ETV Bharat / international

100 రోజుల యుద్ధం.. వేల మంది బలి- అంతా విధ్వంసం.. ఆపేదే లేదన్న పుతిన్

author img

By

Published : Jun 4, 2022, 6:55 AM IST

Russia Ukraine War 100 days: ఉక్రెయిన్​పై రష్యా దండయాత్రకు వంద రోజులు పూర్తయింది. ఈ వంద రోజుల్లో వినాశనం చోటుచేసుకుంది. వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలసపోయారు. మరోవైపు, ఈ యుద్ధం ఆపేది లేదంటూ రష్యా అధినేత పుతిన్ స్పష్టం చేశారు.

UKRAINE-WAR-100 DAYS
UKRAINE-WAR-100 DAYS

Russia Ukraine War 100 days: పశ్చిమ దేశాల పంచన చేరుతోందని ఆరోపిస్తూ ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్రకు వంద రోజులు పూర్తయింది. ఫిబ్రవరి 24న మొదలైన ఈ వినాశకర పోరుకు ముగింపు కనుచూపు మేరలో కనపడటంలేదు. రక్తపాతం, విధ్వంసం అక్కడ సర్వసాధారణ మైపోయాయి. ఈ వార్తలు ప్రపంచానికి నిత్యకృత్యమయ్యాయి. పిడుగుల్లా పడుతున్న బాంబులు.. కుప్పకూలుతున్న భవనాలు.. వీధుల్లో చెల్లాచెదురుగా శవాలు.. సర్వం కోల్పోయి ప్రాణాలు అరచేతపట్టుకుని వలసపోతున్న కుటుంబాలు.. ఇదీ మూడు నెలలుగా ఉక్రెయిన్‌లో నెలకొన్న దుస్థితి. బుచా నగరంలో పెద్ద సంఖ్యలో వెలుగు చూసిన పౌరుల మృతదేహాలు.. మేరియుపొల్‌లో పేలిపోయిన థియేటర్‌.. రష్యా క్షిపణి దాడితో ధ్వంసమైన క్రామటోర్స్క్‌ రైల్వే స్టేషన్‌.. వంటి విధ్వంసక చిత్రాలు మానవాళి మస్తిష్కం నుంచి ఇప్పుడప్పుడే తొలగిపోవు.

UKRAINE-WAR-100 DAYS
.

ఈ వంద రోజుల్లో ఎంతటి వినాశనం చోటుచేసుకుందంటే..
శవాల కుప్పలు..

  • యుద్ధంలో జరిగిన ప్రాణనష్టంపై నిర్దిష్ట అధికారిక సమాచారం లేదు. అయితే తమ దేశ పౌరులు వేల మంది మరణించినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రోజుకు 60 నుంచి 100 మంది ఉక్రెయిన్‌ సైనికులు అమరులవుతున్నారని చెప్పారు.
  • ఒక్క మేరియుపొల్‌లోనే 21వేల మందికి పైగా పౌరులు మృతిచెందినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. రష్యా ప్రధానంగా దృష్టిసారించిన లుహాన్స్క్‌ ప్రాంతంలోని సీవీరోదొనెట్స్క్‌ వద్ద 1500 మంది బలయ్యారని ఆ నగర మేయర్‌ చెప్పారు.
    UKRAINE-WAR-100 DAYS
    .

రష్యా చెప్పకున్నా..
Russia Ukraine War casualties: తన సైనికులు ఎంతమంది మరణించారన్నదానిపై రష్యా చివరిసారిగా మార్చి 25న ప్రకటన చేసింది. 1,351 మంది చనిపోయారని, 3,825 మంది గాయపడ్డారని నాడు తెలిపింది. ఆ తర్వాత పెదవి విప్పలేదు. అయితే 30వేల మందికి పైగా రష్యా సైనికులు మరణించి ఉంటారని ఉక్రెయిన్‌, పశ్చిమ దేశాల పరిశీలకులు చెబుతున్నారు. ఇది 10 ఏళ్ల పాటు అఫ్గానిస్థాన్‌లో జరిపిన యుద్ధంలో సోవియట్‌ యూనియన్‌ కోల్పోయిన మిలటరీ సిబ్బంది సంఖ్య కన్నా అధికం. తాజా పోరులో 40వేల మంది రష్యన్‌ సైనికులు గాయపడి ఉంటారని అంచనా.
తూర్పు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌ ప్రాంతంలో రష్యా మద్దతున్న వేర్పాటువాదులు 1300 మంది చనిపోగా 7,500 మంది గాయపడ్డారు. లుహాన్స్క్‌ ప్రాంతంలో 477 మంది వేర్పాటువాదులు, 29 మంది పౌరులు చనిపోయారు.

