019-20 కేంద్ర బడ్జెట్‌లో మొత్తం రూ.34,085 కోట్లు కేటాయించగా, రూ.22,726 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ తరవాత ఏడాది నుంచి నగదు బదిలీ కింద ఇచ్చే రాయితీని నామమాత్రంగా మార్చేశారు.

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో..

2020-21 బడ్జెట్లో ఎల్‌పీజీ రాయితీకి రూ.36,072 కోట్లు కేటాయించినా అందులో కనీసం నాలుగో వంతు కూడా ఖర్చు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రాయితీకి కేటాయింపులను దాదాపు 60శాతం కుదించి రూ.14,073 కోట్లకే పరిమితం చేశారు. శుద్ధ ఇంధనాన్ని వినియోగించి పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం వంట గ్యాస్‌ వినియోగాన్ని ప్రోత్సహించింది. సిలిండర్‌ ధర వెయ్యి రూపాయలకు చేరువైన నేపథ్యంలో దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారితోపాటు దిగువ మధ్యతరగతి కుటుంబాలకూ గ్యాస్‌ బండ గుదిబండగా మారింది. నిత్యం పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలతోపాటు వాటిపై కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్‌ డ్యూటీ సైతం భారీగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం కేంద్రానికి దీని ద్వారా వచ్చే ఆదాయం రూ.3.3 లక్షల కోట్లు. ఇందులో కనీసం పదో వంతు వెచ్చించినా పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు గ్యాస్‌పై రాయితీ ఇచ్చి ఊరట కలిగించవచ్చు. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే గ్యాస్‌ ధర పెంపు వారిపై పెనుభారం కాకుండా చూడవచ్చు.

- శిశిర

ఇదీ చూడండి: భార్యాభర్తలు బీమా పాలసీ వేర్వేరుగా తీసుకోవడం మంచిదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.