'తైవాన్​ను చైనాకు అప్పగించండి!'.. మస్క్ మరో శాంతి మంత్రం.. మండిపడ్డ ఇరుదేశాలు

author img

By

Published : Oct 9, 2022, 10:24 PM IST

China Taiwan tensions

ఇటీవలే రష్యా-ఉక్రెయిన్ శాంతి ప్రణాళికతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మరోసారి వివాదాస్పద ప్రతిపాదన చేశారు. చైనా-తైవాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు యుద్ధం దిశగా సాగుతున్న వేళ.. మస్క్‌ మరో శాంతి ప్రణాళిక ప్రతిపాదించారు. మస్క్‌ ప్రతిపాదనపై తైవాన్‌ భగ్గుమనగా.. ఎలాన్‌ గీత దాటారంటూ చైనా విమర్శించింది.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక బెడిసికొట్టినా.. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ వెనక్కి తగ్గడం లేదు. ఈ శాంతి ప్రణాళికతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న మస్క్‌.. చైనా-తైవాన్‌ ఉద్రిక్తతలు తగ్గేందుకు తన దగ్గర మరో ఉపాయం ఉందని ప్రకటించారు. తైవాన్‌పై కొంత నియంత్రణను బీజింగ్‌కు అప్పగించడం ద్వారా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించవచ్చని మస్క్ సూచించారు. చైనా ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ జోన్‌గా తైవాన్‌ను మార్చవచ్చని ప్రతిపాదించారు. ఫైనాన్షియల్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్‌ ఈ ప్రతిపాదన చేశారు. ఇది సహేతుకమైన ఆలోచనగా అభివర్ణించిన మస్క్‌.. దీనివల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని సూచించారు.

మస్క్‌ ప్రతిపాదనపై తైవాన్‌ మండిపడింది. మస్క్ వ్యాఖ్యలు తమ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమే అని.. అది ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తుందని తైవాన్‌ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అధికార ప్రతినిధి హువాంగ్ త్సై లిన్ విమర్శించారు. మస్క్.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ దుష్ప్రవర్తనను ఖండించలేదని.. కానీ తైవాన్‌ స్వాతంత్ర్యాన్ని త్యాగం చేయమని హితోపదేశం చేస్తున్నారని హువాంగ్‌ ఎద్దేవా చేశారు. తైవాన్‌లోని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, కోమింటాంగ్, న్యూ పవర్ పార్టీ, తైవాన్ పీపుల్స్ పార్టీలు మస్క్ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు జారీ చేశాయి.

మస్క్‌ లక్ష్మణ రేఖను అతిక్రమించారని దీనిపై విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించిందని చైనా ప్రభుత్వ ఆధీనంలోని సెంట్రల్ టెలివిజన్ న్యూస్ వార్త కథనాన్ని ప్రసారం చేసింది. మస్క్‌ ప్రకటన అనుచితమైనదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ విమర్శించారు. తైవాన్ సమస్య చైనా అంతర్గత వ్యవహారమని ఇందులో విదేశీ వ్యక్తులు, దేశాల జోక్యాన్ని సహించబోమని నింగ్‌ స్పష్టం చేశారు. మస్క్‌కు చైనాలో ఎక్కువ వ్యాపారాలు ఉన్నాయని.. అందుకే ఇలాంటి ప్రకటన చేసి ఉండొచ్చన్న ఆరోపణలు ఉన్నాయి.

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి ఆగస్టులో తైవాన్‌లో పర్యటించిన తర్వాత.. చైనా-తైవాన్‌ మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. తైవాన్ సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ దక్షిణ చైనా సముద్రంలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తూ చైనా దుందుడుకుగా వ్యవహరిస్తోంది.

ఇవీ చదవండి: అర్ధరాత్రి రష్యా మెరుపు దాడి.. 17 మంది మృతి.. అనేక ఇళ్లు ధ్వంసం

పాక్​ మంత్రిని కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు.. ఒక రోజు తర్వాత..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.