ETV Bharat / international

ఉక్రెయిన్‌లో సమాధులను తవ్వుతున్న ప్రజలు, అసలేమైంది

author img

By

Published : Aug 15, 2022, 7:08 AM IST

Ukraine Crisis Ukraine Crisis ఉక్రెయిన్​లోని లుహాన్స్క్​ ప్రాంత ప్రజలు సమాధులు తవ్వుతున్నారు. తమ కుటుంబీకుల మృతదేహాలను వెలికితీసి గౌరవప్రదంగా మరోసారి అంతిమ సంస్కారాలు జరుపుతున్నారు.

Ukraine Crisis
Ukraine Crisis

Ukraine Crisis: ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం తీవ్ర దశలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఎప్పుడు ఎక్కడినుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆ భయానక పరిస్థితుల్లో.. అనేక మంది తమవారికి సక్రమంగా తుది వీడ్కోలు పలకలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుపడటం వల్ల లుహాన్స్క్‌ రీజియన్‌లోని రూబిజ్నే పట్టణ ప్రజలు.. యుద్ధం తారస్థాయిలో ఉన్నప్పుడు హడావుడిగా ఖననం చేయించిన మృతదేహాలను వెలికితీస్తున్నారు. వాటికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 50 వేల జనాభా ఉన్న ఈ పట్టణం ప్రస్తుతం రష్యా మద్దతుకలిగిన లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్(ఎల్‌పీఆర్‌) ఆధీనంలో ఉంది.

యుద్ధ సమయంలో ధ్వంసమైన ఓ అపార్ట్‌మెంట్ బ్లాక్ వెలుపల ఇటీవల ఓ కందకాన్ని తిరిగి తవ్వారు. అందులోనుంచి ఆరు మృతదేహాలను వెలికితీశారు. ఈ క్రమంలోనే లిలియా అనే స్థానికురాలు.. తన తల్లి మృతదేహానికి చుట్టిన దుప్పటి ఆధారంగా ఆమెను గుర్తుపట్టారు. దాడుల సమయంలో 10 రోజులపాటు తన తల్లిదండ్రుల అపార్ట్‌మెంట్‌కు చేరుకోలేకపోయానని ఆమె వాపోయారు. 'మా అమ్మ అప్పటికే మరణానికి చేరువైంది. ఆమె చేతులు నీలి రంగులోకి మారాయి. ముఖం వాడిపోయింది. మరుసటి రోజే ఆమె మరణించింది. అయితే.. ఎడతెగని దాడులతో అంత్యక్రియలు సరిగ్గా నిర్వహించలేని దుస్థితి. అమానవీయ పరిస్థితుల్లోనే ఆమె మృతదేహాన్ని బహిరంగ కందకంలో ఖననం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చుతాం' అని వివరించారు.

తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా మద్దతుగల లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్(ఎల్‌పీఆర్‌).. ప్రస్తుతం మృతదేహాల వెలికితీత ప్రక్రియను సమన్వయం చేస్తోంది. ఎల్‌పీఆర్ అధికారి అన్నా సోరోకినా మాట్లాడుతూ.. ఇటీవల ఒక బృందం రూబిజ్నేలో 10 రోజుల వ్యవధిలో 104 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. ఇలా నగరంలో దాదాపు 500 వరకు సామూహిక సమాధులు ఉన్నట్లు అంచనా వేశారు. ఇప్పటివరకు బయటపడిన మృతదేహాలకు చాలావరకు క్షిపణి, బాంబు దాడుల గాయాలున్నాయని, కొన్నింటికి బుల్లెట్ గాయాలు కూడా ఉన్నాయన్నారు. గుర్తుతెలియని మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ నమూనాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి: బ్రిటన్​ ప్రధాని పదవి రేసులో లిజ్​ ట్రస్ ముందంజ, రిషికి కష్టమేనా

చైనాకు మరో షాక్, తైవాన్​కు అమెరికా చట్టసభ్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.