UKRAINE-WAR-100 DAYS
సామూహిక సమాధులు

ప్రాణాలు అరచేత పట్టుకొని వలస..
యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 68లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడి ఇతర దేశాలకు వలస వెళ్లినట్లు ఐరాస శరణార్థుల సంస్థ అంచనా వేసింది. 71 లక్షల మంది స్వస్థలాలు వీడి.. దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు అంచనా.

UKRAINE-WAR-100 DAYS
.

20 శాతం ఆక్రమణ..
యుద్ధానికి ముందు ఉక్రెయిన్‌లోని 7శాతం భూభాగంపై రష్యా నియంత్రణ ఉండేది. ఇందులో క్రిమియాతో పాటు దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలున్నాయి. తాజాగా 20శాతం భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుందని స్వయంగా జెలెన్‌స్కీనే ప్రకటించారు. అంటే.. అదనంగా 58వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం పుతిన్‌ సేన అధీనంలోకి వెళ్లిపోయిందన్నమాట.

UKRAINE-WAR-100 DAYS
ధ్వంసమైన రష్యా ట్యాంకులు

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు..

  • ఈ యుద్ధంవల్ల ఆహారం, ఇంధన ధరలు పెరగడంతో వర్ధమాన దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆఫ్రికా దేశాలకు గోధుమ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రస్తుత సంక్షోభంతో ఆహార ధాన్యాలకు రెక్కలు వచ్చాయి.
  • మొత్తంమీద ఉక్రెయిన్‌ నుంచి సరఫరా కావాల్సిన ఆహార ధాన్యాలు, ఎరువులకు కొరత ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిపై ప్రభావం పడినట్లు అంచనా.
    UKRAINE-WAR-100 DAYS
    .

పేకమేడల్లా కూలిన భవనాలు

  • శతఘ్నులు, వైమానిక దాడులతో రష్యా సేనలు జరిపిన బాంబు దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు, పట్టణాల్లో సింహభాగం కాంక్రీటు శకలాల దిబ్బల్లా మారిపోయాయి.
  • రష్యా దాడుల వల్ల దాదాపు 38వేల నివాస భవనాలు నేలమట్టమైనట్లు ఉక్రెయిన్‌ పార్లమెంటరీ కమిషన్‌ వెల్లడించింది. దీనివల్ల 2.20లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
  • 1900 విద్యా సంస్థలు ధ్వంసమయ్యాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకూ ఉన్నాయి. 50 రైలు వంతెనలు, 500 కర్మాగారాలు, 500 ఆసుపత్రులు నాశనమయ్యాయి.
  • ఉక్రెయిన్‌లోని ఆసుపత్రులు, అంబులెన్సులు, వైద్య సిబ్బందిపై 296 దాడులు జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
    UKRAINE-WAR-100 DAYS
    .

ఆర్థికంగానూ దెబ్బ

  • యుద్ధం వల్ల ఉక్రెయిన్‌తోపాటు రష్యా కూడా ఆర్థికంగా దెబ్బతింది. ఇప్పుడప్పుడే కోలుకోలేనంతగా ఇరు దేశాలు నష్టపోయాయి.
  • రష్యాను గుళ్లబార్చేందుకు పశ్చిమ దేశాలు భారీగా ఆంక్షలు విధించాయి. కీలకమైన చమురు, గ్యాస్‌ రంగాలనూ లక్ష్యంగా చేసుకున్నాయి. దీంతో ఇంధన అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని ఐరోపా దేశాలు తగ్గించుకుంటున్నాయి.
  • మొత్తంమీద రష్యాపై 5వేల ఆంక్షలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఏ దేశం ఇన్ని చర్యలను ఎదుర్కోవడంలేదు.
  • దాదాపు 300 బిలియన్‌ డాలర్ల రష్యా బంగారం, విదేశీ మారక నిల్వలను పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి.
  • రష్యాలో 1000కి పైగా కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేయడం లేదా తగ్గించడం చేశాయి.
  • ఈ ఏడాది ఆరంభంతో పోలిస్తే.. రష్యా స్టాక్‌ ఇండెక్స్‌ 40 శాతం పతనమైంది. ఏప్రిల్‌ నాటికే దేశంలో ద్రవ్యోల్బణం 17.8 శాతానికి చేరింది.

ఉక్రెయిన్‌కు కోలుకోలేని నష్టం..

  • యుద్ధంతో ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఆ దేశ జీడీపీలో 35 శాతం తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం నష్టం 600 బిలియన్‌ డాలర్ల పైనే ఉంటుందని అంచనా.
  • ఉక్రెయిన్‌ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. ఇప్పుడు ఆ దేశ కీలక రేవులన్నీ రష్యా ముట్టడిలో ఉన్నాయి. దీంతో 22 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలను ఉక్రెయిన్‌ ఎగుమతి చేసుకోలేకపోతోంది.

