ETV Bharat / international

జోరుగా ఆయుధాల కొనుగోళ్లు- అమెరికాకు లాభాల పంట

author img

By

Published : Oct 16, 2022, 8:41 AM IST

ఒకవైపు ద్రవ్యోల్బణం, మాంద్యం అంటూ ప్రజలు బిక్కుబిక్కుమంటుంటే.. నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు ఆయుధ వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఊపందుకుంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో ఆయుధాల అమ్మకాలకు రెక్కలొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయుధ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. యుద్ధంలో ఉక్రెయిన్‌ను సమర్థిస్తున్న అమెరికా అమ్మకాల్లో ముందంజలో ఉంది. కొనుగోళ్లలో ఐరోపా అందరికంటే ముందు పరుగెడుతోంది.

biggest weapon buyers in the world
జోరుగా ఆయుధాల కొనుగోళ్లు- అమెరికాకు లాభాల పంట

ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత చాలాకాలం పాటు నిశ్చింతగా ఉన్న ఐరోపా దేశాలు.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో తాజాగా రక్షణ విధానాలను పునఃపరిశీలించుకుంటున్నాయి. తమ రక్షణ బడ్జెట్‌లను పెంచుతున్నాయి. ఒకవైపు మాంద్యం అంటూ ప్రజలను భయపెడుతూనే ఆయుధాల కోసం ఇవన్నీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటం గమనార్హం.

రష్యా భయంతో..
ప్రపంచ ఆయుధ వ్యాపారంపై ఓ కన్నేసి ఉంచే స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) నివేదిక ప్రకారం.. దక్షిణ అమెరికా, ఆఫ్రికాల కొనుగోళ్లు తగ్గగా.. ఐరోపా, తూర్పు ఆసియా, ఓషియానియా, పశ్చిమ ఆసియా దేశాల్లో ఆయుధ కొనుగోళ్లు పెరిగాయి. ముఖ్యంగా.. ఐరోపా దేశాల ఆయుధ దిగుమతి గతంలోకంటే 19శాతం పెరిగింది. ఐరోపాలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌, నార్వే, నెదర్లాండ్‌లు ఎక్కువ కొనుగోళ్లు చేయటం గమనార్హం. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత ఐరోపాలోని అన్ని దేశాలూ ఈ కొనుగోళ్లను పెంచాయి. తాజాగా 110 బిలియన్‌ డాలర్లను ఆయుధాలకోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్న జర్మనీ.. అమెరికా నుంచి అణ్వస్త్రాలను మోసుకుపోగల ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లను తెప్పించుకుంటోంది. పోలండ్‌ అధునాతన డ్రోన్స్‌ను అమెరికా నుంచి కొనుగోలు చేయబోతోంది. అనేక ఐరోపా దేశాలు డ్రోన్లు, మిసైళ్ల కోసం అమెరికాకు ఆర్డర్లు పెడుతున్నాయి. రష్యాతో యుద్ధం కారణంగా ఐరోపా దేశాలు ఆయుధాలకు ఆర్డర్లు ఇస్తుండగా.. చైనా దుందుడుకుతనం వల్ల ఆసియా, ఓషియానియాల్లో ఆయుధ వ్యాపారం ఊపందుకుంది.

భారత్‌ ఎక్కువే..
ఆసియాలో అత్యధిక ఆయుధాలను కొనుగోలు చేస్తున్న దేశం భారతే! 2012-16తో పోలిస్తే ప్రస్తుతం భారత ఆయుధాల దిగుమతి 21 శాతం తగ్గింది. అయినా ఇప్పటికీ ఈ ప్రాంతంలో అందరికంటే ఎక్కువ కొనుగోలు చేస్తున్నది భారతేనని సిప్రి వెల్లడించింది. పశ్చిమాసియా (మిడిల్‌ ఈస్ట్‌)లో ఆయుధాల కొనుగోళ్లు 2007-11తో పోలిస్తే ఇప్పుడు 86శాతం పెరిగాయి. ఈజిప్టు ఆయుధ దిగుమతులు 73శాతం పెరిగాయి.

పంట పండిన అమెరికా
ప్రపంచంలో వివిధ ఘర్షణలతో అమెరికా ఆయుధ బేహారుల పంట పండుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా (39%) దేశాలు అమెరికా నుంచే ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి. 2017-21 మధ్య అమెరికా ఆయుధ ఎగుమతులు తన పోటీదారులతో పోలిస్తే 108శాతం పెరిగాయి. ఇందులో 43శాతం పశ్చిమాసియా దేశాలకే చేరాయి. అమెరికా తర్వాత అధికంగా ఆయుధాలు అమ్మే రష్యా (19%) కాసింత ఈ వ్యాపారంలో మందగించింది. కారణం సొంత అవసరాలే పెరిగిపోవటం. మూడో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు ఫ్రాన్స్‌ అమ్మకాలు 59శాతం పెరిగాయి. డ్రోన్‌ల అమ్మకాల్లో తుర్కియే (టర్కీ) ముందంజలో ఉంది. తాజాగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలోనూ తుర్కియే డ్రోన్లకు గిరాకీ ఎక్కువగా కనిపిస్తోంది.

ఫాస్ట్‌ ట్రాక్‌ టైగర్‌ టీమ్‌...
ఉక్రెయిన్‌ యుద్ధం ఆరంభమయ్యాక తన మిత్ర దేశాలకు ఆయుధాల అమ్మకాల్లో అమెరికా వేగం పెంచింది. చైనాలాంటి ఇతర దేశాల నుంచి పోటీని దృష్టిలో ఉంచుకొని.. ఫాస్ట్‌ట్రాక్‌లో ఆయుధాల సరఫరాకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దీనికి టైగర్‌ టీమ్‌ అని పేరు పెట్టారు. అమెరికా డ్రోన్లు, ఆయుధాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు, ఇతర మిలిటరీ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ల అమ్మకాలను వేగవంతం చేయటం ఈ టైగర్‌టీమ్‌ బాధ్యత. అమెరికా మిత్రదేశాలన్నీ ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేస్తుండటంతో పాటు.. తమ అవసరాలకూ కొనుగోళ్లను పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఆయుధ వ్యాపారం మరింత ఊపందుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.