పుంజుకున్న రిషి.. ట్రస్​కు గట్టి పోటీ.. తాజా సర్వే ఫలితం ఇదే!

author img

By

Published : Aug 3, 2022, 7:14 AM IST

rishi sunak

బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ల మధ్య నడుస్తున్న పోరు రసవత్తరంగా మారింది. రేసులో భారత సంతతి నేత రిషి పుంజుకున్నారు. గత వారం ఇటలీకి చెందిన ప్రజా వ్యవహారాల కంపెనీ టెక్నీ నిర్వహించిన పోల్‌లో ఇద్దరు నేతల మధ్య కేవలం 5 శాతం మాత్రమే తేడా ఉంది. ఇది సునాక్‌కు ఊరటనిచ్చే అంశమే.

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నేత, మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్‌ రేసులో పుంజుకున్నారు. కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులకు గతవారం నిర్వహించిన పోల్‌లో తన ప్రత్యర్థి, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌తో ఉన్న అంతరాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగారు. ప్రస్తుతం ఇద్దరు నేతల మధ్య 5 శాతం మాత్రమే తేడా ఉంది.

ఇటలీకి చెందిన ప్రజా వ్యవహారాల కంపెనీ టెక్నీ.. గతవారం 807 మంది కన్జర్వేటివ్‌ సభ్యులను సర్వే చేసింది. అందులో రిషి సునాక్‌కు 43% మంది, లిజ్‌ ట్రస్‌కు 48% మంది మద్దతు పలికారు. 9% మంది మాత్రం ఏ విషయాన్నీ వెల్లడించలేదు. మరోవైపు, గతవారం బ్రిటిష్‌ అంతర్జాతీయ మార్కెట్‌ పరిశోధన సంస్థ 'యూగవ్‌' నిర్వహించిన సర్వేలో లిజ్‌ ట్రస్‌కు 62% మంది నుంచి మద్దతు లభించగా, రిషికి 38% మంది మద్దతిచ్చారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం 24% కనిపించింది. ఇప్పుడు అది అయిదుకు తగ్గడం సునాక్‌కు ఊరటనిచ్చే అంశమే.

Rishi Sunak PM Race: అంతకుముందు, బ్రిటన్ నూతన​ ప్రధానిగా సునాక్‌ కంటే లిజ్‌ ట్రస్‌కు అవకాశాలు గణనీయంగా ఉన్నట్లు స్థానిక బెట్టింగ్ ఎక్స్ఛేంజ్‌ సంస్థ స్మార్కెట్స్‌ అంచనా వేసింది. "ప్రధాని రేసులో ఫైనల్‌గా వీరిద్దరూ(సునాక్, ట్రస్) మిగిలినప్పుడు ట్రస్‌కు విజయావకాశాలు 60-40గా ఉన్నాయి. అయితే ఆ తర్వాత పరిణామాలు ఆమెకు అనుకూలంగా మారుతూ వచ్చాయి. పోటీ మొదలైనప్పటి నుంచి రిషి సునాక్‌ గెలుస్తారని చాలా మంది అంచనా వేశారు. అయితే డిబేట్లలో ట్రస్‌ ప్రసంగాలు ఈ అంచనాలను అధిగమించాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ట్రస్‌కు 90శాతం విజయావకాశాలు ఉండగా.. సునాక్‌ గెలుపు అవకాశాలు 10శాతానికి తగ్గాయి" అని స్మార్కెట్స్‌ పొలిటికల్‌ మార్కెట్స్‌ హెడ్‌ మాథ్యూ షాడిక్‌ తెలిపారు.

అనేక రౌండ్ల అనంతరం.. పలు వివాదాల్లో కూరుకుపోయిన బోరిస్‌ జాన్సన్‌ ఈ నెల 7వ తేదీని ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ప్రక్రియ చేపట్టింది. పార్టీ అధ్యక్ష పదవికి, తద్వారా ప్రధాని పదవికి ఎన్నిక మొదలవ్వగా.. ఇందుకోసం తొలుత 11 మంది పోటీ పడ్డారు. అనేక రౌండ్ల అనంతరం తుది రేసులో మాజీ ఆర్థిక మంత్రి సునాక్‌, మాజీ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ నిలిచారు.

సెప్టెంబరు 5న ఫలితాలు.. కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలతోపాటు సభ్యుల మద్దతునూ చూరగొన్నవారే పార్టీ అధ్యక్షులుగా, ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. ఈ క్రమంలోనే టోరీ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు వీరిద్దరు ఆరువారాల దేశ పర్యటన ప్రారంభించారు. ఇప్పటికే పలు నగరాల్లో సునాక్‌, ట్రస్‌లు టోరీ ఓటర్లతో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసిన బ్యాలెట్లను సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 5న ఫలితాలు వెలువడుతాయి.

ప్రస్తుతం అర్హులైన కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల సంఖ్య దాదాపు 1,75,000గా ఉంది. పార్టీలో ఎంపీల మద్దతు సునాక్‌కు ఉన్నప్పటికీ.. సభ్యుల్లో ఎక్కువ మంది లిజ్‌ ట్రస్‌వైపు మొగ్గుచూపుతున్నట్లు పలు అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ, ఈ పోటీలో రిషీ సునాక్‌ విజయం సాధిస్తే యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధిస్తారు.

ఇవీ చదవండి: చైనా హెచ్చరించినా తైవాన్​లో అడుగుపెట్టిన పెలోసీ.. క్షణక్షణం ఉత్కంఠ

'అక్రమంగా విదేశీ నిధులు'.. రాజకీయాల్లో ఇమ్రాన్ ఖాన్​​పై బ్యాన్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.