యుద్ధం ఆపేది లేదు: పుతిన్
ఉక్రెయిన్‌పై చేపట్టిన ప్రత్యేక సైనిక చర్య.. వందో రోజుకు చేరుకున్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. యుద్ధం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ నెరవేరిన తర్వాతే పోరు ఆగుతుందని స్పష్టం చేసింది. "డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాల ప్రజలను రక్షించడం మా ప్రధాన లక్ష్యం, ఇప్పటికే వారి రక్షణకు అన్ని చర్యలూ తీసుకున్నాం. కొన్ని ఫలితాలను సాధించాం. నాజీ అనుకూల ఉక్రెయిన్‌ దళాల నుంచి చాలా ప్రాంతాలను విముక్తి చేశాం. ఏ లక్ష్యాలతో సైనిక చర్య ప్రారంభించామో.. అవి సాధించేవరకు పోరు కొనసాగుతుంది" అని శుక్రవారం క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ తెలిపారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పోరు ప్రారంభించిన రష్యా.. ఇప్పటివరకు 20 శాతం భూభాగం ఆక్రమించింది. ముఖ్యంగా డాన్‌బాస్‌ ప్రాంతంపై నియంత్రణ సాధించింది. నల్లసముద్రం వెంబడి కీలక నౌకాశ్రయాలనూ స్వాధీనం చేసుకుంది.

విజయం మాదే: జెలెన్​స్కీ
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం అంతిమంగా విజయం తమదేనని ప్రకటించారు. "మా సైనిక దళాలు ఇక్కడే ఉన్నాయి. ప్రజలూ ఇక్కడే ఉన్నారు. వంద రోజులుగా మేం ఉక్రెయిన్‌ను రక్షించుకుంటున్నాం. అంతిమంగా విజయం మాదే" అని పేర్కొన్నారు. మరోవైపు రష్యాపై వరుస ఆంక్షలు విధిస్తున్న ఐరోపా యూనియన్‌(ఈయూ) శుక్రవారం కూడా కొరడా ఝుళిపించింది. పుతిన్‌ ప్రియురాలు, జిమ్నాస్ట్‌ అలీనా కబేవా ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆమె వీసానూ రద్దు చేసింది. పాశ్చాత్య దేశాలకు చెందిన ప్రముఖ సంస్థలు రష్యాను వీడుతుండటంతో మాస్కో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో వాణిజ్య సముదాయాలు సగానికిపైగా ఖాళీ అయ్యాయి. ప్రముఖ హోటల్‌ గ్రూప్‌ మేరియట్‌ ఇంటర్నేషనల్‌ కూడా రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

విజేతల్లేని యుద్ధమిది: ఐరాస
ఉక్రెయిన్‌, రష్యా పోరు వందో రోజుకు చేరుకున్న వేళ.. యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. "ఎక్కడ చూసినా విధ్వంసమే. గ్రామాలు, పట్టణాలు నాశనమయ్యాయి. ఈ యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరు. తక్షణమే ఈ పోరును ఆపాలి" అని ఒక ప్రకటన విడుదల చేసింది.

'మీ యుద్ధం మా చావుకొచ్చింది'
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు.. ఉక్రెయిన్‌, రష్యా మధ్య పోరు ఆఫ్రికాకు ఆహార సంక్షోభం తెచ్చింది. యుద్ధం కారణంగా.. ఇంధన, ఎరువుల కొరతను కూడా ఆ దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆఫ్రికా యూనియన్‌(ఏయూ) నేతలు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిశారు. తమ బాధలు చెప్పుకున్నారు. "మీ యుద్ధానికి మేం దూరంగానే ఉన్నాం. అయినా ఆర్థికంగా బాధితులమయ్యాం" అని పుతిన్‌కు సెనెగల్‌ అధ్యక్షుడు.. ఏయూ ఛైర్మన్‌ మేకీ సాల్‌ తెలిపారు. ఆఫ్రికా దేశాలు 44 శాతం గోధుమలను రష్యా, ఉక్రెయిన్‌ నుంచే దిగుమతి చేసుకుంటాయి. పుతిన్‌ మాత్రం పాశ్చాత్య దేశాల ఆంక్షలే దీనికి కారణమని పేర్కొన్నారు. ఆహార కొరతపై ఐక్యరాజ్యసమితి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 15 నుంచి 20 శాతం ప్రజలను యుద్ధం ఆహార సంక్షోభంలోకి నెట్టిందని, తక్షణమే రష్యా తన నౌకాశ్రయాలను తెరిచి ఈ విపత్తును నివారించాలని కోరింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.